జగన్ సర్కార్ ముందుజాగ్రత్త: యడ్డీకి ఫోన్..కర్ణాటక సరిహద్దుల్లో ఐసొలేషన్: ఐఎఎస్లకు బాధ్యతలు.. !
చిత్తూరు: భయానక కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ను అమలు చేస్తోన్న నేపథ్యంలో.. పొరుగు రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన తెలుగువారిని రప్పించడానికి జగన్ సర్కార్ కొన్ని సంచలన నిర్ణయాలను తీసుకుంటోంది. మొన్నటిదాకా ఏపీ-తెలంగాణ సరిహద్దుల్లో ఏపీ విద్యార్థులు, ఉద్యోగులు ఎదర్కొన్నటువంటి ఇబ్బందికర పరిస్థితులు మరోసారి తలెత్తకుండా ముందుజాగ్రత్త చర్యలను చేపట్టింది.
కర్ణాటక సరిహద్దుల్లో.. 1300 మంది
కర్ణాటకలోని మంగుళూరు సహా తీర ప్రాంతాల్లో చేపలను వేటాడటానికి కాంట్రాక్టు ప్రాతిపదికన వెళ్లిన తెలుగు ప్రజలు ప్రస్తుతం ఇబ్బందుల్లో చిక్కుకున్నారు. నెల్లూరు-676, ప్రకాశం-231, శ్రీకాకుళం-231, విశాఖపట్నం-114, గుంటూరు-18, విజయనగరం-8, తూర్పు గోదావరి జిల్లా నుంచి ఒకరు ప్రస్తుతం కర్ణాటక సరిహద్దుల్లో చిక్కుకున్నారు. వారిలో 24 మంది ఒడిశాకు చెందిన మత్స్యకారులు కూడా ఉన్నారు. కర్ణాటక, చిత్తూరు జిల్లా సరిహద్దుల్లోని నంగిలి చెక్పోస్ట్ వద్ద 1300మంది ప్రస్తుతం సొంత గడ్డపై అడుగు పెట్టడానికి ఎదురు చూస్తున్నారు.
సరిహద్దుల్లో ఐసొలేషన్ కేంద్రాలు..
ఈ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. రెండు రాష్ట్రాల సరిహద్దుల్లో ప్రత్యేకంగా ఐసొలేషన్ కేంద్రాలను నెలకొల్పాలని నిర్ణయించుకుంది. దీనిపై ఆయన కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్పతో ఆదివారం ఉదయం సంప్రదించినట్లు తెలుస్తోంది. ఈ ఉదయం నిర్వహించిన సమావేశం సందర్భంగా ఈ అంశంపై వైఎస్ జగన్ నిర్ణయం తీసుకున్నారని సమాచారం.
ఇద్దరు ఐఎఎస్లకు బాధ్యతలు..
నిర్ణయం తీసుకోవడంతోనే ఆగిపోలేదాయన. ఇద్దరు ఐఎఎస్ అధికారులకు బాధ్యతలను అప్పగించారు. సతీష్ చంద్ర, పియూష్ కుమార్లకు తాత్కాలిక ఐసొలేషన్ కేంద్రాలను నెలకొల్పే చర్యలను తీసుకోవాల్సి ఉంటుంది. దీనికోసం వారు ఆయా జిల్లాల అధికార యంత్రాంగం, సరిహద్దు రాష్ట్రాల ప్రభుత్వంతో సంప్రదించాల్సి ఉంటుందని వైఎస్ జగన్ సూచించారు. ఒక్క కర్ణాటక నుంచే కాకుండా తెలంగాణ, తమిళనాడు, ఒడిశా, ఛత్తీస్గఢ్ వంటి రాష్ట్రాల నుంచి స్వరాష్ట్రానికి వచ్చే వలస కార్మికుల కోసం సరిహద్దుల వద్ద తాత్కాలికంగా ఐసొలేషన్ కేంద్రాలను నెలకొల్పేలా ముందుజాగ్రత్త చర్యలను తీసుకున్నారు.
తెలంగాణ తరహా ఉద్రిక్తత తలెత్తకుండా..
సరిహద్దుల వరకు వచ్చి వేచి ఉన్నవారికి అన్ని విధాలుగా సాయం చేయడానికి అవసరమైన అన్ని చర్యలను తీసుకోవాలని జగన్ అధికారులను ఆదేశించినట్లు పీవీ రమేష్ వెల్లడించారు. ఏ రాష్ట్రంలో ఉన్నవారికి ఆ రాస్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవలసి ఉంటుందని ఆయన చెప్పారు.ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ఎవరూ ఇతర రాష్ట్రాలలోకి వెళ్లరాదని ఆయన చెప్పారు. కేంద్రం కూడా ఈ మేరకు ఆదేశం ఇచ్చిందని ఆయన తెలిపారు. తెలంగాణ తరహా ఇబ్బందులు తలెత్తకుండా ఉండటానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.