కోవిడ్ అలర్టింగ్ ట్రాకింగ్ సిస్టమ్:కదలికలను పట్టేస్తారు:దేశంలోనే తొలిసారిగా..జగన్ సర్కార్ వైపు చూపు
అమరావతి: ప్రాణాంతక కరోనా వైరస్ విస్తరిస్తోన్న దేశవ్యాప్తంగా ఆందోళనకరంగా విస్తరిస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో మన రాష్ట్రంలో దాని సంఖ్య పరిమితంగానే ఉంటోంది. ఇప్పటిదాకా 23 పాజిటివ్ కేసులు మాత్రమే నమోదు అయ్యాయి. కరోనా వైరస్ బారిన పడి మరణించిన వారి సంఖ్య జీరో. ఈ వైరస్ బారిన పడిన తొలి పేషెంట్ కోలుకున్నాడు కూడా. జనాభా అధికంగా ఉన్న రాష్ట్రాల్లో కరోనా వైరస్ విస్తరిస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో.. ఏపీలో ఆ స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదు కాకపోవడం చర్చనీయాంశమైంది.
ఏపీలో మరో రెండు పాజిటివ్: రెండూ తూర్పు గోదావరి జిల్లాలోనే..: 23కు చేరిన కరోనా కేసులు
మరోసారి అందరి చూపు ఏపీ వైపు..
గ్రామ, వార్డు వలంటీర్ల వ్యవస్థ ద్వారా విదేశాల నుంచి స్వస్థలాలకు చేరుకున్న వారిని సరైన సమయంలో గుర్తించడం వల్లే ఆది సాధ్యపడిందని జగన్ సర్కార్ చెబుతోంది. ఆ వ్యవస్థ విజయవంతం కావడం వల్ల కేరళ వంటి ఒకట్రెండు రాష్ట్రాలు ఇలాంటి క్లిష్ట సమయంలో వలంటీర్ల నియామకానికి చర్యలు సైతం చేపట్టాయి. తాజాగా- మరో వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టింది రాష్ట్ర ప్రభుత్వం. మరోసారి అన్ని రాష్ట్రాల చూపును తన వైపు తిప్పుకొనేలా చేసింది ప్రభుత్వం.
కోవిడ్ అలర్టింగ్ ట్రాకింగ్ సిస్టమ్..
కొత్తగా కోవిడ్ అలర్టింగ్ ట్రాకింగ్ సిస్టమ్ను తెరమీదికి తీసుకొచ్చింది. హోమ్ క్వారంటైన్లో ఉన్న వారి కదలికలను గుర్తించడానికి ఉద్దేశించిన సరికొత్త ట్రాకింగ్ సిస్టమ్ ఇది. దేశంలోనే తొలిసారిగా ఈ తరహా సాఫ్ట్వేర్ను అభివృద్ధి చేసింది ప్రభుత్వం. విదేశాల నుంచి వచ్చిన వారిని 14 రోజుల పాటు హోమ్ క్వారంటైన్లో ఉండాలంటూ ప్రభుత్వం ఆదేశించినప్పటికీ.. దాన్ని బేఖాతర్ చేస్తూ తిరిగే వారిపై నిఘా ఉంచింది ఈ ట్రాకింగ్ సిస్టమ్ ద్వారా హోమ్ క్వారంటైన్లో ఉండకుండా.. ఎక్కడెక్కడికి వెళ్లారనే విషయాన్ని స్పష్టంగా తెలిపేలా దీన్ని రూపొందించారు.
రాష్ట్ర ప్రభుత్వమే అభివృద్ధి చేసిన టూల్
ఈ కోవిడ్ అలర్టింగ్ ట్రాకింగ్ సిస్టమ్ను రాష్ట్ర ప్రభుత్వమే అభివృద్ది చేసింది. ప్రకృతి వైపరీత్యాల నిర్వహణా విభాగం అధికారులు దీన్ని రూపొందించారు. ఒకేసారి 25 వేల మంది కదలికలను పసిగట్టే సామర్థ్యం ఈ సాఫ్ట్వేర్కు ఉంది. ఇప్పటిదాకా ఇలాంటి అత్యాధునిక వ్యవస్థ అంటూ ఏదీ ఇతర రాష్ట్రాల్లో లేదు. హోమ్ క్వారంటైన్లో ఉంటోన్న వారి సెల్ ఫోన్ నంబర్కు అనుసంధానం చేస్తారు. వారు వినియోగించే ఈ సెల్ఫోన్ నంబర్ను ఆధారంగా చేసుకుని సెల్ టవర్, సర్వీసు ప్రొవైడర్ల ద్వారా హోమ్ క్వారంటైన్లో ఉన్న అనుమానితుల కదలికలను ఎప్పటికప్పుడు పసిగట్టడానికి అవకాశం ఉంటుంది.
వంద మీటర్లు దాటితే..
ప్రస్తుతం ప్రభుత్వం 25 వేల మందికి సంబంధించిన అన్ని ఫోన్ నంబర్లు, డేటా వివరాలన్ని నిక్షిప్తమై ఉన్నాయి. కోవిడ్ అలర్టింగ్ ట్రాకింగ్ నిఘాలో ఉన్న కరోనా వైరస్ అనుమానితుడు.. తన ఇంటి నుంచి వంద మీటర్ల పరిధిని దాటి వెళ్తే.. వెంటనే ఆ సమాచారం ఈ ట్రాకింగ్ సిస్టమ్ ద్వారా వెంటనే జిల్లా అధికారులకు చేరిపోతోంది. వెంటనే వారు ఆ అనుమానితుడికి ఫోన్ చేస్తారు. వెంటనే ఇంటికి వెళ్లాల్సిందిగా ఆదేశిస్తారు. అదే సమయంలో- సంబంధిత పోలీస్ స్టేషన్కు ఈ సమాచారాన్ని చేరవేస్తారు. మొబైల్ నంబర్, ఇంటి అడ్రస్, వీధి, ల్యాండ్ మార్క్.. ఇవన్నీ పోలీసులకు అందుతాయి.
15 నిమిషాల్లో..
ఇంటి నుంచి బయటికి వచ్చిన తరువాత ఈ వంద మీటర్ల పరిధిలో ఆ అనుమానితుడు ఎక్కడెక్కడ తిరిగారనే సమాచారం కూడా జిల్లా అధికార యంత్రాంగానికి చేరుతుంది. అదే సమాచారాన్ని వారు పోలీస్ స్టేషన్కు అందజేస్తారు. ఈ మొబైల్ నంబర్కు సంబంధించిన ట్రాకింగ్ సమాచారం మొత్తాన్నీ తమకు అందజేయాల్సి ఉంటుందని ప్రభుత్వం ఇప్పటికే అన్ని మొబైల్ సర్వీస్ ప్రొవైడర్లకు ఆదేశాలను జారీ చేసింది.