ఏపీలో జూన్ 8 నుంచి తెరచుకోనున్న హోటళ్లు, రెస్టారెంట్లు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరికొన్ని లాక్డౌన్ సడలింపులకు సిద్ధమైంది. జూన్ 8 నుంచి రాష్ట్రంలో హోటళ్లు, రెస్టారెంట్లు తెరిచేందుకు అనుమతిస్తున్నట్లు పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ ప్రకటించారు. మంగళవారం ఆయన విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడారు.
తెలంగాణలో మరోసారి భారీగా పెరిగిన కరోనా కేసులు, మరణాలు
కరోనావైరస్ లాక్డౌన్ నిబంధనలకు అనుగుణంగా పలు సూచనలతో హోటళ్లు, రెస్టారెంట్లు నడిపే అవకాశం కల్పించనున్నట్లు మంత్రి అవంతి తెలిపారు. హోటళ్లను పునర్ ప్రారంభించడంపై ఒకట్రెండు రోజుల్లో రాష్ట్ర హోటల్ సమాఖ్యతో చర్చించనున్నట్లు మంత్రి వెల్లడించారు.
కరోనా లాక్డౌన్ కారణంగా మూడు నెలల కాలంలో హోటళ్ల యాజమాన్యాలు తీవ్ర ఇబ్బంది పడ్డాయన్నారు. ఈ క్రమంలో కరోనాపై తగిన జాగ్రత్తలు తీసుకుంటూనే పర్యాటక రంగ హోటల్స్, ప్రైవేటు హోటళ్లు, రెస్టారెంట్లు నడిపేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు మంత్రి అవంతి తెలిపారు.
ఇది ఇలావుండగా, ఆంధ్రప్రదేశ్ పరిధిలోని స్టేషన్ల మధ్య రైలు ప్రయాణాలపై విధించిన ఆంక్షలను తక్షణం ఎత్తివేస్తూ రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. ప్రారంభ, గమ్య స్థానాలు రెండూ రాష్ట్ర పరిధిలోనే ఉన్నప్పటికీ రైలు ప్రయాణాన్ని కొనసాగించవచ్చు. ఇక టికెట్ బుకింగ్స్ కూడా ప్రారంభిస్తున్నట్లు రైల్వే శాఖ పేర్కొంది.
కాగా, గత 24 గంటల్లో మంగళవారం ఉదయం 9గంటల వరకు ఏపీలో కొత్తగా 82 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 12,613 మందిని పరీక్షించగా 82 మందికి కరోనా సోకినట్లు తేలింది. రాష్ట్రంలో నమోదైన మొత్తం 3200 కేసుల్లో 2209 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. 64 మంది మరణించారు. ప్రస్తుతం కరోనా బారినపడిన 927 మంది చికిత్స పొందుతున్నారు.