జగన్ డ్రీమ్: ఈ సారి వైఎస్సార్ జయంతి రోజున: ఇప్పటికే రెండుసార్లు వాయిదా.. ఈసారైనా..!
అమరావతి: రాష్ట్రంలోని నిరుపేదలందరికీ ఇళ్ల పట్టాల పంపిణీ చేయాలనేది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి డ్రీమ్ ప్రాజెక్ట్. పేదలకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేసే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడానికి తేదీని, షెడ్యూల్ను ఖరారు చేసుకున్న ప్రతీసారీ అది వాయిదా పడుతూనే వచ్చింది. ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడింది. దీనికి ప్రధాన కారణం- కరోనా వైరస్ విస్తరించడం.
వైరస్ వ్యాప్తి చెందడం ఆరంభమైన తరువాత రెండూసార్లూ దీన్ని వాయిదా వేయాల్సి వచ్చింది. ముచ్చటగా మూడోసారి మరో తేదీని నిర్ణయించినట్లు తెలుస్తోంది. తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి రోజైన జులై 8వ తేదీన పేదలకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేయాలని జగన్ నిర్ణయించినట్లు సమాచారం.
ఉగాది నాడు అనుకున్నా..
కిందటి నెల 25వ తేదీన శార్వరీ నామ సంవత్సరారంభం ఉగాది నాడు పేదలకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేయడానికి ప్రభుత్వం సన్నాహాలను పూర్తి చేసింది. యుద్ధ ప్రాతిపదికన స్థలాన్ని సేకరించింది. వాటిని డీనోటిఫై చేసింది. పేదలకు పంపిణీ చేయడానికి అవసరమైన అన్ని పనులను పూర్తి చేసుకోగలిగింది. అదే సమయంలో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాల్సి రావడం, ఎన్నికల నోటిఫికేషన్ వెలువడటం, దానితోపాటే ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో రావడం వల్ల తాత్కాలికంగా బ్రేక్ పడింది.
ఎన్నికలే వాయిదా పడటంతో..
కారణాలేమైనప్పటికీ.. స్థానిక సంస్థలే వాయిదా పడ్డాయి. దీనిపై అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీల వేర్వేరుగా స్పందించాయి. ఒకరినొకరు దుమ్మెత్తి పోసుకున్నారు. అది వేరే విషయం. హైకోర్టు సైతం ఎన్నికల వాయిదాను సమర్థించింది. ఎన్నికలతో పాటు కోడ్ కూడా వాయిదా పడినప్పటికీ.. అప్పటికే అటు దేశంలో, ఇటు రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందడం ఆరంభం కావడం, లాక్డౌన్ అమల్లోకి రావడం ఒకదాని వెంట ఒకటి చకచకా సాగిపోయాయి.
అంబేద్కర్ జయంతికీ సాధ్యం కాలేదు..
దీనితో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ఈ నెల 14వ తేదీన రాజ్యంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి నాటికి వాయిదా వేసుకుంది ప్రభుత్వం. కరోనా వైరస్ తీవ్రత ఆకాశమే హద్దుగా చెలరేగిపోతుండటం వల్ల లాక్డౌన్ను పొడిగించింది కేంద్ర ప్రభుత్వం. ఫలితంగా- అంబేద్కర్ జయంతి నాటికీ వైఎస్ జగన్ డ్రీమ్ ప్రాజెక్టు కార్యాచరణలోకి రాలేకపోయింది. ప్రభుత్వం దృష్టి మొత్తం కరోనా వ్యాప్తిని నియంత్రించడంపైనే కేంద్రీకరించడం వల్ల అసలు ఆ ఊసే లేకుండా పోయింది.
Recommended Video
ముచ్చటగా మూడోసారి.. వైఎస్ జయంతి నాటికి..
తాజాగా మరో తేదీని అనుకున్నారు వైఎస్ జగన్. తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి రోజైన జులై 8వ తేదీన పేదలకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. జులై 8వ తేదీ నాటికి అనుకుంటే ప్రస్తుతం రెండున్నర నెలల సమయం ఉంది. ఈ మధ్యలో కరోనా వైరస్ కాస్తయినా అదుపులోకి వస్తుందని భావిస్తోంది. జులై నాటికి పరిస్థితులు కుదుట పడే అవకాశం ఉందని అంచనా వేస్తోంది. అదే జరిగితే- తన తండ్రి జయంతి నాడు పేదలందరికీ ఇళ్ల పట్టాలను పంపిణీ చేస్తామని చెబుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 27 లక్షలకు పైగా పేద కుటుంబాలకు అదేరోజు జిల్లాలు, నియోజకవర్గాల వారీగా ఇళ్ల పట్టాలను పంపిణీ చేయాలని వైఎస్ జగన్ ప్రాథమికంగా నిర్ణయించినట్లు సమాచారం.