చట్టంలోనే ఉంది, జగన్ చికిత్స చేయించుకోవాలి: దేవినేని ఉమ
విజయవాడ: తాము తెలంగాణతో తగాదాలు కోరుకోవడం లేదని, అన్నదమ్ముల్లా కలిసుందామని ఆంధ్రప్రదేశ్ భారీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు అన్నారు. ప్రాజెక్టులకు ఎలాంటి అనుమతులు ఉండాలో చట్టంలోనే ఉందని ఆయన శుక్రవారం మీడియాతో అన్నారు.
అదే సమయంలో ప్రతిపక్ష నేత, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. రెండు రాష్ట్రాలు బాగుండాలని చంద్రబాబు కోరుకుంటున్నట్లు ఆయన చెప్పారు. ఎపి రైతుల హక్కులను కాపాడాల్సిన బాధ్యత తమపై ఉందని అన్నారు.
కృష్ణా, గోదావరి బోర్డులను తెలంగాణ ప్రభుత్వం గౌరవించాలని ఆయన అన్నారు. కాంగ్రెసు కనుసన్నల్లోనే రాష్ట్ర విభజన చట్టాన్ని రాశారని ఆయన విమర్సించారు. చంద్రబాబుపై జగన్ మతి లేకుండా మాట్లాడుతున్నారని దేవినేని ఉమ వ్యాఖ్యానించారు. చంద్రబాబుపై జగన్ అనుచిత వ్యాఖ్యలు సరికాదన్నారు.
జగన్ మానసిక స్థితి బాగాలేదని, ఆస్పత్రిలో చికిత్స చేయించుకోవాలని అన్నారు. రాజారెడ్డిని జగన్ ఆదర్శంగా తీసుకుని మాట్లాడుతున్నారని విరుచుకుపడ్డారు. చంద్రబాబుపై జగన్ ప్రయోగించిన భాష అభ్యంతరకరంగా ఉందని అన్నారు. ప్రాజెక్టులపై ప్రతిపక్షం అనవసరమైన రాద్ధాంతం చేస్తోందని ఉమ అన్నారు.