విశాఖ రావటానికి ఉద్యోగులకు బంపరాఫర్: కొత్త ప్రతిపాదనలు సిద్దం: నేటి హైపవర్ కమిటీ భేటీలో చర్చ..!
విశాఖ పరిపాలనా రాజధానిగా ప్రకటించేందుకు ప్రభుత్వం కార్యాచరణ వేగవంతం చేసింది. అందులో కీలకంగా పాలనా పరంగా ఉద్యోగులను విశాఖకు తరలించే అంశం మీద రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఇప్పటికే సచివాలయ ఉద్యోగులు తాము హైదరాబాద్ నుండి వచ్చి ఇబ్బందులు ఎదుర్కొన్నామని..తిరిగి ఇప్పుడు విశాఖకు అంటే మరిన్ని సమస్యలు వస్తాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
దీంతో..అసలు ఉద్యోగులను ఒప్పించాలంటే ఏం చేయాలనే అంశం మీద కాసేపట్లో జరిగే హైపవర్ కమిటీ సమావేశంలో చర్చించనున్నట్లు సమాచారం. అదే విధంగా అమరావతి రైతులకు సంబంధించిన అంశాల పైన ఈ భేటీలో కొన్ని ప్రతిపాదనలు సిద్దం చేసే అవకాశం కనిపిస్తోంది. హైదరాబాద్ నుండి అమరావతికి తరలించే సమయంలో ఉద్యోగుల విషయంలో అనుసరించిన విధానం మరోసారి కొనసాగించా లని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం.
ఉద్యోగలకు ఏం చెప్పాలి..ఏమివ్వాలి..
ప్రస్తుతం అమరావతిలోని సచివాలయంతో పాటుగా వివిధ హెచ్ ఓడీల్లో పని చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులను విశాఖ పరిపాలనా రాజధానిగా ప్రకటిస్తే ఏ విధంగా వారిని ఒప్పించి అక్కడకు తరలించాలే అంశం మీద నేటి హైపవర్ కమిటీ సమావేశంలో చర్చించనున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ నుండి అమరావతికి తరలించారని..ఇప్పుడు మరోసారి విశాఖకు అంటే తమకు సమస్యలు వస్తాయని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
దీంతో..ఉద్యోగులకు ఇబ్బంది లేకుండా ఏ ప్రతిపాదనలు ప్రభుత్వం ముందు ఉంచాలనే అంశం పైన ఈ రోజు జరిగే హైపవర్ కమిటీ సమావేశంలో చర్చించనున్నారు. అదే విధంగా అమరా వతి రైతులు ఉద్యమం చేస్తున్న సమయంలో వారిని ఏ రకంగా శాంతింపచేయాలనే అంశం మీద ఫోకస్ చేయనున్నారు. ఇందు కోసం అటు ఉద్యోగులు..ఇటు రైతులను బుజ్జగించేలా పలు ప్రతిపాదనలను ఈ రోజు జరిగే హైపవర్ కమిటీ చర్చించే అవకాశం ఉంది. ఆ తరువాత వీటి పైన అటు రైతులతో..ఇటు ఉద్యోగులతో ప్రభుత్వం తరపున చర్చలు జరపనున్నారు.
ఉద్యోగుల ముందు ప్రతిపాదనలు..
ప్రభుత్వం ఉద్యోగులను తరలింపు దిశగా ఒప్పించేందుకు కొందరు ముఖ్యుల నుండి సూచనలు స్వీకరించింది. అందులో జధాని తరలింపు ప్రక్రియలో ఉద్యోగులు అత్యంత కీలకమని, వారి ప్రయోజనాలను తప్పనిసరిగా కాపాడాలని దీనిలో పేర్కొన్నారు. ఈ సూచనల ప్రకారం గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని విశాఖపట్నంకు రాజధానిని తరలించడానికి ముందే వారికి ప్రభుత్వం నుండి దక్కే ప్రయోజనాల పైన హామీ ఇవ్వాలని భావిస్తున్నారు.
ఉద్యోగులకు అమరావతిలో ప్రతిపాదించిన స్థలాలను రద్దు చేస్తూ..విశాఖలో ఇళ్ల స్థలాలు నామమాత్రపు ధరలకు కేటాయించాలని.. ఉడా ఆమోదించిన డిజైన్లతో ఈ స్థలాలు ఉండాలని, స్టాంపు డ్యూటీని మినహాయిం చాలని సూచించారు. రాష్ట్రంలోనే అత్యధిక జీవన వ్యయం ఉన్న నగరం కావడంతో ఉద్యోగుల మూల వేతనం అదనంగా 10శాతం సిసిఎను ఇచ్చే అంశాన్ని పరిశీ లించాలని కమిటీకి సూచనలు అందినట్లుగా సమాచారం.
షిఫ్టింగ్ అలెవన్సులపైనా చర్చ..
ఈ సూచనల్లో భాగంగా వారికి చెల్లిస్తున్న అలవెన్సుల పైనా ప్రతిపాదనలు అందినట్లుగా తెలుస్తోంది. సచివాలయంతో పాటు ఇతర హెచ్ఓడిల అధికారులు, ఉద్యోగులకు ప్రస్తుతం చెల్లిస్తున్న 30 శాతం హెచ్ఆర్ఎను కొనసా గించాలని బావిస్తున్నారు. గెజిటెడ్ అధికారులకు రూ. లక్ష, నాన్ గెజిటెడ్ అధి కారులకు రూ. 75వేలు, 4వ తరగతి ఉద్యోగులకు రూ. 50వేలు షిఫ్టింగ్ అలవెన్స్గా చెల్లించాలన్నది మరో ప్రతిపాదన రాగా..దీని పైన హైపర్ కమిటీ సిఫార్సు కీలకం కానుంది.
విశాఖకు తరలి వెళ్లే ఉద్యోగి జీవిత భాగస్వామిని కూడా తప్పనిసరిగా అక్కడికే బదిలీ చేయాలని. ఖాళీలతో సంబంధం లేకుండా ఈ ప్రక్రియ నిర్వహించాలని సూచించారు. కుటుంబాలకు దూరంగా ఉండే ఉద్యోగులకు ఉచిత వసతి సౌకర్యం కల్పించాలని, కుటుంబంతో పాటు విశాఖకు తరలి వెళ్లే ఉద్యోగులకు రెండు బెడ్ రూమ్ల ఫ్లాట్ అద్దెలో రూ. 4వేల వరకు రాయితీని అందించాలని పేర్కొన్నారు. ఈ సూచనలపై హై పవర్ కమిటీ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందన్న అంశం ఆసక్తికరంగా మారింది.