గ్రామ సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థకు సరికొత్త హంగులు: ఐఐటీ, బీ-స్కూల్ స్టూడెంట్స్..ఇంటర్న్షిప్
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మానస పుత్రికలుగా గుర్తింపు పొందిన గ్రామ సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థ ఇక సరికొత్త హంగులను అద్దుకోనుంది. ఈ రెండు వ్యవస్థల్లో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టబోతోంది. గ్రామ స్థాయి పరిపాలనను మరింత సులభతరం, వేగవంతం చేయడానికి అనూహ్య నిర్ణయాలను తీసుకుంది. గ్రామ సచివాలయాల వ్యవస్థలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఐఐటీ విద్యార్థులను భాగస్వామ్యులను చేయనుంది. వారికి ఇంటర్న్షిప్ అవకాశాన్ని కల్పించింది.
బీ-స్కూల్ విద్యార్థులకూ..
దీనితోపాటు- గ్రామ వలంటీర్లు, వార్డు వలంటీర్ల వ్యవస్థలోనూ ఇంటర్న్షిప్ అవకాశాన్ని ప్రవేశపెట్టింది. టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్స్ (టీఐఎస్ఎస్), బిజినెస్ స్కూల్ విద్యార్థులకు ఇందులో ఇంటర్న్షిప్ చేయడానికి వీలు కల్పించింది. ఈ మేరకు సంబంధింత మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. ఆసక్తిగల వారు దరఖాస్తులను పంపించుకోవాలని సూచించింది. ఇంటర్న్షిప్ కోసం దరఖాస్తు చేయడానికి గల అర్హతలను వివరించింది.
నెలరోజులు, అంతకుమించి
ఈ రెండు వ్యవస్థల్లోనూ ఇంటర్న్షిప్ చేయదలిచిన విద్యార్థుల కాల పరిమితి కనీసం నెల రోజులు. అనంతరం దాన్ని పొడిగించే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ఇంటర్న్షిప్ కాలంలో ఏ రాష్ట్రానికి చెందిన విద్యార్థులైనా గానీ ఏపీలోనే నివాసించాల్సి ఉంటుంది. వారికి కేటాయించిన జిల్లాల్లో క్షేత్రస్థాయిలో ఈ రెండు వ్యవస్థల పనితీరును పరిశీలించాల్సి ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది. తెలుగు వారికి ప్రాధాన్యత ఇస్తారు.
మార్పులపై నివేదిక..
ఇంటర్న్షిప్ సందర్భంగా గ్రామ సచివాలయాలు, గ్రామ, వార్డు వలంటీర్ల వ్యవస్థలో మరన్ని మార్పులను చేయడానికి గల అవకాశాలపై ఐఐటీ బీటెక్ విద్యార్థులు, బిజినెస్ స్కూల్, టిస్ స్టూడెంట్లు ఓ నివేదికను ప్రభుత్వానికి అందించాల్సి ఉంటుంది. పాలనను మరింత సులభతరం చేయడం, ప్రజలకు మరింత చేరువ చేయడానికి తీసుకోవాల్సిన అంశాలపై ఈ నివేదికలో పొందుపరచాల్సి ఉంటుంది. క్షేత్ర స్థాయిలో పరిశీలన, గ్రామ సచివాలయాలకు అందే విజ్ఙప్తులను విశ్లేషించడం వంటి టాస్క్లను వారి అప్పగిస్తారు.
Recommended Video
ఈ విద్యాసంస్థల విద్యార్థులకు..
విలేజ్ వలంటీర్ల వ్యవస్థలో టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్స్, జంషెడ్పూర్లోని గ్జేవియర్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్, ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్, గుర్గావ్లోని మేనేజ్మెంట్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్, ముంబైలోని జమ్నాలాల్ బజాజ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్, ఎస్పీ జైన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ అండ్ రీసెర్చ్ విద్యార్థులకు ఇంటర్న్షిప్ అవకాశాన్ని కల్పించారు. గ్రామ సచివాలయాల్లో దేశంలో ఏ ఐఐటీకి చెందిన బీటెక్ విద్యార్థి అయినా ఇంటర్న్షిప్కు దరఖాస్తు చేసుకోవచ్చని ప్రభుత్వం పేర్కొంది.