ఏపీపీఎస్సీలో కొత్త సభ్యుడు: ఛైర్మన్ ఉదయ భాస్కర్కు చెక్ పెట్టిందా? త్వరలో సలహాదారులు కూడా?
అమరావతి: రాష్ట్రంలో అత్యంత కీలకమైన పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ)లో రాష్ట్ర ప్రభుత్వం పెను మార్పులకు శ్రీకారం చుట్టినట్టు కనిపిస్తోంది. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్ ఉదయ భాస్కర్.. తెలుగుదేశం పార్టీ హయాంలో నియమితుడు కావడం, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడం.. కారణాల నేపథ్యంలో ఆయన చేతులు కట్టేసే దిశగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చర్యలు తీసుకోవచ్చంటూ ఇదివరకే వార్తలు వెలువడ్డాయి.
దీన్ని బలపరిచేలా కొత్తగా ఏపీపీఎస్సీలో మార్పులను చేపట్టింది ప్రభుత్వం. ఏపీపీఎస్సీ సభ్యుడిగా ఏవీ రమణారెడ్డిని నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నీ మంగళవారం నోటిఫికేషన్ను జారీ చేశారు. ప్రస్తుతం ఖాళీగా ఉన్న సభ్యుడి స్థానాన్ని రమణారెడ్డితో భర్తీ చేశారు. రమణా రెడ్డి స్వగ్రామం.. కర్నూలు జిల్లా నందికొట్కూరు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని మిడ్తూరు మండలం తాళంపూడి. ఆయనతో ఏపీపీఎస్సీలో ఉన్న సభ్యుడి స్థానాన్ని భర్తీ చేసింది ప్రభుత్వం.
స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా వ్యవహారం రాష్ట్రంలో ఏ స్థాయిలో రాజకీయ ప్రకంపనలను సృష్టించిందో ప్రత్యేకించి చెప్పుకోనక్కర్లేదు. జడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ల పర్వం ముగిసిన తరువాత ఎన్నికలు వాయిదా పడటం రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుందనే కారణంతో తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన సామాజిక వర్గానికి ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్కుమార్పై ఒత్తిడిని తెచ్చి, ఎన్నికలను వాయిదా వేయించిందంటూ వైసీపీ నాయకులు ఆరోపించారు.
వైసీపీ ఎంపీల సంచలన నిర్ణయం.: మూడు నెలల వేతనం పీఎం, సీఎం రిలీఫ్ ఫండ్లకు కేటాయింపు..
ఈ పరిస్థితుల్లో అదే సామాజిక వర్గానికి చెందిన ఉదయ భాస్కర్ కూడా భవిష్యత్తులో ప్రభుత్వ కార్యకలాపాలకు అడ్డుపడటానికి అవకాశం ఉందని జగన్ సర్కార్ భావిస్తోంది. చట్టపరంగా ఉదయ భాస్కర్ను తొలగించడం అసాధ్యం. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఆయన చేతులు కట్టేసినట్టుగా మరి కొందరు సభ్యులు, సలహాదారులను నియమించవచ్చని చెబుతూ వచ్చారు. అదే సమయంలో ఏవీ రమణా రెడ్డిని నియమించడం రాజకీయంగా ప్రాధాన్యను సంతరించుకుంది.