ఏపీకి సహకరిస్తాం: బాబుతో సత్య నాదెళ్ల, చంద్రబాబు భారీ టార్గెట్
రాష్ట్రానికి 14500 కోట్ల డాలర్ల మేరకు పెట్టుబడులను సాధించే దిశగా తమ ప్రభుత్వం అన్ని ప్రయత్నాలూ చేస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. మైక్రోసాఫ్ట్ ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈవో).
ముంబై/విజయవాడ: రాష్ట్రానికి 14500 కోట్ల డాలర్ల మేరకు పెట్టుబడులను సాధించే దిశగా తమ ప్రభుత్వం అన్ని ప్రయత్నాలూ చేస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో 2029 నాటికి తలసరి ఆదాయాన్ని రూ.10.72 లక్షలకు (16017 డాలర్లు) చేర్చాలనేదే తమ లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రం 100 బిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా ఉందని, 2029కి 946 బిలియన్ డాలర్లు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు.
ప్రస్తుతం రాష్ట్రంలో తలసరి ఆదాయం రూ.1.14 లక్షలుగా (1709 డాలర్లు) ఉందని వెల్లడించారు. ముంబయిలో మైక్రోసాఫ్ట్ సంస్థ 'ఫ్యూచర్ డీకోడెడ్' అనే అంశంపై నిర్వహించిన సదస్సులో చంద్రబాబు బుధవారం కీలకోపన్యాసం చేశారు. సాంకేతికత, ఇంటర్నెట్ విప్లవాత్మక మార్పులు తీసుకురావచ్చని చెప్పారు. గోదావరి పుష్కరాల్లో డ్రోన్ టెక్నాలజీని ఉపయోగించామని, కృష్ణా పుష్కరాలను రియల్టైమ్ గవర్నెన్స్కు ఒక మోడల్గా తీసుకోవాలని సంకల్పించి మైక్రోసాఫ్ట్ సహకారంతో విజయవంతంగా అమలు చేశామని తెలిపారు.
మైక్రోసాఫ్ట్ రూపొందించిన 'కైజాలా' యాప్ ద్వారా పుష్కరాలను దిగ్విజయంగా నిర్వహించగలిగామని చెప్పారు. గత ఏడాది దేశం మొత్తం సగటు వృద్ధి రేటు 7.5 శాతం ఉంటే ఆంధ్రప్రదేశ్ 10.99 శాతం సాధించిందని వెల్లడించారు. ఈ ఏడాది ప్రథమార్థంలో జాతీయ వృద్ధి రేటు 7.2 శాతం ఉంటే రాష్ట్ర వృద్ధి రేటు 12.23 శాతం ఉందని చెప్పారు. 2029 కల్లా రాష్ట్రానికి 125 బిలియన్ల నుంచి 145 బిలియన్ డాలర్ల పెట్టుబడులు తీసుకురావాలనేదే తమ లక్ష్యమని వివరించారు. హ్యాపీనెస్ ఇండెక్స్లో కూడా మొదటి స్థానంలో రాష్ట్రాన్ని ఉంచేందుకు నిర్ణయించామన్నారు. ఈ కార్యక్రమంలో మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల తదితరులు పాల్గొన్నారు.
సత్య నాదెళ్లతో చంద్రబాబు ప్రత్యేక భేటీ
మైక్రోసాఫ్ట్ ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈవో) సత్య నాదెళ్లతో చంద్రబాబు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా 'రాష్ట్రంలో హైబ్రిడ్ క్లౌడ్ కంప్యూటింగ్ సాంకేతిక పరిజ్ఞానంలో, డిజిటల్ సాంకేతికత, రియల్టైమ్ గవర్నెన్స్లో సహకరించండి. స్కైప్ వీడియో కాన్ఫరెన్సింగ్లో మైక్రోసాఫ్ట్ కొత్తగా రూపొందించిన యాప్ను రాష్ట్రానికి అందించండి' అని చంద్రబాబునాయుడు సత్య నాదెళ్లను కోరారు. కాగా, ఇందుకు స్పందించిన నాదెళ్ల. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని, తగిన సాంకేతిక సహకారం అందించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు.
రాష్ట్రంలో హైబ్రిడ్ క్లౌడ్ కంప్యూటింగ్ సాంకేతిక పరిజ్ఞానంలో, డిజిటల్ సాంకేతికత, రియల్టైమ్ గవర్నెన్స్లో సహకరించాలని చంద్రబాబు కోరగా ఆయన అంగీకరించారు. ప్రజలతో మమేకమయ్యేలా స్కైప్ వీడియో కాన్ఫరెన్సింగ్లో మైక్రోసాఫ్ట్ కొత్తగా రూపొందించిన సాంకేతిక యాప్ను రాష్ట్రానికి అందించాలని చంద్రబాబు కోరినట్లు తెలిసింది.
ఈ యాప్ ద్వారా ఒకేసారి వందల మందితో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి వారితో నేరుగా సంభాషించే వీలుంటుంది. సత్య నాదెళ్ల మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి, తగిన సాంకేతిక సహకారం అందించడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. లింక్డిన్లో మైక్రోసాఫ్ట్ కొత్తగా రూపొందించిన ప్లేస్మెంట్స్ అండ్ ప్రాజెక్ట్ సంగమ్లపైనా చంద్రబాబు చర్చించారు.
చైనా బృందాన్ని కలిసిన సిఎం
విజయవాడలో చైనాకు చెందిన సిచువాన్ ప్రోవిన్సియల్ పీపుల్స్ గవర్నమెంట్ ప్రతినిధులను ముఖ్యమంత్రి మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వారికి వివరించారు. ఇది ఇలా ఉండగా, విశాఖపట్నాన్ని నగదు రహిత నగరంగా తీర్చిదిద్దడానికి మైక్రోసాఫ్ట్ సదస్సులో పాల్గొనడానికి ముంబై వచ్చిన ముఖ్యమంత్రి సమక్షంలో థామ్సన్ రాయిటర్స్తో రాష్ట్ర ప్రభుత్వం అవగాహనా ఒప్పందం కుదుర్చుకుంది. దీని ప్రకారం ఆ సంస్థ విశాఖపట్నాన్ని నగదు రహిత నగరంగా మార్చడానికి, డిజిటల్ లావాదేవీలను పెంచేందుకు సాంకేతిక సహకారం అందిస్తుంది. ఇందుకోసం ఆ సంస్థ ఫిన్టెక్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది.
వీసా సంస్థ కూడా రాష్ట్రంలో ఫిన్టెక్ రంగంలో సహకరించడానికి ముందుకొచ్చింది. ప్రభుత్వ, ప్రైవేటు కార్పొరేట్ రంగాల్లో డిజిటల్ లావాదేవీల పురోగతికి వీలుగా అత్యాధునిక క్విక్ రెస్పాన్స్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ సాంకేతిక సహకారాన్ని ఈ సంస్థ అందజేస్తుంది. స్థిరమైన ఆర్థిక సమ్మిళితానికి వీసా తోడ్పడనుంది. విశ్వవిద్యాలయాలు, కళాశాలలతో ఆ సంస్థ అనుసంధానమై డిజిటల్ అక్షరాస్యత, డిజటల్ ఆర్థిక లావాదేవీల రంగంలో శిక్షణ ఇవ్వనుంది.