ఏపీ సర్కార్ సరికొత్త ఆఫర్: ఎలుకను పడితే పది, మరి పందికొక్కుల సంగతి ఏంటీ..?
అమరావతి: గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో పది రోజుల పసికందును ఎలుక కొరికిన ఘటనతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇకపై ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు చర్యలు చేపట్టింది.
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రభుత్వాసుపత్రుల్లో కుప్పులు తెప్పలుగా ఉన్న ఎలుకలను పట్టుకోవాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఏపీ సర్కార్ సరికొత్త ఆఫర్ను ప్రకటించింది. ప్రభుత్వాసుపత్రుల్లో పట్టుకున్న ప్రతి ఎలుకకూ రూ. 10 చొప్పున ఇస్తామని ఆరోగ్య శాఖ ప్రకటించింది.
దీంతో ఎలుకలు పట్టుకునే వారికి చేతినిండా పని దొరికింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వాసుపత్రుల్లో కేవలం ఎలుకలు మాత్రమే కాదు పందికొక్కులు కూడా ఉన్నాయి. వాటి పరిస్థితి ఏమిటని కొందరు ప్రశ్నిస్తున్నారు.
గుంటూరు జిల్లాలో ప్రబలుతున్న విషజ్వరాలు
జిల్లాలో విషజ్వరాలు ప్రబలుతున్నాయి. అమృతలూరు మండలం పెదపూడిలో విషజ్వరాలతో నాలుగు రోజుల వ్యవధిలో ముగ్గురు మృతిచెందారు. అదే విధంగా వినుకొండ నియోజక వర్గంలో ఓ గ్రామంలో గత పదిరోజుల క్రితం జ్వరంతో ఒకేరోజు ఇద్దరు యువకులు మృతి చెందారు. అయితే, పరిస్థితి ఇలా ఉంటే వైద్యాధికారులు మాత్రం తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారనే విమర్శలొస్తున్నాయి.
గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు
గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో ఆదివారం విస్తారంగా వర్షాలు కురిసాయి. కొన్నిచోట్ల పిడుగులు కూడా పడ్డాయి. నెల్లూరు జిల్లా బోగోలు మండలం కొండబిట్రగుట్టలో పిడుగుపాటుకు వెంకయ్య అనే వృద్ధుడు మృతిచెందాడు. ఏనుగులబావి గ్రామంలో పిడుగుపడి గిరిజన మహిళ తలకు తీవ్ర గాయమైంది.
అదే విధంగా నర్సరావుపేటకు సమీపంలోని దొండపాడు గ్రామంలో పిడుగుపాటుకు వ్యక్తి మృతిచెందాడు. పేరేచర్ల ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ మైదానంలో పిడుగుపడి ఓ చెట్టు ధ్వంసమైంది. ఈ ఘటనలో ఆంధ్రా, త్రిపుర మహిళా క్రికెట్ టీం సభ్యులకు తృటిలో ప్రమాదం తప్పింది.