ఆంధ్రప్రదేశ్:ఆర్టీఐకి ముగ్గురు కొత్త కమిషనర్లు...చీఫ్ కమీషనర్ గా ఎకె జైన్?
అమరావతి:ఎపి సమాచారహక్కు చట్టం కమిషనర్లుగా ముగ్గురిని రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కమిటీ గురువారం విజయవాడలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఈ విషయమై సమావేశమైంది.
Recommended Video
రిటైర్డ్ ఐపీఎస్ అధికారి బీవీ రమణకుమార్, రిటైర్డ్ ఐఎఫ్ఎస్ అధికారి ఎం రవికుమార్, హైకోర్టు న్యాయవాది కట్టా జనార్దనరావు పేర్లను ఈ పోస్టుల కొరకు ఎంపిక చేసి గవర్నర్ ఆమోదం కోసం ఈ కమిటీ పంపింది. మరోవైపు ఆర్టీఐ చీఫ్ కమిషనర్గా ఏకే జైన్ పేరును రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసినట్లు సమాచారం. అయితే చీఫ్ కమిషనర్ ఎంపికకు సంబంధించి నోటిఫికేషన్ తరువాత ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
నియామకంలో జాప్యం...కోర్టు లో వ్యాజ్యం
ఉమ్మడి రాష్ట్రంలో నియమించిన ఆర్టీఐ కమిషనర్ల పదవీకాలం చాలాకాలం కిందటే ముగిసినా కొత్త వారి నియామకంలో తీవ్ర జాప్యం జరిగిన సంగతి తెలిసిందే. దీనిపై హైకోర్టులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం సైతం దాఖలైంది. కోర్టు ఆదేశాల నేపథ్యంలో ముఖ్యమంత్రి నేతృత్వంలోని కమిటీ సమావేశమై చీఫ్ కమిషనర్తోపాటు కమిషనర్లను ఎంపిక చేయాల్సిఉంది. ఈ కమిటీలో సీనియర్ మంత్రి, ప్రతిపక్షనేత సభ్యులుగా ఉంటారు.
కమిటీ సమావేశం...తుది నిర్ణయం
ఈ నేపథ్యంలో బుధవారం ప్రతిపక్ష నేత జగన్ కు సమావేశానికి రావాల్సిందిగా మూడుసార్లు ఫోను చేసినా, ఏ విషయమూ చెప్పలేదని...అందువల్ల గురువారం మధ్యాహ్నం తర్వాత సీఎంతో పాటు మంత్రి యనమల రామకృష్ణుడు ఈ విషయమై సమావేశమై తుది నిర్ణయం తీసుకున్నారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
ముగ్గురు కమీషనర్లు...బ్యాక్ గ్రౌండ్
కొత్త కమిషనర్లుగా ప్రభుత్వ కమిటీ ప్రతిపాదించిన వారిలో బీవీ రమణ కుమార్ 1958లో కృష్ణా జిల్లా కైకలూరులో జన్మించారు. డీఎస్పీగా 1987లో పోలీసుశాఖలో చేరి, విజయవాడ జాయింట్ పోలీస్ కమిషనర్గా 2018 ఫిబ్రవరిలో పదవీ విరమణ పొందారు. కట్టా జనార్దనరావు 1960 జూన్లో కడప జిల్లా చిట్వేల్లో జన్మించి తిరుపతి ఎస్వీ వర్సిటీలో బీకామ్, బీఎల్ పూర్తి చేశారు. చట్టాలపై ఆయనకున్న పట్టుతోనే ఈ ఎంపిక జరిగినట్లు తెలుస్తోంది. ప్రకాశం జిల్లాకు చెందిన రిటైర్డ్ ఐఎఫ్ఎస్ అధికారి రవికుమార్ తిరుపతి వైల్డ్లైఫ్ డీఎఫ్వోగా పనిచేస్తూ గత ఏడాదే రిటైరయ్యారు.
చీఫ్ కమీషనర్...ఎకె జైన్?
ఇదిలా ఉండగా ఎపి ఆర్టీఐ చీఫ్ కమిషనర్గా ఏకే జైన్ పేరును రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే సాంకేతిక కారణాల రీత్యా చీఫ్ కమిషనర్ ఎంపికకు సంబంధించి నోటిఫికేషన్ తరువాత ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.