హైకోర్టుపైనా కరోనా ఎఫెక్ట్: మార్చి 31 వరకు లాక్డౌన్: కాస్సేపట్లో తుది నిర్ణయం
అమరావతి: ప్రాణాంతక కరోనా వైరస్ ఎఫెక్ట్ రాష్ట్ర హైకోర్టు కార్యకలాపాలపైనా పడే అవకాశాలు లేకపోలేదు. ఈ వైరస్ వ్యాప్తిం చెందడాన్ని నియంత్రించడానికి జగన్ సర్కార్ రాష్ట్రవ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటించిన నేపథ్యలో హైకోర్టు కూడా ఈ మూసివేయొచ్చని తెలుస్తోంది. ఈ దిశగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి మరి కాస్సేపట్లో ఓ ప్రకటన చేస్తారని చెబుతున్నారు. దీనికోసం ఆయన తోటి న్యాయమూర్తులు, బార్ అసోసియేషన్లతో చర్చిస్తున్నట్లు సమాచారం.
లాక్డౌన్లో భాగంగా ప్రభుత్వం ప్రజా రవాణా వ్యవస్థను నిలిపివేసింది. ఫలితంగా- దూర ప్రాంతాల నుంచి హైకోర్టుకు రావాల్సిన ఉద్యోగులు, న్యాయవాదులు, పిటీషనర్లు ఇబ్బందులకు గురి అవకాశాలు ఉన్నాయి. వ్యక్తిగత వాహనాలు, ప్రైవేటు వాహనాలపైనా ప్రభుత్వం ఆంక్షలు విధించిన నేపథ్యంలో హైకోర్టుకు చేరుకోవడానికి ప్రధానంగా పిటీషనర్లు రాలేకపోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.
ఈ అంశాన్ని పలువురు న్యాయవాదులు, బార్ అసోసియేషన్ల ప్రతినిధులు ఇప్పటికే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. లిఖితపూరకంగా వారు వినతిపత్రాన్ని సైతం అందించినట్లు చెబుతున్నారు. వారి అభిప్రాయాలు, ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రధాన న్యాయమూర్తి ఈ దిశగా కీలక నిర్ణయాన్ని తీసుకుంటారని తెలుస్తోంది. దీనిపై ఆయన తన తోటి న్యాయమూర్తుల అభిప్రాయాలను కూడా సేకరిస్తున్నారని అంటున్నారు.
ఆదివారం నాటి దేశవ్యాప్త జనతా కర్ఫ్యూ విజయవంతం కావడం, ప్రజలు స్వచ్ఛందంగా స్వీయ గృహనిర్బంధం వైపు మొగ్గు చూపడంతో అటు తెలంగాణ, ఇటు ఏపీ రాష్ట్ర ప్రభుత్వాలు.. లాక్డౌన్ పరిస్థితులను ఈ నెల 31వ తేదీ వరకు పొడిగించిన విషయం తెలిసిందే. ప్రభుత్వ ఉద్యోగులకు సైతం వర్క్ ఫ్రమ్ హోమ్ సౌకర్యాన్ని కల్పించింది జగన్ సర్కార్. ఈ పరిస్థితుల్లో ప్రజారవాణా సైతం బంద్ కావడం వల్ల తలెత్తిన రవాణా ఇబ్బందుల నేపథ్యంలో.. హైకోర్టు కార్యకలాపాలు కూడా స్తంభించిపోవచ్చని అంటున్నారు.