విశాఖలో భారీగా స్టెరిన్ గ్యాస్ నిల్వలు: ఎల్జీ పాలిమర్స్లో 13 వేల టన్నులు: షిప్పుల ద్వారా తరలింపు
విశాఖపట్నం: స్టెరిన్ గ్యాస్.. విశాఖపట్నం సమీపంలోని ఆర్ఆర్ వెంకటాపురంలో గల ఎల్జీ పాలిమర్స్ కంపెనీ నుంచి వెలువడిన విషవాయువు ఇది. కొద్దిరోజులుగా రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా వినిపిస్తోందీ గ్యాస్ పేరు. కరోనా వైరస్తో పోటీ పడుతూ వార్తల్లోకి ఎక్కింది. అందరి నోళ్లలోనూ నానుతోంది. ఈ గ్యాస్ ప్రమాదకరమైనదని అంటూ ఇప్పటికే పలువురు నిపుణులు అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో ఇలాంటి గ్యాస్ మరోసారి వ్యాప్తి చెందడమంటూ జరిగితే.. దాని దుష్పరిణామాలు మరింత తీవ్రంగా ఉంటాయనీ హెచ్చరించారు.
నెల్లూరులో మినీ ఎల్జీ పాలిమర్స్: కెమికల్స్ గోడౌన్లో అగ్నిప్రమాదం: ఘాటు వాసనతో ఉక్కిరిబిక్కిరి
విశాఖవాసులను భయాందోళనకు గురి చేసే సమాచారం..
తాజాగా మరోసారి ఈ గ్యాస్ విశాఖపట్నంవాసులను భయభ్రాంతులకు గురి చేస్తోంది. కారణం- విశాఖపట్నంలో ఈ గ్యాస్ నిల్వలు భారీగా ఉన్నట్లు తేలడమే. ఎల్జీ పాలిమర్స్ సంస్థలో ఇంకా 13 వేల టన్నుల స్టెరీన్ గ్యాస్ నిల్వ ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీనిపై ప్రభుత్వానికి ఓ నివేదికను అందించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం ఉదయం తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయం నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది.
గ్యాస్ అరికట్టే చర్యలపై జగన్ ఆరా..
విశాఖపట్నంలో గ్యాస్ లీక్ దుర్ఘటన అనంతరం తీసుకున్న చర్యలపై వైఎస్ జగన్ ఆరా తీశారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులకు కొన్ని కీలక ఆదేశాలను జారీ చేశారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్, రోడ్లు భవనాల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్, విశాఖపట్నం జిల్లా కలెక్టర్ వినయ్ చంద్, నగర పోలీస్ కమిషనర్ ఆర్కే మీనా పాల్గొన్నారు.
షిప్పుల ద్వారా స్టెరిన్ గ్యాస్ తరలింపు..
ఎల్జీ పాలిమర్స్ కంపెనీ నుంచి గ్యాస్ లీక్ అయిన అనంతరం అధికార యంత్రాంగం తీసుకున్న చర్యలపై వినయ్ చంద్ ముఖ్యమంత్రికి వివరించారు. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) అధికారులు చేపట్టిన శుద్ధి పనులు, బాధితులకు అందాల్సిన వైద్య సహాయం, ఆర్థిక సహకారం, పరిసర గ్రామాల్లో విష వాయువు ప్రభావం.. వంటి అంశాలన్నింటినీ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
ఎల్జీ పాలిమర్స్ సంస్థలో భారీగా నిల్వలు..
ప్రస్తుతం ఎల్జీ పాలిమర్స్ కంపెనీ ట్యాంకుల్లో భారీగా స్టెరిన్ గ్యాస్ నిల్వలు ఉన్నాయని వినయ్ చంద్ తెలిపారు. 13 వేల టన్నుల వరకు ఉండొచ్చని అంచనా వేసినట్లు తెలిపారు. ఈ గ్యాస్ నిల్వలను తరలించడానికి అవకాశం ఉందని, ఎలా తరలించాలనేదీ ఆయన జగన్కు వివరించారు. దీనితో ఆ గ్యాస్ నిల్వలను వెంటనే తిప్పి పంపించాలని జగన్ ఆదేశించారు. దీనితో అధికారలు యుద్ధ ప్రాతిపదికన ఆ చర్యలను చేపట్టారు. గ్యాస్ నిల్వలను వేరే ట్యాంకుల్లో ఎక్కించి, వాటిని షిప్పుల ద్వారా దక్షిణ కొరియాకు పంపించేలా చర్యలు తీసుకున్నారు.
Recommended Video
అయిదు గ్రామాల్లో ప్రతి ఒక్కరికీ రూ.10 వేల ఆర్థిక సహాయం..
ఎల్జీ పాలిమర్స్ నుంచి వెలువడిన విష వాయువుల ప్రభావానికి గురైన అయిదు గ్రామాలకు ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక సహాయాన్ని వెంటనే అందజేయాలని జగన్ ఆదేశించారు. చిన్నపిల్లలతో సహా ఆయా గ్రామాల్లోని ప్రతి వ్యక్తికీ 10 వేల రూపాయలను అందజేయాలని సూచించారు. దీనికి సంబంధించిన నిధులను మంజూరు చేశామని జగన్ తెలిపారు. ఈ నిధులను మూడు రోజుల్లోనే పంపిణీ చేయాలని అన్నారు. ఆ ఇంట్లో ఎంత మంది ఉంటే అందరికీ 10 వేల చొప్పున నగదు మొత్తాన్ని మహిళా ఖాతాలో జమ చేయాలని అన్నారు. దీనికి సంబంధించిన స్లిప్పులను వలంటీర్ల ద్వారా బాధితులకు అందజేయాలని చెప్పారు.