హెడ్ క్వార్టర్స్ ఇక్కడా.. సిబ్బంది అక్కడా ఎలా సాధ్యం: ప్రభుత్వాన్ని వివరణ కోరిన ఏపీ హైకోర్టు
అమరావతి: ఏపీ రాజధాని తరలింపుపై ఆ రాష్ట్ర హైకోర్టులో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. రాజధాని తరలింపు పిటిషన్లను విచారణకు స్వీకరించిన హైకోర్టు ప్రభుత్వానికి కొన్ని ప్రశ్నలు సంధించింది. వేరే ప్రాంతానికి రాజధానిని తరలించాల్సిన అవసరం ఏమొచ్చిందని వ్యాఖ్యానించిన న్యాయస్థానం స్థలం సరిపోకపోతే మరో భవంతిలోకి మార్చాలి తప్ప ఏకంగా వేరే ప్రాంతానికే ఎందుకు మారుస్తున్నారో తెలుపుతూ అఫిడవిట్ దాఖలు చేయాలని త్రిసభ్య ధర్మాసనం పేర్కొంది.
ఇక సచివాలయం గురించి కూడా ప్రస్తావించిన రాష్ట్ర హైకోర్టు... సచివాలయంలో ఎంతమంది ఉద్యోగస్తులు పనిచేస్తున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. విజిలెన్స్, ప్రధాన కార్యాలయాలు ఒక చోట ఉంటే... సిబ్బంది మరోచోట ఉండి విధులు ఎలా నిర్వహిస్తారో అఫిడవిట్ ద్వారా తెలపాలని ఆదేశించింది హైకోర్టు. విజిలెన్స్ కమిషన్, జీఏడీ రెండూ వేర్వేరు ఎలా అవుతాయని ప్రశ్నించింది. మరోవైపు రాజధాని తరలింపు కార్యాలయాల తరలింపుపై మాత్రమే ముందుకు వెళ్లాలని పిటిషనర్లకు ధర్మాసనం సూచించింది.
ప్రభుత్వ సలహాదారుల వ్యాఖ్యలు, అధికారుల సర్వీసుల రూల్స్ ఉల్లంఘనలాంటి అంశాలను ఈ పిటిషన్లలో జతచేయడం ఎందుకని పిటిషనర్లను ప్రశ్నించింది. సలహాదారులు కోర్టులపై దుష్ప్రచారం చేస్తున్నారని పిటిషనర్ల తరపున లాయర్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఎవరేమి మాట్లాడుతున్నారో అనే వివరాలు తమ వద్ద ఉన్నాయని చెప్పిన ధర్మాసనం... న్యాయవ్యవస్థ హుందాతనం ఎలా కాపాడుకోవాలో తమకు తెలుసని వ్యాఖ్యానించింది. ఆపై తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.