లెక్క తేల్చుతోన్న జగన్ సర్కార్: ఢిల్లీ వెళ్లొచ్చిన వారు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు కూడా..
అమరావతి: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ భయానకంగా విస్తరిస్తోన్నప్పటికీ.. మన రాష్ట్రంలో నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య కాస్త అదుపులోనే కనిపించాయి.. మొన్నటి దాకా. కట్టుదిట్టమైన చర్యలను చేపడుతూ వచ్చింది ప్రభుత్వం. దీన్ని తుత్తునీయలు చేశాయి ఢిల్లీ మత ప్రార్థనలు. ఢిల్లీలో నిజాముద్దీన్ ప్రాంతంలోని మర్కజ్ మసీదు భవన సముదాయంలో నిర్వహించిన మత ప్రార్థనల్లో పాల్గొని వచ్చిన వారి వల్ల రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య అదుపు తప్పింది.
దేశవ్యాప్తంగా భయాందోళనలు..
ఒక్క ఏపీలోనే కాదు.. తెలంగాణ సహా దేశవ్యాప్తంగా ఇలాంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఢిల్లీలో నిర్వహించిన మత ప్రార్థనల్లో పాల్గొని స్వస్థలానికి చేరుకున్న వారిని ఆరా తీసే పనిలో పడ్డాయి అన్ని రాష్ట్రాలు. ఢిల్లీలోని అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం ఓ అడుగు ముందుకేసింది. మత ప్రార్థనలను నిర్వహించిన వారిపై ఎఫ్ఐఆర్ సైతం నమోదు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. దీనికి అనుగుణంగా అక్కడ కేసులు కూడా నమోదవుతున్నాయి.
758 మంది గుర్తింపు.. రక్త పరీక్షలు
ఢిల్లీ మత ప్రార్థనల్లో పాల్గొని రాష్ట్రానికి వచ్చిన వారిని గుర్తించడంలో రాష్ట్ర ప్రభుత్వం కొంతమేర విజయం సాధించినట్లే కనిపిస్తోంది. మొత్తం 1100 మందికి పైగా స్థానికులు ఢిల్లీ మత ప్రార్థనలకు హాజరై స్వస్థలానికి చేరుకోగా.. వారిలో 758 మందిని గుర్తించింది. నయానో, భయానో వారిందరికీ వైద్య పరీక్షలను నిర్వహిస్తోంది. ఇప్పటికే వారి రక్త నమూనాలను సేకరించి, కరోనా వైరస్ ల్యాబొరేటరీలకు పంపించింది.
Recommended Video
కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు 543 మంది..
ఢిల్లీకి వెళ్లొచ్చిన వారిని మాత్రమే కాదు.. వారి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులకు కూడా రక్త పరీక్షలను నిర్వహిస్తోంది ప్రభుత్వం. దీనికి సంబంధించిన వివరాలను నోడల్ అధికారి ఆర్జా శ్రీకాంత్ వెల్లడించారు. 758 మంది ఢిల్లీ మత ప్రార్థనలకు వెళ్లొచ్చినట్లుగా గుర్తించామని తెలిపారు. వారికి రక్త పరీక్షలను నిర్వహించామని చెప్పారు. అదే సమయంలో- 543 మంది ఢిల్లికి వెళ్లొచ్చిన వారితో డైరెక్ట్ కాంటాక్ట్ ఉన్నట్లుగా గుర్తించింది. సన్నిహితంగా మెలికినట్లు అనుమానిస్తోన్న మరో 143 మందికి కూడా వైద్య పరీక్షలను చేయిస్తోంది.
ఒక్క గుంటూరు నుంచే 200 మంది
ఢిల్లీకి వెళ్లొచ్చిన 748 మందిలో నాలుగు జిల్లాలకు చెందిన వారు అధిక సంఖ్యలో ఉన్నారు. వారిలో ఒక్క గుంటూరు జిల్లాకు చెందిన వారే 200 మంది ఉన్నారు. తూర్పు గోదావరి, నెల్లూరు జిల్లాల్లో 110 మంది చొప్పున ఉన్నారు. ప్రకాశం-82, పశ్చిమ గోదావరి- 60, కడప-59, అనంతపురం-37, చిత్తూరు-32, కృష్ణా-19, కర్నూలు-15, తూర్పు గోదావరి-16, విశాఖపట్నం-23, శ్రీకాకుళం-26, విజయనగరం-7 మంది ఉన్నట్లు గుర్తించింది ప్రభుత్వం. వారికి పరీక్షలను నిర్వహిస్తోంది.