పోలవరం ముంపు గ్రామాల కోసం ఆర్థిక ప్యాకేజీ: రూ.79 కోట్లు: గండికోట నిర్వాసితుల కోసం రూ.146 కోట్లు
అమరావతి: రాష్ట్రానికి గుండెకాయగా చెప్పుకొనే పోలవరం భారీ నీటి పారుదల ప్రాజెక్టు పనుల్లో రాష్ట్ర ప్రభుత్వం వేగాన్ని పెంచింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులపై సమీక్ష నిర్వహించిన మరుసటి రోజే మరో అడుగు ముందుకు పడింది. ప్రాజెక్టు నిర్మాణం వేగం పుంజుకోవడంలో అత్యంత కీలకంగా భావించే సహాయ, పునరావాస (ఆర్ అండ్ ఆర్) చర్యలను చేపట్టింది. పోలవరం ముంపు గ్రామాల ప్రజలను తరలించడానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చింది.
దేవీపట్నం, పూడిపల్లి మండలాల్లో
ముంపు గ్రామాల ప్రజలకు పరిహారం కింద భారీ మొత్తాన్ని చెల్లించనుంది. దీనికోసం 79 కోట్ల రూపాయల మొత్తాన్ని ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు జల వనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ గురువారం ఉత్తర్వులను జారీ చేశారు. పోలవరం బ్యాక్ వాటర్ పరిధిలోకి వచ్చే దేవీపట్నం, పూడిపల్లి మండలాల పరిధిలోని ఆరు గ్రామాలను ఖాళీ చేయించడానికి ఈ మొత్తాన్ని వినియోగించాల్సి ఉంటుందని ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
1106 కుటుంబాల కోసం
ఈ ఆరు గ్రామాల్లో మొత్తం 1106 కుటుంబాలు నివసిస్తున్నట్లు గుర్తించింది. ఆయా కుటుంబాల వారందరినీ సురక్షిత ప్రదేశానికి తరలించడం, వారికి పరిహారాన్ని చెల్లించాల్సి ఉంటుంది. దీనికి అదనంగా ప్రత్యేకంగా ఆర్ అండ్ ఆర్ కాలనీలను కూడా నిర్మించి ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. తొలి విడతగా 79 కోట్ల రూపాయలను మంజూరు చేసింది. ఈ ఏడాది వర్షాకాలం సీజన్ ఆరంభం అయ్యే నాటికి కాలనీలను నిర్మించాల్సి ఉంటుందని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించింది.
వర్షాకాలం నాటికి కాలనీల నిర్మాణం..
ముంపు గ్రామాల తరలింపు, కాలనీల నిర్మాణానికి మరిన్ని నిధులు అవసరం అయ్యే అవకాశం ఉంటుందని ప్రభుత్వం అంచనా వేసింది. ఇందులో తొలివిడతగా 79 కోట్ల రూపాయలను మంజూరు చేసింది. అనంతరం- కాలనీల నిర్మాణానికి ఎంత మొత్తం అవసరం అవుతుందనే విషయంపై నివేదిక అందిన తరువాత.. ఆ మొత్తాన్ని విడుదల చేస్తుందని అంటున్నారు. ఈ ఆరు గ్రామాల నివాసులు తమ ఇంటిని, స్థలాన్ని వదిలేసి వెళ్లాల్సి ఉన్నందున.. రెండింటికీ వేర్వేరుగా లెక్క కట్టింది ప్రభుత్వం.
Recommended Video
గండికోట ముంపు గ్రామాల కోసం 146 కోట్లు..
కడప జిల్లాలోని గండికోట రిజర్వాయర్ కింద ముంపు గ్రామాల బాధితుల కోసం ప్రభుత్వం 145.94 కోట్ల రూపాయలను మంజూరు చేసింది. కడప జిల్లా కొండాపురం సమీపంలో పెన్నా, చిత్రావతి నదులపై నిర్మించిన ఈ ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 27 టీఎంసీలు. ఖరీఫ్ సీజన్లో ఆయకట్టు కింద వేలాది ఎకరాలకు సాగునీటిని అందించడానికి ఈ ప్రాజెక్టును నిర్మించారు. ఈ ప్రాజెక్టు వల్ల నిర్వాసితుల కోసం మొత్తం 479.35 కోట్ల రూపాయలు సహాయ, పునరావాస ప్యాకేజీ అవసరం అవుతుందని అంచనా వేశారు. ఇదివరకే 146 కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేసింది. తాజాగా రెండో విడతగా 145.96 కోట్లను విడుదల చేసింది.