మత్స్యకారులను రప్పించడానికి రూ.3 కోట్లు విడుదల చేసిన జగన్ సర్కార్: ఉత్తర్వులు జారీ
అమరావతి: దేశవ్యాప్తంగా అమలు చేస్తోన్న లాక్డౌన్ వల్ల గుజరాత్లో చిక్కుకుపోయిన ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన జాలర్లను స్వస్థలాలకు రప్పించడానికి రాష్ట్ర ప్రభుత్వ మూడు కోట్ల రూపాయలను విడుదల చేసింది. ఈ మేరకు గురువారం ఉత్తర్వులను జారీ చేసింది. ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి ఈ మొత్తాన్ని మంజూరు చేస్తూ రెవెన్యూ (సీఎంఆర్ఎఫ్) శాఖ ముఖ్య కార్యదర్శి వీ ఉషారాణి ఉత్తర్వులను జారీ చేశారు. ఈ మొత్తాన్ని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్కు బదలాయించారు.
జీవనోపాధి కోసం ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల నుంచి సుమారు అయిదు వేల మంది మత్స్యకారులు గుజరాత్కు వెళ్లిన విషయం తెలిసిందే. గిర్ సోమనాథ్ జిల్లాలోని వెరావల్ హార్బర్లో వారు పని చేస్తూ అక్కడే నివసిస్తున్నారు. లాక్డౌన్ వల్ల వారు జీవనోపాధిని కోల్పోయారు. లాక్డౌన్ ప్రకటించిన అనంతరం చేపలవేటపై నిషేధాన్ని విధించడం, హార్బర్లోపనులు స్తంభించిపోవడం వల్ల రోడ్డున పడ్డారు. తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు.
ఈ విషయం తన దృష్టికి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందించారు. తన కౌంటర్ పార్ట్ విజయ్ రుపానీతో ఫోనులో మాట్లాడారు. తెలుగు మత్స్యకారులను స్వరాష్ట్రానికి పంపించడానికి ఏర్పాట్లు చేయాలని విజ్ఞప్తి చేశారు. విజయ్ రుపానీ ఈ విషయాన్ని కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు వివరించారు. దీనితో మత్స్యకారులను స్వరాష్ట్రానికి తరలించడానికి కేంద్ర హోం శాఖ అనుమతులను ఇచ్చింది. ఆ వెంటనే- యుద్ధ ప్రాతిపదికన గుజరాత్ ప్రభుత్వం బస్సులను ఏర్పాటు చేసింది.
Recommended Video
వెరావల్ నుంచి దశలవారీగా మత్స్యకారులను ఏపీకి పంపిస్తున్నారు గుజరాత్ అధికారులు. తొలివిడతలో కొన్ని బస్సులు అక్కడి నుంచి బయలుదేరాయి. శనివారం నాటికి శ్రీకాకుళానికి చేరుకోనున్నాయి. మొత్తం అయిదువేల మంది మత్స్యకారులను తరలించాల్సి రావడం వల్ల గుజరాత్ ప్రభుత్వం మొత్తం 65 బస్సులను సమకూర్చింది. దానికి అయ్యే ఖర్చును ఏపీ ప్రభుత్వమే భరించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. దీనితో జగన్ సర్కార్..మత్స్యకారులను స్వస్థలానికి తరలించడానికి అవసరమయ్యే మూడు కోట్ల రూపాయలను ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి విడుదల చేసింది. ఈ మొత్తాన్ని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్కు బదిలీ చేసింది.