విశాఖ తీరంలో విధ్వంసం: పోటెత్తుతున్న సముద్రం: మత్స్యకారుల నివాసాల్లో దూసుకొచ్చిన అలలు
విశాఖపట్నం: బంగాళాఖాతం ఆగ్నేయదిశగా ఏర్పడిన అంఫన్ తుఫాన్ తీరం వైపు దూసుకొస్తోంది. ఈ సాయంత్రానికి పశ్చిమ బెంగాల్లోని దిఘా పట్టణం బంగ్లాదేశ్లోని హాతియా దీవుల మధ్య సుందర్బన్స్ ప్రాంతం సమీపంలో తీరాన్ని దాటబోతోంది. దీని ప్రభావం వల్ల ఏపీ సహా ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి. ఏపీలో దీని ప్రభావం ఉత్తరాంధ్రపై తీవ్రంగా పడింది. తూర్పు గోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఈదురు గాలులు వణికిస్తున్నాయి. తీర ప్రాంతం పొడవునా సముద్రం పోటెత్తింది. మత్స్యకారుల నివాసాల్లోకి సముద్రపు నీరు ప్రవేశించింది.
కోస్తా తీర గ్రామాల్లో అలజడి: భారీగా మోహరించిన ఎన్డీఆర్ఎఫ్: మైకుల ద్వారా హెచ్చరిస్తూ..
తీరంలో భయానక పరిస్థితులు..
తూర్పు గోదావరి, విశాఖపట్నం జిల్లా సముద్ర తీర ప్రాంతాల్లో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. తుఫాన్ ప్రభావంతో జిల్లాలోని రాజోలుదీవి, ఉప్పాడ, ఓడల రేవు వంటి ప్రాంతాల్లో సముద్రం 20 మీటర్ల మేర ముందుకొచ్చింది. మూడు నుంచి నాలుగు అడుగుల ఎత్తు వరకు అలలు ఎగిసిపడుతున్నాయి. రాజోలు దీవిలో సముద్ర తీరం వెంబడి భారీగా అలలు భూభాగం వైపు చొచ్చుకొచ్చాయి. భూభాగం కూడా కోసుకుపోయింది. ఉప్పాడలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. అలల ధాటికి ఉప్పాడ నుంచి కాకినాడకు వెళ్లే రోడ్డు ధ్వంసం కావడం వల్ల ఈ మార్గంలో రాకపోకలను నిలిపివేశారు స్థానిక రెవెన్యూ అధికారులు.
తూర్పు గోదావరి తీర గ్రామాల్లో అప్రమత్తం..
అంఫన్ తుపాను హెచ్చరికల నేపథ్యంలో జిల్లాలోని తీరప్రాంత మండలాల్లో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. ఇప్పటికే కాకినాడ పోర్టులో రెండో ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. కలెక్టర్ కార్యాలయం సహా అన్ని రెవెన్యూ డివిజన్లలో కంట్రోల్ రూములను ఏర్పాటు చేశారు. తీర ప్రాంతాల గ్రామాలైన తుని, ఉప్పాడ కొత్తపల్లి, తాళ్లరేవు, కాకినాడతోపాటు కోనసీమ ప్రాంతంలోని కాట్రేనికోన, అల్లవరం, అమలాపురం, మలికిపురం, రాజోలు, ముమ్మిడివరం, ఐ.పోలవరం, అయినవిల్లి మండలాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలను జారీ చేశారు.
వణుకుతున్న ఒడిశా..
మరోవంక- అటు ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీర జిల్లాల్లో రాత్రి నుంచి ఏకధాటిగా వర్షాలు కురుస్తున్నాయి. భద్రక్, గంజాం, గజపతి, పూరీ, బాలాసోర్, కటక్, జగత్సింగ్ పూర్, కియొంఝర్, ఖుర్దా, మయూర్భంజ్, నయాఘర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈదురుగాలులు వణికిస్తున్నాయి. భద్రక్ జిల్లాలో గంటకు 11 మిల్లీమీటర్ల వర్షపాతం కురుస్తోందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. పలు చోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలిపోతున్నాయి. వర్షపు నీరు పొలాలను ముంచెత్తింది. ముందుజాగ్రత్త చర్యగా స్థానిక రెవెన్యూ అధికారులు తీర ప్రాంత గ్రామాలను ఖాళీ చేయించారు. వారందరినీ తుఫాన్ షెల్టర్లకు తరలించారు. అక్కడ ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్నారు.
Recommended Video
తీరం దాటే సమయంలో విధ్వంసం..
తుఫాను తీరం దాటే సమయానికి గంటకు 185 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని భారత వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. హోర్డింగులు నేలకూలే ప్రమాదం ఉన్నందున స్థానికులు ఎవ్వరూ ఇళ్లల్లో నుంచి బయటికి రావొద్దని ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ మహాపాత్ర చెప్పారు. పశ్చిమ బెంగాల్లోని ఈస్ట్ మిడ్నాపూర్, వెస్ట్ మిడ్నాపూర్, నార్త్ 24 పరగణ, సౌత్ 24 పరగణ జిల్లాలపై తుఫాన్ ప్రభావం అధికంగా కనిపిస్తోంది. ఆయా జిల్లాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. తుఫాన్ అనంతరం పరిస్థితిని యుద్ధ ప్రాతిపదికన చక్కదిద్దడానికి జాతీయ విపత్తు నిర్వహణ బలగాలు సిద్ధంగా ఉన్నాయి.