సీఆర్డీఏ చట్టం రద్దు..! వీజీటీఎంఉడా పునరుద్దరణ: రైతులకు మూడేళ్లు ప్యాకేజి..!
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. మూడు రాజధానులు..అమరావతి నుండి పరిపాలనా రాజధానిని విశాఖకు తరలించేందుకు వేగంగా అడుగులు వేస్తోంది. ఈ నెల 20 నుండి మూడు రోజుల పాటు అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో రాజధానికి సంబంధించి కీలక చర్చ..తీర్మానం చేయాలని భావిస్తోంది.
ఇదే సమయంలో అమరావతి కోసం గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రూపొందించిన సీఆర్డీఏ చట్టాన్ని సైతం రద్దు చేసేందుకు కసరత్తు జరుగుతున్నట్లు సమాచారం. అందులో భాగంగా..ఇతర శాఖల నుండి సీఆర్డీఏకు డిప్యుటేషన్ మీద తీసుకొచ్చి పని చేస్తున్న ఉద్యోగుల పైనా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొనే అవకాశం కనిపిస్తోంది. ఈ రోజు జరిగిన హైపవర్ కమిటీ సమావేశంలో దీని పైన పలు ప్రతిపాదనలు చర్చించినట్లు సమాచారం.
సీఆర్డీఏ చట్టం రద్దుకు కసరత్తు..
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అమరావతి పరిధిలోని రాజధాని ప్రాంతం మొత్తాన్ని కేపిటల్ రీజనల్ డెవలప్ మెంట్ అధారిటీగా గుర్తించి..అక్కడ అమలు చేయాల్సిన నిర్ణయాలు..చట్టం రూపంలో సీఆర్డీఏ చట్టం తీసుకొచ్చారు. ఈ చట్టం ప్రకారమే రైతుల నుండి భూ సమీకరణ చేసారు. సీఆర్డీఏ ఏర్పాటు చేసి ఐఏఎస్ అదికారిని కమిషనర్ గా నియమించారు. అయితే, ఏపీలో ఇప్పుడు జగన్ ప్రభుత్వం మూడు రాజధానుల ప్రతిపాదనలతో పాటుగా..అసెంబ్లీని లెజిస్టేచర్ కేపిటల్ గా కొనసాగించాలని భావిస్తోంది.
ఆ దిశగా కసరత్తు జరుగుతోంది. దీంతో..సీఆర్డీఏ చట్టం రద్దు చేయాల్సిన అవసరం పైన ఈ రోజు జరిగిన హైపవర్ కమిటీ సమావేశంలో చర్చ జరిగినట్లు తెలుస్తోంది. అందులో ఈ చట్టం రద్దు చేయాలంటే అనుసరించాల్సిన విధానం..న్యాయ పరంగా ఏమైనా చిక్కులు ఎదురవుతాయా అనే అంశం మీద చర్చించినట్లు సమాచారం. ఈ నెల 20వ తేదీ నుండి మూడు రోజుల పాటు అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు నిర్వహించి..అందులో ఈ చట్టం రద్దు దిశగా బిల్లు పెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.
మూడేళ్ల పాటు రైతులకు ప్యాకేజీ..
హై పవర్ కమిటీలో సీఆర్డీఏ రద్దుపై చర్చ సమయంలో పలు ప్రతిపాదనలు ముందుకు వచ్చాయి. అందులో సీఆర్డీఏ ను రద్దు చేసి గతంలో మాదిరిగా వీజీటీఎంఉడా గా మార్పు చేయాలని ప్రతిపాదన ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించారు. అదే విధంగా.. సీఆర్డీఏ ఏర్పాటుకు ముందున్న ఉద్యోగులను కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు. సీఆర్డీఏ లో పని చేస్తున్న ఇతర ఉద్యోగులను సొంత శాఖలకు పంపించాలని డిసైడ్ అయ్యారు. సీఆర్డీఏ ఏర్పాటు సమయంలో వివిధ శాఖల నుండి వీరందరినీ ఇక్కడ పని చేసేందుకు డిప్యుటేషన్ మీద తరలించారు.
అందులో రెవిన్యూ శాఖకు చెందిన ఉద్యోగులే ఎక్కువ గా ఉన్నారు. వీరితో పాటుగా మున్సిపల్ శాఖ ఉద్యోగుల సంఖ్య ఎక్కువగా ఉంది. ఇక, సీఆర్డీఏ రద్దు తర్వాత భూములిచ్చిన రైతులకు మూడేళ్లపాటు ప్యాకేజి అమలు చేయాలని ప్రతిపాదన హై పవర్ కమిటీ చేసినట్లుగా తెలుస్తోంది. అయితే, అసెంబ్లీలో బిల్లు ప్రవేశ పెట్టే ముందుగానే దీని పైన కేబినెట్ లో చర్చించి దీనికి తుది రూపు ఇవ్వటం.. తుది నిర్ణయం తీసుకోవటం జరగనుంది.