అభివృద్ది వికేంద్రీకరణ దిశగా తొలి అడుగు : ఆ మూడు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీల పరిధి పెంపు
రాష్ట్రంలో పట్టణాభివృద్ధి సంస్ధల పరిధులు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గోదావరి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(గుడా),తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(తుడా),అనంతపురం-హిందూపూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(అహుడా) పరిధులను పెంచుతున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. గుడా పరిధిలో కొత్తగా మరో 4 పట్టణ స్థానిక సంస్థలు,236 గ్రామాలను చేరుస్తున్నట్టు పేర్కొంది. దీంతో గుడా పరిధి 4388చ.కి.మీకి విస్తరించింది. అలాగే నగరి మున్సిపాలిటీతో పాటు మరో 413 గ్రామాలను తుడా పరిధిలోకి తీసుకొచ్చింది.
దీంతో తుడా పరిధి 4527చ.కి.మీకి విస్తరించింది. ఇక ఆహుడా పరిధిలోకి కొత్తగా రాప్తాడు, రామగిరి, ఆత్మకూరు, చెన్నెకొత్తపల్లి, కనగానపల్లి గ్రామాలను చేర్చింది. తాజా మార్పుతో అహుడా పరిధి 6591చ.కి.మీకి పెరిగింది. ప్రభుత్వం అభివృద్ది వికేంద్రీకరణ బిల్లును తీసుకొచ్చిన కొద్దిరోజులకే ఆయా పట్టణాల అభివృద్ది కోసం వాటి పరిధులను పెంచుతూ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
కాగా,ప్రభుత్వం తీసుకొచ్చిన అభివృద్ది వికేంద్రీకరణ,సీఆర్డీఏ బిల్లులను శాసనమండలి సెలెక్ట్ కమిటీకి పంపించిన సంగతి తెలిసిందే. ఇది చట్ట విరుద్దం అని వైసీపీ,మండలి ఛైర్మన్ చట్ట ప్రకారమే వ్యవహారించారని టీడీపీ వాదించుకుంటున్నాయి. బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపించారు కాబట్టి కనీసం 3 నెలలు సమయం పట్టే అవకాశం ఉంది.
రెండు బిల్లుల కోసం రెండు కమిటీలను నియమించే అవకాశం ఉంది. బిల్లులను ప్రతిపాదించిన మంత్రినే కమిటీకి ఛైర్మన్గా నియమించనున్నారు. అంటే, సీఆర్డీఏ రద్దు బిల్లుకు మున్సిపల్ మంత్రి బొత్స సత్యనారాయణ,అభివృద్ది వికేంద్రీకరణ బిల్లుకు ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఛైర్మన్గా వ్యవహరిస్తారు. మండలిలో ఉన్న సంఖ్యాబలం రీత్యా టీడీపీ నేతలకే ఇందులో ఎక్కువ ప్రాతినిధ్యం దక్కే అవకాశం ఉంది. టీడీపీ నుంచి ఐదుగురు,వైసీపీ,బీజేపీ,పీడీఎఫ్ పార్టీల నుంచి ఒక్కొక్కరికి ప్రాతినిధ్యం దక్కవచ్చు.