విజయసాయి రెడ్డికి వేతనం కట్ : జగన్ ప్రభుత్వం నిర్ణయం : హోదా మాత్రమే...!!
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వైసీపీలో దాదాపు రెండో స్థానంలో ఉన్న రాజ్యసభ సభ్యుడు విజయ సాయిరెడ్డి విషయంలో తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఆయనకు వేతనం లేకుండా హోదా మాత్రమే కొనసాగేలా ప్రభుత్వం నిర్ణయించింది. పార్లమెంటరీ పార్టీ నేతగా ఉన్న విజయ సాయి రెడ్డి నాడు జగన్ పార్టీ ఏర్పాటు చేసిన సమయం నుండి ఆయనతో పాటే ఉన్నారు. ఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వ పెద్దలతో సత్సంబంధాలు కొనసాగిస్తూ సంధాన కర్తగా మారారు.
అయితే..ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిత తరువాత ముఖ్యమంత్రి జగన్ ఆయన్ను రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రతినిధిగా నియమిస్తూ నిర్ణయించారు. ఆ సమయంలో సాంకేతిక అంశాలు అడ్డుగా మారాయి. దీంతో..ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేసి..ఆ స్థానంలో ఆర్దినెన్స్ తెచ్చారు. సవరణల ద్వారా విజయ సాయిరెడ్డిని ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియమిస్తూ మరో సారి ఉత్తర్వులు జారీ చేసారు. ఇక, ఇదే అంశం మీద తాజాగా టీడీపీ నేతలు రాష్ట్రపతికి ఫిర్యాదు చేసారు. ఇది కొనసాగుతుండగానే..విజయ సాయి రెడ్డికి వేతనం లేకుండా హోదా మాత్రమే కొనసాగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఏపీలో..ఇక 13 కాదు..25 జిల్లాలు: సీఎం మరో హామీ అమలు దిశగా: ముహూర్తం ఖరారు..!!
విజయ సాయిరెడ్డి జీత భత్యాలు లేకుండా...
ఢిల్లీలోని ఏపీ భవన్ లో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రతినిధిగా నియమితులైన విజయ సాయి రెడ్డి విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆయనను ప్రత్యేక ఆర్దినెన్స్ ద్వారా సవరణలు చేసి జగన్ ప్రభుత్వం ఆ పోస్టులో నియమించింది. రాజ్యసభ సభ్యుడిగా ఉన్న వ్యక్తి ఇతర లాభదాయక పదవుల్లో కొనసాగకూడదని చట్టం స్పష్టం చేస్తోంది. వైసీపీ ప్రభుత్వం విజయ సాయి రెడ్డికి ఈ పదవి కట్టబెడుతూ నిర్ణయం తీసుకోగానే దీని పైన టీడీపీ ఫిర్యాదులు మొదలు పెట్టింది. అయితే..చట్ట సవరణ ద్వారా విజయ సాయి రెడ్డిని తిరిగి అదే హోదాలో కొనసాగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా బీజేపీ నుండి టీడీపీలో చేరిన రామకోటయ్య విజయ సాయి రెడ్డి మీద రాష్ట్రపతికి ఫిర్యాదు చేసారు. ఆయన లాభదాయక పదవిలో కొనసాగుతున్నారని..ఆయన పైన అనర్హత వేటు వేయాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇది ఇలా ఉండగానే...ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ భవనలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా కొనసాగుతున్న విజయసాయిరెడ్డికి ఆ పదవి కింద ఎటువంటి జీత..భత్యాలు ఇవ్వటం లేదని స్పష్టం చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీని ద్వారా విజయ సాయిరెడ్డి కేవలం ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి హోదాలో మాత్రమే ఉంటారు. ఆ మేరకు ఆయనకు ఎటువంటి ఆదాయం పొందరు. దీని ద్వారా ఆయన లాభ దాయక పదవుల్లో ఉన్నారనే విమర్శలకు పూర్తిగా ముగింపు పలికేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
టీడీపీకి టార్గెట్ అవుతున్న సాయిరెడ్డి..
విజయ సాయిరెడ్డి ఏపీలో ముఖ్యమంత్రి జగన్ కంటే ఒక విధంగా టీడీపీ నేతలకు ఎక్కువగా టార్గెట్ అవుతున్నారు. ఢిల్లీలో ఆయన కేంద్ర ప్రభుత్వ పెద్దలకు దగ్గరవటం.. అక్కడి వ్యవహారాలు చక్కచెట్టటం ద్వారా ఎన్నికల ముందు నుండి టీడీపీ సాయిరెడ్డిని లక్ష్యంగా చేసుకుంది. ఎన్నికల ముందు టీడీపీ పైన నేరుగా ప్రధానికి ఫిర్యాదులు చేసింది సాయి రెడ్డే అంటూ టీడీపీ నేతలు చెబుతున్నారు. ఇక, ఇప్పుడు సైతం సాయి రెడ్డి తన ట్వీట్ల ద్వారా టీడీపీని ప్రధానంగా చంద్రబాబు..లోకేశ్ మీద విరుచుకుపడుతున్నారు.
ప్రతీ అంశం మీద సాయిరెడ్డి ఢిల్లీ రాజకీయాల్లో
దీంతో..టీడీపీ నేతలు సైతం అదే స్థాయిలో రియాక్ట్ అవుతున్నారు. ప్రతీ అంశం మీద సాయిరెడ్డి ఢిల్లీ రాజకీయాల్లో బిజీగా ఉన్నా ఇక్కడ టీడీపీని మాత్రం వదలటం లేదు. ఇక, కేంద్రానికి..ఏపీ ప్రభుత్వానికి సంధానకర్తగా వ్యవహరిస్తున్న విజయ సాయిరెడ్డికి ప్రత్యేక ప్రతినిధి హోదా ఇచ్చినప్పటి నుండి టీడీపీ నేతలు విమర్శలు కొనసాగిస్తున్నారు. ఇక, తాజగా రాష్ట్ర ప్రభుత్వం ఈ హోదాలో నియమితులైన సాయిరెడ్డికి ఎటువంటి చెల్లింపులు చేయకూడదని నిర్ణయించటంతో ఆయన మీద ఈ వ్యవహారంలో విమర్శలకు టీడీపీ ఇక అవకాశం లేకుండా పోయింది.