ఆటోలపై థ్యాంక్యూ స్టిక్కర్లు: చంద్రబాబును ఫాలో అవుతున్న వైఎస్ జగన్: పబ్లిసిటీపై గాలి మళ్లిందా?
Recommended Video
అమరావతి: రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నారనే పేరు ఉంది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి. ఎన్నికల ప్రచార సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలపైనే ప్రధానంగా దృష్టి పెట్టారు. అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల వ్యవధిలోనే వాటన్నంటినీ నెరవేర్చే దిశగా చర్యలు తీసుకుంటున్నారు. నెరవేరుస్తున్నారు కూడా. గ్రామ వలంటీర్ల నియామకం, గ్రామ సచివాలయాల ఏర్పాటు, అందులో పని చేయడానికి ప్రత్యేకంగా ఉద్యోగాలను కల్పించడం, ఇవన్నీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలే.
ఆర్టీసీ విలీనం : జగన్ చేసింది కేసీఆర్ చెయ్యలేడా : తెలంగాణా సీఎం నిర్ణయంలో మతలబు ఇదేనా ?
పబ్లిసిటీ షురూ..
మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలను అమలు చేయడంపైనే తన దృష్టిని, పరిపాలన వ్యవహారాలను కేంద్రీకరించిన వైఎస్ జగన్.. ప్రతిపక్ష పార్టీల నుంచి ఎన్ని విమర్శలు వచ్చినా పెద్దగా పట్టించుకున్నట్టు గానీ, దానిపై స్పందించిన దాఖలాలు గానీ ఎక్కడా లేవు. గ్రామ సచివాలయ ఉద్యోగులకు నిర్వహించిన పరీక్షా పత్రాల లీక్ అయ్యాయని, దీనికి కారణం ముఖ్యమంత్రేనంటూ తెలుగుదేశం పార్టీ నాయకులు చేసిన హై ఓల్టేజ్ విమర్శలను కూడా వైఎస్ జగన్ పట్టించుకోలేదు. అదే సమయంలో- ఫలానా హామీని అమలు చేశామని చెప్పుకోనూ లేదు. దీనిపై మీడియాకు అడ్వర్టయిజ్ మెంట్లు ఇచ్చిన సందర్భాలు కూడా చాలా తక్కువే.
ప్రచారంపై గాల్లి మళ్లినట్టేనా?
తాజాగా- వైఎస్ జగన్ కు పబ్లిసిటీపై గాలి మళ్లినట్టు కనిపిస్తోంది. ఎన్నికల ప్రచార సమయంలో ఇచ్చిన హామీల్లో ఒకటి.. ఆటో డ్రైవర్లకు ఏటా 10 వేల రూపాయల ఆర్థిక సహాయం. దీన్ని కూడా అమలు చేశారు. అక్కడి దాకా బాగానే ఉంది. ఈ హామీకి సంబంధించిన పబ్లిసిటీని మాత్రం పీక్స్ లోకి తీసుకెళ్లినట్టు కనిపిస్తోంది. వైఎస్ జగన్, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ చిత్రాలతో ఉన్న స్టిక్కర్లను సరఫరా చేస్తోంది ప్రభుత్వం. రవాణా శాఖకు చెందిన మోటార్ వెహికల్ ఇన్స్ పెక్టర్ల ద్వారా వాటిని ప్రతి ఆటో డ్రైవర్ కు అందజేస్తోంది. అందజేయడమేంటీ? స్వయంగా ఎంవీఐలే వాటిని ఆటోల వెనుక అతికిస్తున్నారు.
చంద్రబాబుపై విమర్శలు చేసి.. అదే బాటలో
ఇదివరకు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అచ్చంగా ఇదే వైఖరిని అవలంభించారు. థ్యాంక్యూ సీఎం అనే స్టిక్కర్లను ఆటోల వెనుక, ఆర్టీసీ బస్సులకు పెద్ద ఎత్తున ప్రతిబింబించేలా ఏర్పాటు చేయించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలు సహా, ప్రధాన నగరాలు, పట్టణాల్లో థ్యాంక్యూ సీఎం అనే హోర్డింగులు వెలిశాయి. తుఫాన్ వచ్చినా సరే.. థ్యాంక్యూ సీఎం అనే హోర్డింగులు, స్టిక్కర్లు తప్పనసరి. దీనిపై అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్ జగన్ సహా ఆ పార్టీ నాయకులందరూ చంద్రబాబు వైఖరిని తప్పు పట్టారు.
పార్టీ కార్యకర్తల్లో ఆవేదన..
ఇప్పుడు అదే తప్పును వైఎస్ జగన్ కూడా చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఏ కారణం వల్ల తాము చంద్రబాబును విమర్శించాల్సి వచ్చిందో.. ఇప్పుడు అవే తరహా విమర్శలకు తాము కారణమౌతున్నామనే ఆవేదన పార్టీ కార్యకర్తల్లో వ్యక్తమౌతోంది. ఇదంతా వైఎస్ జగన్ కు తెలిసి జరుగుతోందా? తెలియక జరుగుతోందా? అనేది అర్థం కావట్లేదని వాపోతున్నారు సగటు పార్టీ కార్యకర్తలు. ఆటోల వెనుక స్టిక్కర్లను అతికించే బాధ్యతను కూడా మోటార్ వెహికల్ ఇన్ స్పెక్టర్లకే అప్పగించినట్టు ఉందని, అధికార దుర్వినియోగమౌతుందని చెబుతున్నారు.