పాలనలో మెరుపు వేగం: యాక్షన్లోకి దిగిన జగన్ సర్కార్: జిల్లాల్లో ఇక ముగ్గురు జేసీలు: పోలవరానికి ఐఎఎస్
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో మెరుపు నిర్ణయాన్ని తీసుకున్నారు. మౌఖికంగా ఆయన ఆదేశాలను జారీ చేసిన మూడోరోజే ఉత్తర్వులు అమల్లోకి వచ్చేశాయి. ఆదివారం సెలవురోజైనప్పటికీ.. వెనుకాడలేదు. ఉత్తర్వులు వెలువడేలా చర్యలు తీసుకున్నారు. విశాఖపట్నంలో ఎల్జీ పాలిమర్స్ కంపెనీలో విష వాయువు వెలువడిన ఘటనలో మృతుల కుటుంబాలకు కోటి రూపాయల ఎక్స్గ్రేషియోను ప్రకటించిన మరుసటి రోజే దానికి సంబంధించిన జీవోను విడుదల చేసిన జగన్ సర్కార్.. అదే తరహాలో జాయింట్ కలెక్టర్ల సంఖ్యను పెంచేలా తక్షణ ఉత్తర్వులను జారీ చేసింది.
27 మంది జూనియర్ ఐఎఎస్లకు స్థానచలనం..
రాష్ట్రవ్యాప్తంగా 27 మంది జూనియర్ ఐఎఎస్ అధికారులకు ప్రభుత్వం స్థానచలనం కల్పించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నీ ఉత్తర్వులను జారీ చేశారు. జిల్లా అధికార యంత్రాంగాన్ని మరింత బలోపేతం చేసేలా.. పరిపాలనను కట్టుదిట్టం చేయడంలో భాగంగా జిల్లాలకు ముగ్గురు జాయింట్ కలెక్టర్లను నియమించడానికి వీలుగా ఆమె ఈ బదిలీ ప్రక్రియను పూర్తి చేశారు. రైతు భరోసా, రెవెన్యూ, గ్రామ/వార్డు సచివాలయాలు, గ్రామ/వార్డు వలంటీర్ల వ్యవస్థను పటిష్టం చేస్తామని గురువారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో వైఎస్ జగన్ ప్రకటించారు. దీనికి అనుగుణంగా ఆదివారం ఉత్తర్వులు వెలువడ్డాయి.
పని విభజన కూడా..
కొత్తగా బదిలీ చేసిన ఐఎఎస్ అధికారులకు పని విభజనను కూడా పూర్తి చేశారు. వారి బాధ్యతలను వారికి అప్పగించడంలో ప్రభుత్వం ఏ మాత్రం జాప్యం చేయలేదు. జాయింట్ కలెక్టర్లకు పని విభజనను కూడా నిర్దేశించింది. జాయింట్ కలెక్టర్-1 ఆధీనంలో రైతు భరోసా, రెవెన్యూ విభాగం ఉంటుంది. వీరిని జేసీ-ఆర్బీ అండ్ ఆర్గా పిలుస్తారు. జాయింట్ కలెక్టర్-2 పరిధిలో గ్రామ/వార్డు సచివాలయాల వ్యవస్థను తీసుకొచ్చింది. జేసీ-2 పోస్టు కొత్తగా సృష్టించినదే. ఇంతకుముందు ఈ పోస్టు ఉండేది కాదు. సీనియర్ టైమ్ స్కేలు ఉన్న ఐఏఎస్ అధికారిని నియమించారు. ఇప్పుడున్న నాన్ కేడర్ జాయింట్ కలెక్టర్ పోస్టు పరిధిలోకి వైద్య, ఆరోగ్య వంటి విభాగాలను చేర్చారు. తాజాగా బదిలీ అయిన ఐఎఎస్ అధికారుల్లో 2013 నుంచి కొత్తగా శిక్షణ పూర్తి చేసుకున్న వారిని నియమించారు.
Recommended Video
పోలవరం ప్రాజెక్టు కోసం ప్రత్యేక ఐఎఎస్ అధికారి..
కాగా.. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోన్న ప్రాజెక్టుల్లో ఒకటి పోలవరం. దీనికోసం ప్రత్యేకంగా ఓ ఐఎఎస్ అధికారిని నియమితులయ్యారు. పోలవరం స్పెషల్ ఆఫీసర్ పోస్టు స్థాయిని పెంచింది. దీన్ని అడ్మినిస్ట్రేటర్గా మార్చింది. ప్రస్తుతం పోలవరం ప్రత్యేకాధికారిగా కొనసాగుతోన్న ఓ. ఆనంద్ను అదే పోస్టులో పోలవరం ప్రాజెక్టు అడ్మినిస్ట్రేటర్గా నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నీ ప్రత్యేక జీవోను జారీ చేశారు. పోలవరం కోసం అడ్మినిస్ట్రేటర్ స్థాయి అధికారిని నియమించడం ఇదే తొలిసారి కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.