విశాఖలో విష వాయువులు పుట్టుకొచ్చిన వేళ.. జగన్ సర్కార్ సరికొత్త షాక్: మరో నోటీసు: సుమోటోగా..
విశాఖపట్నం: విశాఖపట్నం సమీపంలోని ఆర్ఆర్ వెంకటాపురంలో గల ఎల్జీ పాలిమర్స్ కంపెనీలో పుట్టుకొచ్చిన విష వాయువుల వల్ల వందలాది మంది అస్వస్థతకు గురయ్యారు. ఎనిమిది మంది మరణించారు. ఈ తెల్లవారు జామున 3 గంటల సమయంలో వెలువడిన ఈ విష వాయువులు విశాఖపట్నాన్ని ఉక్కిరి బిక్కిరికి గురి చేశాయి. గోపాలపట్నం మండలం మొత్తం దీని బారిన పడింది. ఎల్జీ పాలిమర్స్ కంపెనీ కొనసాగుతోన్న ప్రదేశం నుంచి సుమారు ఎనిమిది చదరపు కిలోమీటర్ల మేర విష వాయువులు విస్తరించాయి. దీని ప్రభావం తీవ్రంగా ఉంటోంది.
బాధితులకు అందుతోన్న సహాయ కార్యక్రమాలను పర్యవేక్షించడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హుటాహుటిన విశాఖపట్నానికి బయలుదేరి వచ్చారు. ఈ ఉదయం ఆయన విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో విశాఖపట్నానికి చేరుకున్నారు. రోడ్డు మార్గంలో ఆయన విమనాశ్రయం నుంచి నేరుగా కింగ్ జార్జ్ ఆసుపత్రికి చేరుకున్నారు. బాధితులను పరామర్శిస్తున్నారు. ప్రస్తుతం ఆయన పర్యటన కొనసాగుతోంది.
ఈ పరిస్థితుల్లో అనూహ్యంగా మరో నోటీసును అందుకోవాల్సి వచ్చింది జగన్ సర్కార్కు. విష వాయువుల ఉదంతంపై జాతీయ మానవ హక్కుల కమిషన్ కొద్దిసేపటి కిందటే ఈ నోటీసులను జారీ చేసింది. ఏపీతో పాటు కేంద్ర ప్రభుత్వానికీ నోటీసులను జారీ చేసింది. గ్యాస్ లీకేజీ ఉదంతం పట్ల సంతృప్తికరమైన వివరణ ఇవ్వాలని జాతీయ మానవ హక్కుల కమిషన్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. ఈ ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నీ పేరుతో నోటీసులను పంపించింది.
Recommended Video
విశాఖలో గ్యాస్ లీకేజీ అనంతరం చోటు చేసుకున్న పరిణామాలను మీడియా ద్వారా తిలకించన జాతీయ మానవ హక్కుల కమిషన్ అధికారులు.. ఈ ఘటను సుమోటోగా తీసుకుని కేసు నమోదు చేశారు. అప్పటికప్పుడు వైఎస్ జగన్ ప్రభుత్వానికి నోటీసులను జారీ చేశారు. ఈ ఘటన చోటు చేసుకోవడానికి గల కారణాలను సవివరింగా వెల్లడించాలని ఆదేశించారు. దీనితోపాటు- గ్యాస్ వెలువడిన తరువాత ప్రభుత్వం తీసుకున్న ఎలాంటి సహాయక చర్యలను తీసుకుందో వివరించాలి పేర్కొంది. ఆసుపత్రుల్లో బాధితులకు ఎలాంటి చికిత్సను అందజేస్తున్నారనే విషయాన్ని సమగ్రంగా వివరిస్తూ నివేదికను అందజేయాలని సూచించింది.