ఏపీలో సంపూర్ణ మద్య నిషేధం దిశగా మరో విప్లవాత్మక అడుగు: కొత్త శాఖ: వారిపై ఉక్కుపాదం
అమరావతి: రాష్ట్రంలో సంపూర్ణ మద్యపాన నిషేధం దిశగా వైఎస్ జగన్ ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. మద్యపాన నిషేధాన్ని అమలు చేసిన అనంతరం రాష్ట్రంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనే విషయాన్ని ప్రభుత్వం ముందుగానే అంచనా వేసింది. అక్రమ మద్యం ప్రవాహంలా ముంచెత్తే ప్రమాదం ఉందని భావిస్తోంది. అలాంటి పరిస్థితులు ఖచ్చితంగా తలెత్తి తీరుతాయనే నిర్ణయానికి వచ్చింది. అక్రమ మద్యం విక్రయాన్ని నిరోధించడం, అక్రమ మద్యం తయారీని అరికట్టడానికి విప్లవాత్మక చర్యలను తీసుకుంది.
Recommended Video
ఆంధ్రప్రదేశ్, గుంటూరు, అమరావతి రైతుల నిరసనలకు 150 రోజులు, నారా లోకేష్, టీడీపీ, వైఎస్ జగన్
స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో పేరుతో..
సంపూర్ణ మద్యపానం నిషేదాన్ని అమల్లోకి తీసుకొచ్చిన తరువాత అక్రమ మద్యాన్ని అరికట్టడానికి ప్రత్యేకంగా ఓ శాఖను ఏర్పాటు చేసింది. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (Special Enforcement Bureau) పేరుతో కొత్త శాఖను సృష్టించింది ఈ మేరకు రెవెన్యూ (ఎక్సైజ్) శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ రజత్ భార్గవ శుక్రవారం ఉత్తర్వులను జారీ చేశారు. పొరుగు రాష్ట్రాల నుంచి సరిహద్దులను దాటుకుని రాష్ట్రంలోనికి ప్రవేశించే అక్రమ మద్యాన్ని నిరోధించడం, రాష్ట్రం లోపన అక్రమ మద్యం తయారీని అణచివేయడం, మద్యం తయారీదారులపై ఉక్కుపాదాన్ని మోపడం వంటి చర్యలను ఈ కొత్తశాఖకు అప్పగించింది.
ఆరువేల మందికి పైగా..
ఈ కొత్త శాఖలో ఆరువేల మందికి పైగా ఉద్యోగులను నియమించింది. మంజూరైన పోస్టులు, అదనపు కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లు, జాయింట్ కమిషనర్లు, కానిస్టేబుళ్లు, హెడ్ కానిస్టేబుళ్లు, జూనియర్ అసిస్టెంట్లు, సీనియర్ అసిస్టెంట్లు, డ్రైవర్లు.. ఇలా మొత్తం 6274 మంది ఉద్యోగులు ఈ శాఖలో పనిచేస్తారు. అవుట్ సోర్సింగ్ సిబ్బందిని కూడా ఈ శాఖకు కేటాయించారు. ఈ శాఖతో పాటే ఆవిర్భవించిన ఆయా ఖాళీలన్నింటినీ భర్తీ చేయడానికి ప్రభుత్వం కొత్త నియామకాలను నిర్వహిస్తుందా? లేక ఇతర శాఖల నుంచి డెప్యుటేషన్పై సర్దుబాటు చేస్తుందా? స్పష్టం కావాల్సి ఉంది.
70:20 నిష్పత్తిలో ఉద్యోగులు..
ప్రారంభంలో డెప్యుటేషన్తోనే ఉద్యోగులను కేటాయిస్తారని అంటున్నారు. ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ డిస్టిల్లేషన్ బేవరేజ్ కార్పొరేషన్ నుంచి 70 శాతం, ఎక్సైజ్ శాఖ నుంచి 30 శాతం ఉద్యోగులను ఈ బ్యూరోకు బదలాయింంచింది. భవిష్యత్తులో కూడా 70:30 నిష్పత్తి ప్రకారమే ఉద్యోగులు ఈ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోలో కొనసాగుతారని ఈ ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది ప్రభుత్వం. ఖాళీలను భర్తీ చేయడానికి కాలానుగుణంగా నోటిఫికేషన్లను జారీ చేస్తామని పేర్కొంది.
కీలక అధికారాల అప్పగింత.. అక్రమ ఇసుక తవ్వకాలు కూడా..
స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోకు పని విభజనను సైతం కేటాయించింది ప్రభుత్వం. అక్రమ మద్యం తయారీకి సంబంధించిన సమాచారాన్ని సేకరించడం, ఆకస్మిక దాడులను నిర్వహించడం, ఎఫ్ఐఆర్లను నమోదు చేయడం, నిందితులను న్యాయస్థానంలోకి ప్రవేశపెట్టడం, కేసు దర్యాప్తు, ఛార్జిషీట్లను రూపొందించడం, నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్లను కూడా జారీ చేసే అధికారాలను సైతం ప్రభుత్వం ఈ కొత్త శాఖకు బదలాయించింది. సాధారణ పోలీసులకు వర్తించే అన్ని అధికారాలనూ దీనికి అప్పగించింది. అక్రమ ఇసుక తవ్వకాలను కూడా ఈ బ్యూరో పరిధిలోకి తీసుకొచ్చింది.
మద్యం దుకాణాలను తగ్గిస్తూ..
సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని దశలవారీగా అమలు చేసే దిశగా ప్రభుత్వం ఇదివరకే కసరత్తు చేపట్టిన విషయం తెలిసిందే. మద్యం షాపులను తగ్గించింది. బెల్టు షాపులను ఎత్తేసింది. మద్యం రేట్లను 75 శాతానికి పెంచింది. భారత్లో తయారయ్యే విదేశీ మద్యం సహా అన్ని రకాల లిక్కర్ బ్రాండ్లపైనా భారీగా రేట్లను పెంచింది. మద్యాన్ని ముట్టుకుంటేనే షాక్ కొట్టేలా రేట్లను పెంచుతామంటూ ఎన్నికల ప్రచార సమయంలో ఇచ్చిన హామీ మేరకు వాటి ధరలను సవరించింది. దీనితోపాటు- స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోను సైతం కార్యాచరణలోకి తీసుకొచ్చింది.