వివాదాల విశాఖ సహా : కరోనా దెబ్బకు భూములను అమ్ముకుంటోన్న జగన్ సర్కార్: వారికి మళ్లీ ఛాన్స్
అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం భూముల అమ్మకాలకు తెర తీసింది. కరోనా వైరస్, దాని వల్ల విధించిన లాక్డౌన్, కేంద్రం నుంచి సరైన ఆర్థిక సహకారం లేకపోవడం వంటి పరిణామాల మధ్య విలువైన ప్రభుత్వ భూములను విక్రయించడానికి ఏర్పాట్లు పూర్తి చేసింది. విశాఖపట్నం, గుంటూరుల్లో మొత్తం తొమ్మిది చోట్ల విలువైన భూములను అమ్మకానికి పెట్టింది. దీనికోసం ఈ నెల ఈ నెల 29వ తేదీన ఇ-వేలంపాటను నిర్వహించబోతోంది. కనీసం 250 నుంచి 300 కోట్ల రూపాయలను సమకూర్చుకోవాలనేది ప్రభుత్వం లక్ష్యంగా కనిపిస్తోంది.
లాక్డౌన్ 4.0 ఎలా ఉంటుంది? ఇక ప్రజా రవాణా వైపే మొగ్గు: మెట్రో రైళ్లూ రెడీ అవుతున్నాయ్
బిల్డ్ ఏపీ నేతృత్వంలో..
బిల్డ్ ఏపీ మిషన్ డైరెక్టర్ దీనికి సంబంధించిన ఉత్తర్వులను జారీ చేశారు. విశాఖపట్నంలో ఆరు, గుంటూరులో తొమ్మిది చోట్ల ప్రభుత్వ ఆధీనంలోని భూములను విక్రయించబోతున్నట్లు వెల్లడించారు. ఎక్కడ ఎలా ఉన్నది అలాగే ప్రాతిపదికన భూములను అమ్మకానికి ఉంచినట్లు పేర్కొన్నారు. ఈ నెల 29వ తేదీన ఇ-ఆక్షన్ను నిర్వహించబోతున్నామని, ఆసక్తిగల వారు www.ap.gov.in, www.nbccindia.com, www.tenderwizard.com/nbcc వెబ్సైట్ల ద్వారా తమ వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు.
ఎన్బీసీసీ అనుమతితో..
అమ్మకానికి ఉంచిన భూముల వివరాలు, ఫొటోలు, అది ఉన్న ప్రదేశం, రిజర్వ్ ధర, ఇతర నిబంధనలను ఆయా వెబ్సైట్లలో పొందుపరిచినట్లు మిషన్ డైరెక్టర్ తెలిపారు. ప్రభుత్వ భూముల అమ్మకానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని చెప్పారు. కేంద్ర గృహ నిర్మాణ మంత్రిత్వ శాఖ ఆధనీంలో పని చేసే నేషనల్ బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్స్ కార్పొరేషన్ (ఎన్బీసీసీ) గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని పేర్కొన్నారు. ఎన్బీసీసీ సైతం ఈ వేలానికి సహకరిస్తోందని స్పష్టం చేశారు.
నవరత్నాల అమలు కోసం..
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంలో కీలక పాత్ర పోషించింది మేనిఫెస్టో. నవరత్నాల పేరుతో ప్రకటించిన సంక్షేమ పథకాలను ప్రభుత్వం చేస్తోంది. అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలల వ్యవధిలోనే 80 శాతం మేర హామీలను నెరవేర్చామని అధికార పార్టీ నాయకులు పలు సందర్భాల్లో చెప్పుకొన్నారు. అవన్నీ నిధులతో ముడిపడి ఉన్నవే. నవరత్నాలతో పాటు నాడు-నేడు వంటి కొన్ని సంక్షేమ పథకాలను అమలు చేయడానికి ఖజానా ఖాళీ కావడంతో నిధులను సమీకరించుకోవడానికి భూములను విక్రయించాల్సి వస్తోందనేది ప్రభుత్వ వాదన.
Recommended Video
రాజకీయ ప్రత్యర్థులకు అవకాశం ఇచ్చినట్టే..
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆయన ప్రభుత్వాన్ని టార్గెట్గా చేసుకుని, ఆకాశమే హద్దుగా విమర్శలను గుప్పించడానికి రాజకీయ ప్రత్యర్థులకు ఇది అనుకోని అవకాశంగా మారినట్టేననడంలో సందేహాలు అనవసరం. అందులోనూ భవిష్యత్తు రాజధానిగా గుర్తింపు పొందిన విశాఖపట్నంలో భూములను అమ్మాకానికి ఉంచడం ప్రతిపక్షాలు మరింతగా చెలరేగిపోవడానికి వీలు కల్పించిందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. విశాఖలో ప్రభుత్వం భూముల దోపిడీకి పాల్పడుతోందంటూ ఆరోపణలు ఆరంభం అయ్యాయి కూడా. ప్రభుత్వం సంక్షేమ పథకాల పేరుతో నిధులను దుర్వినియోగం చేస్తోందంటూ విమర్శలు ఉత్తరాంధ్ర తెలుగుదేశం పార్టీ నాయకులు ధ్వజమెత్తుతున్నారు.