మందు బాబులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్.. దుకాణాల పని వేళలు పెంపు
ఆంధ్రప్రదేశ్లో మందు బాబులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఇటీవల మద్యం రేటు తగ్గించిన ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా మద్యం దుకాణాల పని వేళలను పెంచింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో కంటే ఒక గంట పాటు మద్యం దుకాణాల పనివేళలను పొడిగించింది. రాత్రి 10 గంట వరకు మద్యం అందుబాటులో ఉంటుందని పేర్కొంది.

మద్యం దుకాణాల పని వేళలు మరో గంట పెంపు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మద్యం ఆదాయం పెంపుపై దృష్టి పెట్టింది. వరుసగా కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. మందుబాబుల కోసం కొత్త ఏడాది గిప్ట్గా బ్రాండెండ్ లిక్కర్ను ఏపీ ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చింది. తాజాగా మరో శుభవార్త చెప్పింది. మద్యం షాపుల పనివేళలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు రాత్రి 9గంటల వరకు తెరిచిఉండే దుకాణాలను 10 గంటల వరకు పొడిగించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. రాత్రి 10 గంటల తర్వాత ఖాతాల నిర్వహణకు మరో గంట సమయం పొడిగిస్తున్నట్లు పేర్కొంది. ఈ నిబంధనలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మద్యం దుకాణాలకు వర్తిస్తాయని తెలిపింది.

మద్యం ధరలు తగ్గింపు
ఇటీవల రాష్ట్రంలోని మద్యంపై పన్ను రేట్లలో కూడా మార్పులు చేసింది. ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ మద్యంపై 5 నుంచి 12 శాతం ధరలు తగ్గించింది. అలాగే ఇతర అన్ని రకాల బ్రాండెండ్ మద్యంపై 20 శాతం వరకు ధరలు తగ్గించింది. ప్రముఖ బీర్లపై ఉన్న వ్యాట్ 10 నుంచి 20 శాతానికి, అడిషనల్ ఎక్సయిజ్ డ్యూటీ 36 శాతం, స్పెషల్ మార్జిన్ 36 శాతం తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రముఖ కంపెనీల లిక్కల్ అమ్మకాల ధరలను ప్రభుత్వం మార్పులు చేర్పులు చేసింది. ధరల తగ్గించడంతో ఇతర రాష్ట్రాల నుంచి మద్యం అక్రమ రవాణాను అరికట్టేందుకు దోహదం చేస్తుందని పేర్కొంది.

వైన్ షాపుల పని వేళల పెంపుపై విమర్శలు
రాష్ట్రంలో కరోనా విజృంభిస్తోంది. రోజు రోజుకు కేసుల సంఖ్య పెరుగుతోంది. ఈనేపథ్యంలో ఈనెల 18 నుంచి ప్రభుత్వం నైట్ కర్ఫ్యూ అమలు చేస్తోంది. ప్రతిరోజు రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు ఈ రాత్రి కర్ఫ్యూ పెట్టనున్నారు. దీంతో పాటు పలు ఆంక్షలను రాష్ట్ర ప్రభుత్వం విధించింది. కరోనా థర్డ్ వేవ్ ముంచుకోస్తున్న సమయంలో దాని నియంత్రణపై దృష్టి పెట్టకుండా ఈ మద్యం దుకాణాల సమయాన్ని పొడిగించడంపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. సీఎం జగన్కు మద్యం ఆదాయం పెంచుకోవడంపై ఉన్న శ్రద్ధ ప్రజల ప్రాణాలపై లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.