ఎసరు పెట్టిన టీ కొట్టు: నరసరావుపేట మున్సిపల్ కమిషనర్పై బదిలీ వేటు: ఆయన స్థానంలో.. !
గుంటూరు: రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుదల విషయాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. నివారించదగ్గ అవకాశం ఉన్న పరిస్థితుల్లో కూడా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండటం పట్ల ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తోంది. అధికార యంత్రాంగం తప్పిదలను ఏ మాత్రం క్షమించట్లేదు. కఠిన చర్యలకు దిగుతోంది ప్రభుత్వం. నిన్నటికి నిన్న కర్నూలు మున్సిపల్ కమిషనర్పై బదిలీ వేటును వేసింది ప్రభుత్వం. తాజాగా గుంటూరు జిల్లా నరసరావుపేట మున్సిపల్ కమిషనర్ను బదిలీ చేసింది.
కావలిలో పోస్టింగ్..
నరసరావుపేట మున్సిపల్ కమిషనర్ బీ శివారెడ్డిని బదిలీ చేసింది. ఆయనను నెల్లూరు జిల్లా కావలి మున్సిపల్ కమిషనర్గా పోస్టింగ్ ఇచ్చింది. కావలి మున్సిపల్ కమిషనర్ కే వెంకటేశ్వర రావును నరసరావుపేటకు బదిలీ చేసింది. కే వెంకటేశ్వరరావును నరసరావుపేట మున్సిపల్ కమిషనర్గా నియమించింది. వెంటనే బాధ్యతలను స్వీకరించాల్సి ఉంటుందని పేర్కొంది. ఈ మేరకు మున్సిపల్ శాఖ కార్యదర్శి జే శ్యామలరావు శుక్రవారం ఉత్తర్వులను జారీ చేశారు.
ఎసరు పెట్టిన టీ కొట్టు..
మున్సిపల్ కమిషనర్ బదిలీ కావడానికి ఓ టీ కొట్టు కారణమైందంటే ఆశ్చర్యం వేస్తుంది. కరోనా వైరస్ను వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి లాక్డౌన్ను కట్టుదిట్టంగా అమలు చేస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో నరసరావుపేటలో ఓ టీ కొట్టు తెరవడం, అక్కడ టీ తాగిన వ్యక్తి ద్వారా కరోనా వైరస్ ఇతరులకు సోకడం కలకలం రేపింది. ప్రస్తుతం నరసరావుపేటలో 104కు పైగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఆ వ్యక్తికి ఢిల్లీ వెళ్లొచ్చిన ట్రావెల్ హిస్టరీ ఉందనే విషయాన్ని తెలుసుకోవడంలో జాప్యం చేయడం దీనికి కారణమైందని అంటున్నారు.
ట్రేస్ చేయలేకపోవడం..
ఢిల్లీ నిజాముద్దీన్ ప్రాంతంలోని మర్కజ్ మసీదు భవనంలో నిర్వహించిన తబ్లిగి జమాత్ సామూహిక మత ప్రార్థనలకు వెళ్లొచ్చిన ఆ వ్యక్తిని సకాలంలో మున్సిపల్ అధికారులు ట్రస్ చేయలేకపోయారు. పైగా లాక్డౌన్ ఉన్న సమయంలో టీ కొట్టును నిర్వహిస్తోన్న విషయాన్ని పసిగట్టలేకపోవడం వంటి కారణాల వల్ల బీ శివారెడ్డిపై బదిలీ వేటు వేసినట్లు తెలుస్తోంది. ఈ రెండూ నివారించదగ్గ తప్పిదాలేనని ప్రభుత్వం భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఢిల్లీ వెళ్లొచ్చిన ఆ టీ కొట్టు యజమానికి సకాలంలో గుర్తించి ఉంటే.. నరసరావుపేటలో వందకు పైగా పాజిటివ్ కేసులు నమోదు అయ్యేవి కావని అధికారులు అభిప్రాయపడుతున్నారు.
లాక్డౌన్ ఆరంభంలోనే..
నరసరావుపేటలో కరోనా ఈ స్థాయిలో వ్యాపించడం వెనుక ఉన్న మిస్టరీనీ పోలీసులు చేధించారు. లాక్ డౌన్ మొదలైన తొలి రోజుల్లోనే ఓ వ్యక్తి టీ కొట్టు తెరిచాడు. అక్కడ ఢిల్లీ మర్కజ్కు వెళ్లిన ఓ వ్యక్తి టీ తాగాడు. అతను చనిపోయిన తరువాతే కరోనా ఉందనే విషయాన్ని అధికారులు గుర్తించారు. ఫలితంగా అతను కలిసిన వారందరికీ కరోనా సోకింది. దీన్ని అధికారుల తప్పిదంగా ప్రభుత్వం భావిస్తోంది. మున్సిపల్ సిబ్బందిని సమర్థవంతంగా నడిపించలేకపోయిన శివారెడ్డిని బదిలీ చేసింది.