R-5: ఏపీ సర్కారుకు హైకోర్టులో షాక్, సర్కారు ఉత్తర్వుల సస్పెన్షన్
అమరావతి: హైకోర్టులో ఆంధ్రప్రదేశ్ సర్కారుకు ఎదురుదెబ్బ తగిలింది. రాజధాని భూములను పేదల ఇళ్ల స్థలాలకు కేటాయించాలన్న నిర్ణయం విషయంలో హైకోర్టు షాకిచ్చింది. రాజధాని మాస్టర్ ప్లాన్లో మార్పులు చేస్తూ గృహ నిర్మాణ జోన్(ఆర్-5 జోన్)పై ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను నాలుగు వారాలపాటు హైకోర్టు సస్పెండ్ చేసింది.
తదుపరి విచారణను జూన్ 17కు వాయిదా వేసింది. కాగా, రాజధాని మాస్టర్ ప్లాన్లో మార్పు చేయాలంటే ప్రజాభిప్రాయ సేకరణ తప్పనిసరి అని పిటిషనర్ వాదించారు. స్థానిక సంస్థలు, గ్రామ కమిటీల అభిప్రాయాలు సేకరించాల్సి ఉంటుందని తెలిపారు. ఈ క్రమంలో ప్రభుత్వ ఉత్తర్వులను హైకోర్టు సస్పెండ్ చేసింది.
కాగా, రాజధాని మాస్టర్ ప్లాన్ ప్రకారం ఇప్పటి వరకు 4 నివాస జోన్లు ఉండేవి. ఆర్-1 ప్రస్తుత గ్రామాలు, ఆర్-2 తక్కువ సాంద్రత గృహాలు, ఆర్-3 తక్కువ నుంచి మధ్యస్థాయి సాంద్రత కలిగిన గృహాలు, ఆర్-4 హైడెన్సిటీ జోన్ పేర్లతో 4 రకాల నివాస జోన్లు ఇప్పటి వరకు ఉండేవి.
అయితే, రాజధానిలోని కృష్ణాయపాలెం, వెంకటపాలెం, నిడమర్రు, కురగల్లు, మందడం, ఐనవోలు గ్రామాల పరిధిలోని 967.25 ఎకరాలను నివాస ప్రాంతాలుగా బదలాయిస్తూ ఇటీవలే ప్రకటన చేసింది. అందులోని 900.97 ఎకరాలను ఆర్-5 జోన్ గా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో దీనిపై రాజధాని రైతులు హైకోర్టును ఆశ్రయించారు.