ఏపీలో ఓటు హక్కు లేకున్నా.! ఇలాఐతే రద్దే?: ‘నంది’పై ప్రభుత్వం సీరియస్
Recommended Video
హైదరాబాద్: రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకటించిన నంది అవార్డుల వివాదం చినికి చినికి గాలి వానలా మారింది. సినీరంగ ప్రముఖుల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా తీవ్రంగా స్పందించింది. ఇలాంటి విమర్శలు సహించేది లేదని స్పష్టం చేసింది. అవసరమైతే అవార్డులను రద్దు చేసేందుకు కూడా వెనుకాడబోమని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
ఏపీ ప్రభుత్వం చుట్టూ తిరిగినా?, టీ మాత్రం: గుణశేఖర్ సంచలనం
నంది అవార్డులు అనుయాయులకు, తమ కులం వారికి ఇచ్చారన్న ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఆరోపణలు మరింత శ్రుతిమించి అవి నంది అవార్డులు కాదు.. సైకిల్ అవార్డులని కొందరు, సామాజిక అవార్డులని మరికొందరు తీవ్రస్థాయిలో విమర్శించారు. ఈ విషయంలో సినీ పరిశ్రమ రెండుగా విడిపోయింది. దీనిపై పెద్ద ఎత్తున డిబేట్లు కూడా జరిగాయి.
పొంతనలేని విమర్శలు..
రుద్రమదేవి సినిమాకు ఏపీ ప్రభుత్వం పన్ను మినహాయింపు ఇవ్వలేదన్న అంశాన్ని నంది అవార్డులతో ముడిపెట్టి విమర్శలు చేయడం.. సామాజిక వర్గాలను తెరపైకి తేవడం.. వ్యక్తిగత వివాదాలనూ జోడించడం దీనికి నిదర్శనమని అంటున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాన్ని బద్నాం చేసేలా జరుగుతున్న ఈ రాద్ధాంతాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించకూడదన్న అభిప్రాయాన్ని ప్రభుత్వ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి.
ఈ గోలెంటి..
ఈ విషయంలో ఇలాగే మౌనం వహిస్తే తెలుగు సినీ పరిశ్రమతోపాటు ఏపీ ప్రభుత్వానికి కూడా మచ్చ వచ్చే ప్రమాదం ఉందని గ్రహించిన చంద్రబాబు సర్కారు మౌనం వీడింది. అవార్డుల విషయంలో జరుగుతున్న రాద్దాంతంపై స్పందించింది. ఈ వ్యవహారం మరింత శ్రుతిమించితే ఏకంగా అవార్డులనే రద్దు చేయాలన్న ఆలోచనలో ఉంది. కళాకారులను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో అవార్డులు ఇస్తుంటే ఈ గోల ఏమిటంటూ ప్రభుత్వ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.
ఓటు హక్కు లేకున్నా..
రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలుగు సినీ పరిశ్రమ తెలంగాణలోనే ఉంటూ, అక్కడే పన్నులు కడుతున్నా తెలుగు వారంతా ఒక్కటే అన్న ఉద్దేశంతో అవార్డులు ఇస్తుంటే అనవసర రాద్దాంతం చేయడం ఎంత వరకు సబబు? అని ఏపీ ప్రభుత్వం ప్రశ్నించింది. ఈసారి నంది అవార్డు గ్రహీతల్లో చాలామందికి ఏపీలో కనీసం ఓటు హక్కు కూడా లేదన్న విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించింది. విదేశాల్లో ఉంటున్న తెలుగు వారు ఏపీలో ఆస్తులు కొనుక్కుని, ఇక్కడ కంపెనీలు పెడుతుంటే.. తెలంగాణలో ఉన్న కొందరు సినీ ప్రముఖుల తీరు మాత్రం ఇందుకు భిన్నంగా ఉందని ఆరోపించింది.
ఎంతో గ్రాండ్గా చేద్దామని..
నంది అవార్డులను ప్రకటించడంతోపాటు తెలుగువారు గర్వపడేలా విజయవాడలోని కృష్ణా నది పవిత్ర సంగమం ప్రాంతంలో అట్టహాసంగా అవార్డుల ప్రదానోత్సవం నిర్వహించాలని ప్రభుత్వం భావించిందని, తాజా పరిణామాలతో ప్రభుత్వం పునరాలోచనలో పడిందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ‘మూడేళ్ల నంది అవార్డులను ప్రకటించాం. అవార్డుల బహూకరణ కూడా మొక్కుబడిగా కాకుండా భారీగా చేయాలని నిర్ణయించాం. ఏవేవో కారణాలతో నంది అవార్డుల అంశాన్ని రచ్చ చేయడం, ప్రభుత్వాన్ని నిందించడం సరైన పద్ధతి కాదు' అని సమాచార, పౌర సంబంధాల శాఖలోని ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు.
ఇలా ఐతే అవార్డులు రద్దే..
కాగా, నంది అవార్డుల ఎంపిక కోసం కమిటీలను ఏర్పాటు చేయడం వరకే ప్రభుత్వం బాధ్యత అని, ఎంపికలో దాని ప్రమేయం ఉండదని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. అలా ఎంపికైన కమిటీలకు చైర్మన్లుగా గిరిబాబు, జీవిత, పోకూరి బాబూరావు ఉన్నారని, వారేమీ అనామకులు కాదని, అత్యంత అనుభవజ్ఞులని గుర్తు చేస్తున్నారు. వారు రూపొందించిన జాబితాను ఆమోదించడం తప్ప ప్రభుత్వం ఎటువంటి జోక్యం చేసుకోదని చెబుతున్నారు. కాబట్టి వివాదాలను పక్కనపెట్టాలని ప్రభుత్వ వర్గాలు కోరుతున్నాయి. వివాదం ఇలాగే కొనసాగితే అవార్డులను పూర్తిగా రద్దు చేయాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉందని అత్యంత విశ్వసనీయ సమాచారం.