ఏపీ సర్కారు గ్రీన్ సిగ్నల్: రాష్ట్రంలో రేపట్నుంచే తెరచుకోనున్న బార్లు, 20శాతం కరోనా రుసుం
అమరావతి: మద్యం ప్రియులకు ఈ వార్త తీపికబురే. ఎందుకంటే... రాష్ట్రంలో రేపటి(శనివారం) నుంచి బార్లు తెరిచేందుకు ఏపీ సర్కారు అనుమతిచ్చింది. రాష్ట్రంలో బార్ల లైసెన్సులు కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
840 బార్ల లైసెన్సులను 2021 జూన్ 30 వరకు కొనసాగిస్తున్నట్లు ప్రభుత్వం ఆ ఉత్తర్వులో పేర్కొంది. బార్ల లైసెన్సులపై 20 శాతం కరోనా రుసు విధిస్తున్నట్లు స్పష్టం చేసింది.
2020-21 సంవత్సరానికి అబ్కారీ శాఖ ఈ రుసుంను వసూలు చేయనుంది. ఇది ఇలావుంటే, బార్ల మద్యం విక్రయాలపై అదనంగా 10 శాతం రిటైల్ ట్యాక్సును వసూలు చేయడంతోపాటు లైసెన్సు రిజిస్ట్రేషన్ ఛార్జీలను 10 శాతం పెంచుతున్నట్లు ఏపీ సర్కారు పేర్కొంది.
కరోనా మహమ్మారి కారణంగా సుమారు ఆరు నెలలుగా బార్లు మూతపడిన విషయం తెలిసిందే. అన్లాక్లో భాగంగా ప్రభుత్వాలు దశలవారీగా అన్ని రంగాల కార్యకలాపాలకు అనుమతిస్తున్నాయి.
కాగా, ఏపీలో కరోనా కేసులు బారీగా పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో 74,710 నమూనాలను పరీక్షించగా, 8096 మందికి కరోనా సోకినట్లు తేలింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 6,09,558కి చేరింది. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 49,59,081 నమూనాలను సేకరించారు. ఒక్కరోజులో 69 మంది కరోనాతో మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో మృతి చెందినవారి సంఖ్య 5244కు చేరింది. గత 24 గంటల్లో 11,803 మంది కరోనా నుంచి కోలుకోగా, 84,423 యాక్టివ్ కేసులు ఉన్నాయి.