ఏపీలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టినట్టేనా?: 82 నుంచి దశలవారీగా: కొత్తగా 58 మందికి పాజిటివ్
అమరావతి: రాష్ట్రంలో కరోనా వైరస్ తీవ్రత కాస్త తగ్గుముఖం పట్టినట్టే కనిపిస్తోంది. కొద్దిరోజులుగా వరుసగా నమోదవుతోన్న డేటాను పరిశీలిస్తే.. కొత్తగా నమోదవుతోన్న పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా క్షీణిస్తూ వస్తోంది. ఇది ఊరట కలిగించే విషయమేనని వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు చెబుతున్నారు. గరిష్ఠంగా 82 కేసులు నమోదైన తరువాత.. పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టాయని అంటున్నారు. ఆదివారం నాటికి కొత్తగా 58 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీనితో రాష్ట్రంలో ఇప్పటిదాకా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 1583కు చేరుకుంది. ఇందులో యాక్టివ్గా ఉన్నవి మాత్రం 1062.
Recommended Video
తాజాగా కేసుల్లో అత్యధికం కర్నూలు జిల్లాలోనివే. కొత్తగా ఆ జిల్లాలో 30 పాజిటివ్ కేసులు వెలుగులోకి వచ్చాయి. దీనితో ఈ ఒక్క జిల్లాలోనే కరోనా వైరస్ బారిన పడిన వారి సంఖ్య 466కు చేరుకుంది. అదే జిల్లాలో ఇప్పటిదాకా 77 మంది పేషెంట్లు కరోనా బారి నుంచి సురక్షితంగా బయట పడ్డారు. పూర్తి ఆరోగ్యవంతులు అయ్యారు. ఆసుపత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. రాష్ట్రం మొత్తం మీద చూసుకుంటే 488 మంది ఆసుపత్రుల నుంచి డిశ్చార్జి కాగా.. 33 మంది కరోనా వల్ల మృత్యువాత పడ్డారు.
24 గంటల వ్యవధిలో కొత్తగా కర్నూలు జిల్లాలో 30 కేసులు నమోదు కాగా.. గుంటూరు-11, కృష్ణా-8, అనంతపురం-7 కేసులు నమోదు అయ్యాయి. చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో ఒక్కో కేసు చొప్నున నమోదైంది. తూర్పు గోదావరి, ప్రకాశం, శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో 24 గంటల్లో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు. గుంటూరు, కృష్ణా, కర్నూలు జిల్లాల్లోనే కరోనా వైరస్ తీవ్రత అత్యధికంగా ఉన్నట్లు స్పష్టమైందని అధికారులు చెబుతున్నారు.
జిల్లాలవారీగా అనంతపురం-78, చిత్తూరు-81, తూర్పు గోదావరి-45, గుంటూరు-319, కడప-83, కృష్ణా-266, కర్నూలు-466, నెల్లూరు-91, ప్రకాశం-61, శ్రీకాకుళం-5, విశాఖపట్నం-29, పశ్చిమ గోదావరి-59 పాజిటివ్ కేసులు నమోదై ఉన్నాయి. అందుల్లో 1062 మాత్రమే యాక్టివ్ కేసులు ఉన్నట్లు అధికారులు తమ తాజా బులెటిన్లో వెల్లడించారు. 24 గంటల వ్యవధిలో మొత్తం 6534మందికి కరోనా పరీక్షలను నిర్వహించామని తెలిపారు. దీనితో మొత్తం కరోనా పరీక్షల సంఖ్య 1,14,937కు చేరుకుందని తెలిపారు.