ఎల్జీ పాలిమర్స్పై చర్యలకు సిద్ధం: అలాంటి కంపెనీలకు చెక్: హైపవర్ కమిటీ ఏర్పాటు: నెలరోజుల్లో..
అమరావతి: విశాఖపట్నం సమీపంలోని ఆర్ఆర్ వెంకటాపురంలో గల ఎల్జీ పాలిమర్స్ కంపెనీ నుంచి విష వాయువులు వెలువడిన ఘటన పట్ల రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఎల్జీ పాలిమర్స్ సంస్థ నుంచి స్టైరీన్ గ్యాస్ లీకేజీ కారణంగా 12 మంది మరణించడం, వందలాది మంది అస్వస్థతకు గురై ఆసుపత్రుల పాలు కావడాన్ని తీవ్రంగా పరిగణిస్తోంది. భవిష్యత్తులో ఇలాంటి విషాదకర ఉదంతాలు తలెత్తకుండా ఉండటానికి ముందుజాగ్రత్త చర్యలను తీసుకుంటోంది. ఇందులో భాగంగా ప్రభుత్వం అత్యున్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నీ శుక్రవారం ఉత్తర్వులను జారీ చేశారు.
విశాఖ గ్యాస్ లీకేజీ బాధితులకు పరిహారం చెల్లింపుల్లో జగన్ మార్క్ రాజకీయం..వివక్షత: కేశినేని నాని
ఎన్కే ప్రసాద్ ఛైర్మన్గా..
సీనియర్ ఐఎఎస్, ఐపీఎస్ అధికారులతో కూడిన అత్యున్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తూ శుక్రవారం ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. సీనియర్ ఐఎఎస్ అధికారి, పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ను ఈ కమిటీకి ఛైర్మన్గా నియమించింది. పరిశ్రమలు, వాణిజ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవేన్, విశాఖపట్నం జిల్లా కలెక్టర్ వినయ్ చంద్, విశాఖపట్నం నగర పోలీస్ కమిషనర్ ఆర్కే మీనా, కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శి వివేక్ యాదవ్ ఇందులో సభ్యులుగా ఉంటారు.
నెలరోజుల్లో నివేదిక..
ఎల్జీ పాలిమర్స్ కంపెనీ నుంచి గ్యాస్ వెలువడటానికి గల కారణాలపై ఈ కమిటీ సమగ్రంగా దర్యాప్తు కొనసాగిస్తుంది. ఎల్జీ పాలిమర్స్ పుట్టుపూర్వోత్తరాలను ఆరా తీస్తుంది. కంపెనీ ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటిదాకా చేపట్టిన విస్తరణ కార్యకలాపాలు, దీనికి సంబంధించిన అనుమతి పత్రాలను ఈ కమిటీ పరిశీలిస్తుంది. కంపెనీ కార్యకలాపాల్లో అనుమతులు, నిబంధనల ఉల్లంఘన వంటి అంశాలు చోటు చేసుకుంటే దానికి గల కారణాలను అన్వేషిస్తుంది ఈ కమిటీ. విచారణలో ఎదురైన అంశాలు, ఎల్జీ పాలిమర్స్ యాజమాన్యం వెల్లడించిన అభిప్రాయాలతో కూడిన సమగ్ర నివేదికను నెల రోజుల్లోగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి అందజేయాల్సి ఉంటుందని సూచించింది.
భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు సంభవించకుండా..
దీనితో పాటు భవిష్యత్తులో ఇలాంటి గ్యాస్ లీకేజీ వంటి సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండటానికి అవసరమైన సూచనలు, సలహాలు, సిఫారసులను ఈ కమిటీ ప్రభుత్వానికి అందజేయాల్సి ఉంటుంది. ఎల్జీ పాలిమర్స్ వంటి కంపెనీలు రాష్ట్రంలో ఎక్కడెక్కడ? ఏ స్థాయిలో ఉన్నాయనే విషయంపై క్షేత్రస్థాయిలో పర్యటించాల్సి ఉంటుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పేర్కొన్నారు. జనావాసాల మధ్య ఉంటే వాటిని ఎలా తరలించాలనే విషయంపైనా ఈ కమిటీ క్షేత్రస్థాయిలో పర్యటించి, సిఫారసులను తెలియజేయాల్సి ఉంటుందని అన్నారు.
ఎల్జీ పాలిమర్స్కు స్థానం చలనం..
ఎల్జీ పాలిమర్స్ కంపెనీని కూడా జనావాసాల మధ్య నుంచి దూరంగా తరలించాలనే విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఈ కంపెనీని తరలించాలంటూ ఆర్ఆర్ వెంకటాపురం గ్రామస్తులు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తోన్న విషయం తెలిసిందే. గ్యాస్ లీకైన ఘటనలో ఇప్పటిదాకా 12 మంది మరణించగా వారిలో అత్యధికులు ఆర్ఆర్ వెంకటాపురం గ్రామానికి చెందిన వారే. గ్యాస్ వెలువడిన తరువాత దాని ప్రభావం సుమారు అయిదు గ్రామాలపై పడటం వల్ల దాన్ని ఎక్కడికి తరలించాలనే విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది.