డిఎస్సీ నోటిఫికేషన్ ఉందా?...లేదా?...ప్రభుత్వం నాన్చుడుతో ఇంటిదారి పడుతున్న అభ్యర్థులు
Recommended Video
అమరావతి:ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించిన డిఎస్సీ నోటిఫికేషన్ జారీపై రాష్ట్ర ప్రభుత్వం నాన్చుడు ధోరణితో నిరుద్యోగులు తీవ్ర నిస్పృహకు లోనవుతున్నారు.
ఇదిగో డిఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తుందంటూ ప్రభుత్వం పలుమార్లు ప్రకటించినా ఆయా తేదీల్లో నోటిఫికేషన్ విడుదల కాకపోవడంతో ఇక డిఎస్సీ రావడం కష్టమనే అభిప్రాయం నిరుద్యోగుల్లో వ్యక్తం అవుతోంది. ఇప్పటివరకూ డిఎస్సీ కోచింగ్ తీసుకుంటున్నఉపాధ్యాయ ఉద్యోగార్థులు ఇక ఇంటిముఖం పడుతుండటమే ఇందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు.
సుమారు రెండేళ్ల నుంచి అదిగో డిఎస్సీ...ఇదిగో డిఎస్సీ అంటూ నిరుద్యోగుల్లో ఆశలు రేపుతూ వస్తున్న ప్రభుత్వం ఇప్పటికీ వాయిదాల పర్వం కొనసాగిస్తూనే ఉంది. దీంతో అసలు నోటిఫికేషన్ వస్తుందో లేదో తెలియక అభ్యర్థులు ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. రాష్ట్రంలో 10,351 పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వీటిని భర్తీ చేసేందుకు జులై 6 న నోటిఫికేషన్ ఇస్తామని మానవ వనరలు అభివృద్ధి శాఖా మంత్రి గంటా శ్రీనివాసరావు గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే.
అయితే అది ఆచరణకు నోచుకోలేదు...మంత్రి ఆ ప్రకటన చేసి కూడా రెండు నెలలు గడుస్తున్నా ఇంకా త్వరలో వస్తుందని దాటవేసుకుంటూ వస్తున్నారే తప్పితే నోటిఫికేషన్ జాడలేదు. దీంతో ఆందోళన చెందిన కొందరు అభ్యర్థులు అసలు ఈ నోటిఫికేషన్ ఎప్పుడు విడుదలవుతుందో...అసలు విడుదవులవుతుందో లేదోననే స్పష్టత కోసం విద్యాశాఖ, ఆర్థిక శాఖ అధికారులను విచారించినా సమాధానం చెప్పడం లేదు.
దీని విషయం తమ చేతుల్లో ఏమీ లేదని...ప్రభుత్వమే దీనిపై నిర్ణయం తీసుకోవాలని వారు చేతులేత్తి నమస్కరిస్తున్నారట. మరికొందరు అభ్యర్థులు డిఎస్సీ నోటిఫికేషన్పై ప్రభుత్వ ఫిర్యాదుల నెంబర్ 1100కు ఫోన్ చేసి ప్రశ్నిస్తున్నారట...అయితే అక్కడ కూడా వారికి జవాబు కరువైందట. దీంతో నోటిఫికేషన్ వస్తుందేమో అని ఇప్పటివరకు ఆశగా నిరీక్షించిన ఉపాధ్యాయ ఉద్యోగార్థులు ఇక తాము ఈ ఉద్యోగాల కోసం శిక్షణ పొందుతున్న కోచింగ్ సెంటర్ల నుంచి ఇంటి దారి పడు తున్నట్లు తెలిసింది.
అందుకు నిదర్శనంగా రెండు నెలల క్రితం వరకు విజయవాడలోని ఒక కోచింగ్ సెంటర్లో 500 మంది అభ్యర్థులు ఉంటే ప్రస్తుతం వారి సంఖ్య 150కు పడిపోయింది. అన్ని కోచింగ్ సెంటర్ల లోనూ పరిస్థితి ఇలాగే ఉందని నిర్వాహకులు చెబుతున్నారు. మరోవైపు 2019 సార్వత్రిక ఎన్నికల కోలాహాలం దగ్గరుపడుతుండటంతో ఈ హడావుడి మధ్య డిఎస్సీ నోటిఫికేషన్ వస్తుందా?...అనే సందేహంతో అభ్యర్థులు ఇలా తిరుగుముఖం పడుతున్నట్లు తెలిసింది.