ఏపీలో బ్రిటన్ తరహా గ్రామీణ వైద్యం: ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్: ఆ ఘటన కదిలించింది: వైఎస్ జగన్
అమరావతి: రాష్ట్రంలో వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. తనకు చాలా ఆనందాన్ని ఇచ్చిన రోజు అని అన్నారు. మొట్ట మొదటిగా డాక్టర్స్ డే సందర్భంగా ఓ వైద్య రంగంలో పెనుమార్పులకు శ్రీకారం చుట్టినరోజుగా మిగిలిపోతుందని చెప్పారు. వైద్యం అందక ఏ ఒక్క కుటుంబం కూడా అప్పులపాలు కాకూడదనే లక్ష్యంతో పనిచేస్తున్నామని వైఎస్ జగన్ అన్నారు. పేదవారికి ఎలా వైద్యం అందించాలనే ఆరాటంతో మార్పులు చేస్తూ ఆరోగ్యశ్రీని రూపొందించామని చెప్పారు.
యూకే తరహా వైద్యం..
రాష్ట్రంలో యూకే తరహాలో ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ను అమలు చేయబోతున్నామని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికీ ఇద్దరు డాక్టర్లు ఉంటారని, 104 అంబులెన్స్లో మరో డాక్టర్ ఉంటారని వారి పరిధిలోకి అయిదు గ్రామాలను తీసుకొస్తామని అన్నారు. ఆ డాక్టర్లు తన పరిధిలోని ప్రతి గ్రామానికీ నెలకు ఒకసారి,ప్రతి వ్యక్తిని ఎలక్ట్రానిక్ డేటాలో ఏంట్రీ చేస్తారని, వారికి మందులు ఇస్తారని చెప్పారు. మిగిలిన రోజు ఆ డాక్టర్ పీహెచ్సీలో అందుబాటులో ఉంటారని అన్నారు. ఈ తరహా విధానం యూకేలో అమల్లో ఉందని, దాన్ని రాష్ట్రంలో సమర్థవంతంగా అమలు చేస్తామని చెప్పారు.
1.42 కోట్ల ఆరోగ్యశ్రీ హెల్త్ కార్డులు..
రాష్ట్రంలో 1.42 కోట్ల ఆరోగ్యశ్రీ హెల్త్ కార్డులు అందజేశామని వైఎస్ జగన్ అన్నారు. క్యూ ఆర్ కోడ్తో రూపొందించిన ఈ ఆరోగ్యశ్రీ కార్డులో ప్రతి ఒక్కరి హెల్త్ రికార్డు ఉంటుందని, ప్రతి రోగి డిజిటల్ ఎలక్ట్రానిక్ రికార్డు అందుబాటులో ఉంటుందని స్పష్టం చేశారు. ఆ వివరాలన్నింటినీ త్వరలోనే వైఎస్ఆర్ విలేజీ క్లినిక్స్, 104 అంబులెన్స్లకు అనుసంధానం చేస్తామని అన్నారు. ఫలితంగా- ఆ కార్డుదారుడు, అతని కుటుంబ సభ్యుల సమగ్ర వివరాలు అందులో పొందుపర్చుతామని అన్నారు. దానికి అనుగుణంగా సత్వర వైద్యాన్ని అందిస్తామని చెప్పారు.
Recommended Video
ఎలుకలు కొరికి..
గత ప్రభుత్వ హయాంలో ఆసుపత్రుల పరిస్థితులు అధ్వాన్నంగా ఉండేవని వైఎస్ జగన్ విమర్శించారు. ఎలుకలు కొరికి చిన్న పిల్లలు చనిపోయిన సందర్భాలు, సెల్ఫోన్ వెలుతురులో ఆపరేషన్లు చేసిన సంఘటనలు ఉన్నాయని అన్నారు. ఆ ఘటనలు తనను కదిలించాయని చెప్పారు. గతంలో 108 వాహనాలు అరకొరగా నడిచేవని, 336 అంబులెన్సులు మాత్రమే అందుబాటులో ఉండేవని వైఎస్ జగన్ అన్నారు. ఆ దుస్థితిని పోగొట్టడానికి ప్రజల్లో భరోసా కల్పించడానికి పట్టణ ప్రాంతాల్లో 108కు ఫోన్ కొడితే 15 నిమిషాల్లో, గ్రామాల్లో 20 నిమిషాల్లో, ఏజెన్సీల్లో 25 నిమిషాల్లో అంబులెన్స్ వస్తుందనే భరోసా కల్పించామని అన్నారు.
కర్నూలులో కేన్సర్ సెంటర్
త్వరలో కర్నూలులో ప్రభుత్వ ఆధీంలో పనిచేసే అత్యాధునికమైన కేన్సర్ సెంటర్ను నెలకొల్పబోతున్నామని వైఎస్ జగన్ అన్నారు. ప్రభుత్వ ఆధీనంలో గుంటూరు జనరల్ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన నాట్కో కేన్సర్ సెంటర్ను ఆయన ప్రారంభించారు. మొత్తం మూడు విభాగాలు ఈ సెంటర్లో అందుబాటులో ఉంటాయని, దీనికి వెంకయ్య చౌదరి సహకరించారని అన్నారు. ఇలాంటి కేంద్రాన్ని త్వరలో కర్నూలులో కూడా నిర్మిస్తామని జగన్ తెలిపారు. నాడు-నేడు ద్వారా జాతీయ ప్రమాణాలు ఉండేలా ఆసుపత్రులను తీర్చిదిద్దుతున్నామని స్పష్టం చేశారు.