యూపీ కంటే అధ్వాన్నం! దేశంలోనే మూడో స్థానంలో నిలిచిన ఏపీ..అభివృద్ధిలో అనుకుంటే పొరపాటే
న్యూఢిల్లీ: ఎన్నికలు సమీపించాయంటే మనరాష్ట్రంలో వందల కోట్ల రూపాయలు చేతులు మారుతుంటాయి. రాత్రికి రాత్రి కోట్ల రూపాయలను ఓటర్లపై వెదజల్లుతుంటారు వివిధ పార్టీల అభ్యర్థులు. ఏపీలో ఎన్నికలు అత్యంత ఖరీదైనవిగా ఇదివరకే గుర్తింపు ఉంది. ఆ దుస్సంప్రదాయం మన రాష్ట్రంలో ఇంకా కొనసాగుతూనే ఉంది. ఏడాదికేడాది ఎన్నికల్లో ధనప్రవాహం విపరీతంగా పెరుగుతోందే తప్ప, తగ్గుముఖం పట్టట్లేదు. మద్యమూ అంతే.. ఏరులై పారుతోందనడానికి ఉదాహరణలు చాలానే ఉన్నాయి. మనమే అనుకుంటే మనల్ని మించిన రాష్ట్రాలు కూడా ఉన్నాయి. అవే గుజరాత్, తమిళనాడు. ఎన్నికల వేళ దేశవ్యాప్తంగా స్వాధీనం చేసుకున్న నగదులో గుజరాత్ టాప్ లో ఉంది. దాని తరువాతి స్థానాలను తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ ఆక్రమించాయి.
రెండు వారాల్లో 1,582 కోట్ల రూపాయలు సీజ్..
రెండే రెండు వారాలు. ఈ కాస్త వ్యవధిలో దేశవ్యాప్తంగా 1582 కోట్ల రూపాయలను ఎన్నికల అధికారులు స్వాధీనం చేసుకున్నారంటే మాటలు కాదు. దీన్ని బట్టి మనదేశంలో ఎన్నికల నిర్వహణ కంటే ఓటర్లను ప్రలోభాలకు గురి చేయడానికి చేసే ఖర్చే అధికం. వేల లీటర్ల మద్యం బాటిళ్లు, బంగారం, గృహోపకరణాలను ఎన్నికల అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గుజరాత్ లో దొరికిన నగదు, ఇతర వస్తువుల విలువ 510 కోట్ల రూపాయలుగా లెక్క కట్టారు అధికారులు. 270 కోట్ల రూపాయలతో తమిళనాడు రెండో స్థానంలో ఉండగా.. 518 కోట్ల రూపాయలతో ఏపీ మూడో స్థానంలో నిలిచింది. ఆ తరువాతి నాలుగు, అయిదు స్థానాలను పంజాబ్, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాలు ఆక్రమించాయి. ఇప్పటిదాకా పంజాబ్ లో 155 కోట్ల రూపాయలు దొరకగా.. ఉత్తర్ ప్రదేశ్ లో 142 కోట్ల రూపాయలను ఎన్నికల అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
అదంతా నల్లడబ్బే..
లోక్ సభ ఎన్నికల సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్న విషయం తెలిసిందే. పెద్ద మొత్తంలో నగదును వెంట తీసుకెళ్లడంపై నిషేధం ఉంది. అయినప్పటికీ. యథేచ్ఛగా భారీ మొత్తంలో నగదును తరలిస్తున్నారు రాజకీయ నాయకులు. అదంతా నల్ల డబ్బే అనడం సందేహాలు అక్కర్లేదు. రెండురోజుల కిందటే హైదరాబాద్ లోని హైటెక్ సిటీ మెట్రో స్టేషన్ వద్ద సైబరాబాద్ పోలీసులు రెండు కోట్ల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నగదు మొత్తం అంతా తెలుగుదేశం పార్టీ లోక్ సభ సభ్యుడు మాగంటి మురళీ మోహన్ కు చెందిన జయభేరి గ్రూప్ సంస్థలకు చెందినదని పోలీసులు నిర్ధారించారు. ఈ ఘటనలో మురళీమోహన్ సహా ఆరుమందిపై కేసు నమోదు చేశారు.
డ్రగ్స్ కూడా పంపిణీ చేస్తున్నారా?
ఈ ఎన్నికల ప్రచారంలో డ్రగ్స్ కూడా పంపిణీ చేస్తున్నారనే విషయం తాజాగా వెల్లడైంది. కేంద్ర ఎన్నికల కమిషన్ జారీ చేసిన ప్రకటన ప్రకారం.. 1582 కోట్ల రూపాయల విలువైన వస్తువుల్లో డ్రగ్స్ కూడా ఉన్నట్లు తేలింది. దాని విలువ 705 కోట్ల రూపాయలుగా నిర్ధారించారు. ఇంత పెద్ద మొత్తంలో డ్రగ్స్ ను ఓటర్లకు సరఫరా చేస్తూ దొరకడం బహుశా దేశ చరిత్రలో ఇదే తొలిసారి అనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. 377 కోట్ల రూపాయలకు పైగా నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీనితో పాటు 157 కోట్ల రూపాయల విలువ చేసే మద్యం, 705 కోట్ల విలువైన డ్రగ్స్ ను సీజ్ చేశారు. 312 కోట్ల రూపాయలు విలువ చేసే బంగారం, వెండి వస్తువులు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. అలాగే- 28 కోట్ల రూపాయల విలువ చేస్తే గృహోపకణాలు, క్రీడా సామాగ్రి ఉన్నట్లు స్పష్టమైంది.
ఎందులో.. ఏ రాష్ట్రం.. ఏ స్థానంలో..
మద్యం సరఫరాలో..
మహారాష్ట్ర- 19 లక్షల లీటర్లు, ఉత్తరప్రదేశ్- 12 లక్షల లీటర్లు, కర్ణాటక- 7.44 లక్షల లీటర్లు, పశ్చిమ బెంగాల్- 6.92లక్షల లీటర్లు, ఆంధ్రప్రదేశ్- 5.55 లక్షల లీటర్లు.
నగదు పంపిణీలో..
గుజరాత్- 510 కోట్లు,తమిళనాడు- రూ.127.84 కోట్లు, ఆంధ్రప్రదేశ్- రూ.95.79 కోట్లు, మహారాష్ట్ర- రూ.26.69 కోట్లు, ఉత్తరప్రదేశ్- రూ.24.11 కోట్లు
డ్రగ్స్ అందజేతలో..
గుజరాత్- రూ.500 కోట్లు, పంజాబ్- రూ.116 కోట్లు, మణిపూర్- రూ.27.13 కోట్లు
బంగారం, వెండి వస్తువులను పంపిణీ చేయడంలో..
తమిళనాడు- రూ.135.6 కోట్లు, ఉత్తరప్రదేశ్- రూ.60.29 కోట్లు
గృహోపకరణాలు, క్రీడా సామాగ్రిలో..
ఆంధ్రప్రదేశ్- రూ.10 కోట్లు, తమిళనాడు- రూ.6.19 కోట్లు, రాజస్థాన్- రూ.3.11 కోట్లు