మత్స్యకారుల వలసలకు బ్రేక్: ఏపీలో గుజరాత్ మోడల్: తీర ప్రాంత జిల్లాకు ఒకటి చొప్పున
అమరావతి: రాష్ట్రంలో వలసల జీవులకు కేరాఫ్ అడ్రస్గా నిలుస్తోంది ఉత్తరాంధ్ర. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో స్వయం సమృద్ధిని సాధించడానికి, స్థానికులకు జీవనోపాధి కల్పించడానికి అవసరమైన వనరులు గానీ, పరిశ్రమలు గానీ ఆశించిన స్థాయిలో అందుబాటులో లేకపోవడం వల్ల పొరుగు రాష్ట్రాలకు పెద్ద ఎత్తున వలస వెళ్తుంటారు. తెలంగాణ సహా మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక వంటి రాష్ట్రాలు సహా గల్ప్ దేశాలకు వెళ్లే వారి సంఖ్యా ఈ రెండు జిల్లాల నుంచే అధికంగా ఉంటుంది.
నాడు ట్రాక్టర్లతో హల్చల్: ఈ సారి అడవి బాట పట్టిన వైసీపీ ఎమ్మెల్యే:
వెరావల్ తరహా ఉదంతాలు పునరావృతం కాకుండా..
గుజరాత్లోని వెరావల్ సంఘటన ఇలా చోటు చేసుకున్నదే. జీవనోపాధిని వెదుక్కుంటూ గుజరాత్కు వెళ్లిన శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు చెందిన మత్స్యకారులు వెరావల్లో చిక్కుకునిపోయారు. కాంట్రాక్టర్ల కింద ఫిషింగ్ హార్బర్లలో పని చేస్తూ, చేపట వేట కొనసాగిస్తూ ఉండే మత్స్యకారులు లాక్డౌన్ వల్ల ఉపాధిని కోల్పోయారు. స్వస్థలాలకు చేరుకోవడానికి ఏపీ, గుజరాత్ సహా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ జోక్యం చేసుకోవాల్సి వచ్చింది.
ఉన్న చోటే ఉపాధిని కల్పించేలా..
ఇకపై ఈ దుస్థితిని ఏర్పడకుండా ఉండటానికి జగన్ సర్కాార్ సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. రాష్ట్రంలో ఫిషింగ్ హార్బర్లను అభివృద్ధి చేయడానికి పూనుకుంది. ఏ జిల్లాకు చెందిన మత్స్యకారులకు ఆ జిల్లాల్లోనే ఉపాధిని కల్పించడానికి చర్యలు తీసుకుంటోంది. విజయనగరం మినహా శ్రీకాకుళం నుంచి నెల్లూరు జిల్లా వరకూ సముద్ర తీరం వెంట అన్ని జిల్లాల్లోనూ ఫిషింగ్ హార్బర్లను నిర్మించడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంగీకారం తెలిపారు.
ఫిషింగ్ హార్బర్ల నిర్మాణానికి రూ.3 వేల కోట్లు..
రాష్ట్రంలో మొత్తం తొమ్మిది సముద్ర తీర ప్రాంత జిల్లాలు ఉండగా.. ఎనిమిది చోట్ల ఫిషింగ్ హార్బర్లు, జెట్టీలను నిర్మించడానికి జగన్ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో నుంచి విజయనగరం జిల్లాను మినహాయించారు. మిగిలిన ఎనిమిది జిల్లాల్లో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లడానికి, దానికి అనుసంధాన కార్యక్రమాలను నిర్వహించుకోవడానికి వీలుగా ఫిషింగ్ హార్బర్లను అభివృద్ధి చేయబోతోంది. దీనికోసం మూడువేల కోట్ల రూపాయలను వ్యయం చేయనుంది. మూడేళ్ల కాలంలో వాటిని నిర్మించాల్సి ఉంటుందని లక్ష్యంగా నిర్దేశించింది.
మూడు నెలల్లో డీపీఆర్లు..
శ్రీకాకుళం జిల్లాలోని మంచినీళ్లపేట, విశాఖపట్నం జిల్లా పూడిమడక, తూర్పుగోదావరి జిల్లా ఉప్పాడ, పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం, కృష్ణాజిల్లా మచిలీపట్నం, గుంటూరు జిల్లా నిజాంపట్నం, ప్రకాశం జిల్లా కొత్తపట్నం, నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె ప్రాంతాల్లో ఫిషింగ్ హార్బర్లను నిర్మించాలని నిర్ణయించింది. మూడు నెలల్లో వాటన్నింటికీ సంబంధించిన డీపీఆర్లను సిద్ధం చేయాలని వైఎస్ జగన్ ఆదేశించారు.
గుజరాత్ తరహాలో..
దేశంలోనే అత్యంత పొడవైన తీర ప్రాంతం గల రాష్ట్రం గుజరాత్. 1300 కిలోమీటర్ల సముద్ర తీర ప్రాంతాన్ని కలిగి ఉందా రాష్ట్రం. గుజరాత్ తరువాత.. ఆ స్థాయిలో తీర ప్రాంతం ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఒక్కటే. 950 కిలోమీటర్ల వరకు సీబెల్ట్ ఉంది. దీనితో తీర ప్రాంతం పొడవునా ఫిషింగ్ హార్బర్లను నెలకొల్పాలని తాజాగా నిర్ణయం తీసుకుంది. దీనికోసం గుజరాత్ మోడల్ను అనుసరించడానికి సూత్రప్రాయంగా అంగీకరించారు వైఎస్ జగన్. గుజరాత్లోని వెరావల్, మంగ్రోల్, ఓఖా, పొర్బందర్లల్లో ఉన్న మేజర్ ఫిషింగ్ హార్బర్ల తరహాలో రాష్ట్రంలో అభివృద్ధి చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.