దేవతా మూర్తులు కాదిక.. మహనీయుల విగ్రహాలపై: ఎన్నికల వేళ..అంబేద్కర్ విగ్రహానికి అపచారం
ఏలూరు: రాష్ట్రంలో మొన్నటి దాకా దేవాలయాలపై దాడులు, దేవతా విగ్రహాల విధ్వంసం యథేచ్ఛగా కొనసాగింది. విజయనగరం జిల్లాలోని రామతీర్థం పుణ్యక్షేత్రంలో శ్రీరామచంద్రులవారి విగ్రహం నుంచి తలను వేరు చేయడంతో ఇది కాస్తా పతాక స్థాయికి చేరింది. ఈ ఘటన రాష్ట్రంలో రాజకీయంగా సంచలనం రేపింది. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై ప్రత్యర్థులు దాడి చేయడానికి కారణమైంది. దీని తరువాత జగన్ ప్రభుత్వం తీసుకున్న పకడ్బందీ చర్యల వల్ల హఠాత్తుగా దేవాలయాలపై దాడులు, విగ్రహాల విధ్వంస ఘటనలు ఒక్కసారిగా స్తంభించిపోయాయి. దాని స్థానంలో ఇక మహనీయుల విగ్రహాలపై దాడులు ఆరంభమైనట్లు కనిపిస్తున్నాయి.
రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల కోలాహలం నెలకొన్న వేళ..తొలి విడత పోలింగ్ కోసం నామినేషన్ల పర్వం కొనసాగుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో చోటు చేసుకున్న ఈ ఘటన కలకలం రేపుతోంది. రాజకీయ దుమారానికి దారి తీయొచ్చనే సందేహాలకు తెర తీసింది. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి గుర్తు తెలియని వ్యక్తులు అపచారం చేశారు. విగ్రహం మెడలో చెప్పుల దండను వేసి అవమానించారు. దీన్ని గమనించిన స్థానిక దళిత సంఘాలు ఆందోళనకు దిగాయి. ఈ ఘాతుకానికి పాల్పడిన నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.
పశ్చిమ గోదావరి జిల్లాలోని చింతలపూడిలో ఈ ఘటన చోటు చేసుకుంది. చింతలపూడి నగర పంచాయతీ కార్యాలయానికి ఆనుకునే ఉంది ఈ విగ్రహం. చింతలపూడి ప్రధాన రహదారిపై ఉన్న నగర పంచాయతీ కార్యాలయానికి పక్కనే ఉన్న అంబేద్కర్ విగ్రహానికి గుర్తు తెలియని వ్యక్తులు చెప్పల దండ వేసి ఉండటాన్ని స్థానికులు గుర్తించారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ ఘటన పట్ల స్థానిక దళిత సంఘల నేతలు ఆగ్రహించారు. రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని నినాదాలు చేశారు. మహనీయుల విగ్రహాలను అవమానించడం బాధాకరమని చెప్పారు.
అంబేద్కర్ ఏ ఒక్క కులానికో, మతానికో పరిమితం కాదని అన్నారు. దేశం మొత్తం కట్టుబడి ఉన్న రాజ్యాంగాన్ని నిర్మించిన మహనీయుడని చెప్పారు. ఆయన రచించిన రాజ్యాంగాన్ని ప్రపంచం మొత్తం కీర్తిస్తోందని, అలాంటి జాతీయ నేత విగ్రహాన్ని అవమానించడం దారుణమని వ్యాఖ్యానించారు. అంబేద్కర్ విగ్రహాన్ని అవమానించిన ప్రతి ఒక్కరినీ కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. దళిత సంఘాల నేతల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. దర్యాప్తు చేపట్టారు. అక్కడ అమర్చిన సీసీటీవీ కెమెరా ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.