ఏపీ రైతులకు రూ.5500 భరోసా నగదు, 7 లక్షల అన్నదాతలకు మేలు, 10 వేల ఆర్బీకే సెంటర్లు: జగన్
రైతులను అన్నివిధాలా ఆదుకుంటామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భరోసా నిచ్చారు. రైతు భరోసాతో అన్నదాతకు పెట్టుబడి సాయం అందుతుందని వివరించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రూ.వెయ్యి ఎక్కువగా రైతులకు సాయం అందజేస్తున్నామని చెప్పారు. మేనిఫెస్టోలో రూ.12500 ఇస్తామని చెప్పిన సంగతి తెలిసిందే. ఏడాదికి రూ.13500 నాలుగు విడతల్లో అందజేస్తున్నామని గుర్తుచేశారు.
Recommended Video
ఏప్రిల్లో రూ.2 వేలు రైతుల ఖాతాల్లో నగదు జమ చేశామన్నారు. శుక్రవారం మరో రూ.5500 జమవుతున్నాయని పేర్కొన్నారు. అక్టోబర్లో మరో 4 వేలు, సంక్రాంతికి మరో 2 వేలు అందజేస్తామని తెలిపారు. కౌలు రైతులకు రూ.7500 ఇస్తున్నామని వివరించారు. రైతు భరోసా కోసం శుక్రవారం 2.800 కోట్లు నిధులను విడుదల చేశామని తెలిపారు.
అందరికీ రైతు భరోసా..
రైతు భరోసా నగదు పార్టీలు, కుత, మతాలకతీతంగా అందజేస్తామని సీఎం జగన్ తెలిపారు. ఈ నగదు బ్యాంకుల్లో జమకాకుంటే 1902కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని కోరారు. టోల్ ఫ్రీ నంబర్ సీఎం పేషీలో ఉంటుందని, వెంటనే మీ సమస్య పరిష్కారం చేస్తారని జగన్ పేర్కొన్నారు. నగదు రైతులు మాత్రమే వాడుకునేలా బ్యాంకర్లతో మాట్లాడామని, రైతు నగదు కట్ చేయమని భరోసా ఇచ్చాకే... నగదు జమచేశామని జగన్ వివరించారు.
గతేడాది మంచిగా వర్షాలు కురవడంతో 1.72 లక్షల టన్నుల ధాన్యం పండించారని, ఈసారి కూడా వరణుడు కరుణించాలని జగన్ కోరారు. రైతులకు ఇబ్బంది కలుగకుండా ఉండేందుకు పగటిపూట 9 గంటల కరెంట్ అందజేసేందుకు ప్రయత్నిస్తున్నామని జగన్ తెలిపారు.
7 లక్షల రైతులకు మేలు
రైతు భరోసా నిధులతో 7 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. 1.5 ఎకరాల భూమి ఉన్న 50 శాతం రైతులకు పెట్టుబడి ఖర్చు మొత్తం అందనుంది. గతేడాది మే 30వ తేదీన తమ ప్రభుత్వం కొలువుదీరిందని సీఎం జగన్ తెలిపారు. ఈ నెల 30వ తేదీన 10 వేల 641 రైతు భరోసా కేంద్రాలు (ఆర్బీకే) అవిష్కరిస్తామని జగన్ తెలిపారు.
భూసార పరీక్షలు
రాష్ట్రంలో 11 వేల 600 గ్రామ సచివాలయాలు ఉండగా... ఆర్బీకేలు 10 వేల 600 ఉంటాయని.. ఇక్కడ రైతులకు సంబంధించి భూసార పరీక్షలు చేస్తామని చెప్పారు. పంటకు ఇన్సూరెన్స్, గిట్టుబాటు ధర కూడా అగ్రికల్చర్ అసిస్టెంట్ కల్పిస్తారని తెలిపారు. ఏ సమస్య ఉన్నా.. ఇక్కడ సిబ్బందిని సంప్రదించాలని సూచించారు.
వైఎస్ఆర్ జనతా బజార్
వచ్చే ఏడాది నాటికి వైఎస్ఆర్ జనతా బజార్లు నెలకొల్పుతామని జగన్ స్పష్టంచేశారు. ఇందులో పండ్లు, కూరగాయాలు, గుడ్లు, రొయ్యలు, చేపలను విక్రయిస్తారని తెలిపారు. తర్వాత వైఎస్ఆర్ చేనేత బజార్ నెలకొల్పి... చేనేత ఉత్పత్తులను విక్రయిస్తామని జగన్ తెలిపారు.