వైఎస్ జగన్ భారీ టార్గెట్: వచ్చే నాలుగేళ్లలో లక్షన్నర కోట్లు..అప్పుల దిశగా: రుణం పుట్టకపోతే
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్కార్కు సంక్షేమ ప్రభుత్వం అనే గుర్తింపు వచ్చింది. రాష్ట్రంలో అభివృద్ధి మాటెలా ఉన్నా.. సంక్షేమ పథకాలు జోరుగా సాగుతున్నాయి. ప్రతిపక్ష నేత హోదాలో నిర్వహించిన పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన వాగ్దానాలు, ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన హామీలను అమలు చేస్తోంది. కరోనా వైరస్ మిగిల్చిన సంక్షోభ కాలంలోనూ సంక్షేమ పథకాల అమలుకు బ్రేక్ వేయలేదు ప్రభుత్వం.
ప్రమాణస్వీకారం రోజు జగన్ ఖర్చు 43 లక్షలు, కార్యక్రమానికి 59 లక్షలు- సంభ్రమాశ్చర్యంతో లోకేష్ ట్వీట్లు
మద్యంపై వచ్చే ఆదాయానికి
ప్రస్తుతం ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలన్నీ నిధులతో ముడిపడి ఉన్నవే.. వందల కోట్ల రూపాయల వ్యయంతో కూడుకుని ఉన్నవే. కరోనా వల్ల ఖజానాకు రావాల్సిన రాబడి స్తంభించిపోయింది. మద్యం అమ్మకాల ద్వారా వచ్చే నిధులపైనే ఆధారపడుతుంది.. సాధారణంగా ఏ ప్రభుత్వమైనా. ఏపీలో దీనికి భిన్నమైన పరిస్థితి నెలకొంది. మద్యం అమ్మకాలను ప్రభుత్వం ఏ రేంజ్లో నియంత్రించిందో తెలిసిన విషయమే. బెల్ట్ షాపులను ఎత్తేసింది. మద్యం దుకాణాలను తగ్గించింది. వాటి అమ్మకాలకూ కళ్లెం వేసింది. మద్యం ద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం అంతంత మాత్రమే.
అభివృద్ధి ప్రాజెక్టుల కోసం..
ఒకవంక సంక్షేమ పథకాలను అమలు చేయడానికి.. మరోవంక నీటి ప్రాజెక్టులు, పోర్టుల నిర్మాణం సహా మౌలిక రంగానికి నిధులను కేటాయించాలంటే రుణాలను తీసుకోవడంపై దృష్టిని కేంద్రీకరించింది. అందుకే- ఇప్పుడు ఆ దిశగా చర్యలను తీసుకుంటోంది జగన్ ప్రభుత్వం. వచ్చే నాలుగేళ్ల కోసం భారీగా నిధులను సమీకరించుకోవడానికి కసరత్తు చేస్తోంది. కనీసం లక్షన్నర కోట్ల రూపాయలను రుణాలుగా సమీకరించుకోవాలని భావిస్తోంది. వాటికోసం మార్గాలను అన్వేషించే పనిలో పడింది.
అమరావతిపై ఖర్చుకు..
సంక్షేమ పథకాల అమలును కొనసాగిస్తూనే.. అభివృద్ధి పనులకు పూనుకుంటోంది. అభివృద్ధి పనులు అంటే మొట్టమొదటగా గుర్తుకొచ్చేది ఒకటి.. రాజధాని అమరావతి నిర్మాణం, రెండు..నీటి ప్రాజెక్టులు, మూడు..రోడ్లు, నాడు-నేడు వంటి మౌలిక సదుపాయాలు. ఈ రెండింట్లో అమరావతి నిర్మాణం జోలికి వెళ్లట్లేదు జగన్ సర్కార్. మూడు రాజధానుల కాన్సెప్ట్లో భాగంగా అమరావతి నుంచి సచివాలయాన్ని విశాఖపట్నానికి తరలించడం ఖాయమైనందున.. అమరావతి ప్రాంతంలో ఒక్క శాశ్వత నిర్మాణానికీ సుముఖంగా లేదు. అందుకే తన లిస్ట్ నుంచి దాన్ని తొలగించేసింది. మిగిలిన వాటిపైనే ఫోకస్ పెట్టింది.
నీటి ప్రాజెక్టుల కోసం లక్ష కోట్లు..
భవిష్యత్తులో తాము సేకరించబోయే లక్షన్నర కోట్ల రూపాయల రుణ మొత్తంలో అధిక వాటాను భారీ నీటి ప్రాజెక్టుల నిర్మాణంపై కేటాయించబోతోంది. 98 వేల కోట్ల రూపాయలను నీటి ప్రాజెక్టుల నిర్మాణానికి వినియోగించుకోవాలని భావిస్తోంది. పోలవరాన్ని కేంద్ర ప్రభుత్వం జాతీయ ప్రాజెక్టుగా గుర్తించినందున.. దానికయ్యే ఖర్చును భరించాల్సిన బాధ్యత రాష్ట్రం మీద లేదు. మిగిలిన ప్రాజెక్టుల నిర్మాణానికి 98 వేల కోట్ల రూపాయలను కేటాయించాల్సి ఉంటుందని అంచనా వేసింది.
Recommended Video
వాటర్ గ్రిడ్ కోసం..
ప్రభుత్వం తలపెట్టిన వాటర్గ్రిడ్ నిర్మాణానికి 19,088 కోట్ల రూపాయలు, నాడు-నేడు పథకం కింద ప్రభుత్వ పాఠశాలలకు మౌలిక సదుపాయాలను కల్పించడానికి, వాటిని అభివృద్ధి చేయడానికి 6,657 కోట్ల రూపాయలు, రోడ్ల నిర్మాణానికి 7,650 కోట్ల రూపాయలు, డాక్టర్ వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్ల కోసం 1745 కోట్ల రూపాయలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను అభివృద్ధి చేయడానికి 671 కోట్ల రూపాయలను కేటాయించవచ్చని తెలుస్తోంది. ఈ దిశగా ఆర్థికమంత్రిత్వ శాఖ ఓ సమగ్ర ప్రణాళికను రూపొందించినట్లు సమాచారం. రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నీలతో నిర్వహించిన సమీక్ష సందర్భంగా వైఎస్ జగన్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు.