హైకోర్టులో ఊరట: మాజీ మంత్రి దేవినేని ఉమకు బెయిల్ మంజూరు
అమరావతి: మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వర రావుకు హైకోర్టులో ఊరట లభించింది. బుధవారం ఆయనకు బెయిల్ మంజూరైంది. కృష్ణా జిల్లా జి.కొండూరు పోలీస్ స్టేషన్లో ఆయనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, పలు సెక్షన్ల కింద కేసులు నమోదైన విషయం తెలిసిందే.
తనపై కావాలని అక్రమంగా కేసులు పెట్టారంటూ దేవినేని ఉమా హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం ఉమకు బెయిల్ మంజూరు చేసింది. విచారణ సందర్భంగా ఉద్దేశపూర్వకంగానే దేవినేని ఉమపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారని ఆయన తరపు న్యాయవాది వాదించారు.
పిర్యాదుదారు ఆరోపిస్తున్నట్లుగా పిటిషనర్ ఏ నేరానికి పాల్పడలేదని కోర్టుకు చెప్పారు. ఫిర్యాదుదారుది ఏ సామాజికవర్గమో తెలియదని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కొండపల్లిలో జరిగిన పార్టీ సమావేశంలో గ్రామస్తులు అటవీ ప్రాంత సమస్యను దేవినేని ఉమ దృష్టికి తీసుకెళ్లడంతో అప్పటికప్పుడు నిర్ణయించుకుని ఆ ప్రాంతానికి వెళ్లారని ఆయన తరపు న్యాయవాది కోర్టుకు వివరించారు.
కస్టడీ కోసం మచిలీపట్నం కోర్టులో పోలీసులు పిటిషన్ దాఖలు చేశారని ప్రభుత్వం తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. కేసు విచారణ జరుగుతోందని, మిగిలిన నిందితులను అరెస్ట్ చేయాల్సి ఉందని, ఈ దశలో బెయిల్ ఇవ్వడం సరికాదని ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపించారు. మంగళవారం ఇరువైపులా వాదనలు విన్న హైకోర్టు.. బుధవారం ఉమకు బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.
కాగా, కొండపల్లి అటవీ ప్రాంతంలో అక్రమ మైనింగ్ జరుగుతోందనే సమాచారంతో పరిశీలన కోసం ఇటీవల దేవినేని ఉమ అక్కడకు వెళ్లారు. ఈ క్రమంలో జి.కొండూరు ప్రాంతంలో ఘర్షణ వాతావరణం నెలకొంది. దీనికి దేవినేని ఉమ కారణమని పోలీసులు కేసు నమోదు చేశారు.
Recommended Video
కుట్ర, హత్యయత్నం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టారు. గత బుధవారం కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. ఇప్పటి వరకు ఆయన రాజమండ్రి జైల్లో ఉన్నారు. తనపైనే దాడి చేసి తానే దాడి చేశానంటూ అధికార పార్టీ నేతలు కుట్రపూరితంగా తనపై కేసులు పెట్టారని దేవినేని ఉమ ఆరోపించారు.