కోడ్ ఉల్లంఘిస్తే క్రిమినల్ కేసులు తప్పవు: వాలంటీర్లకు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వార్నింగ్
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో వార్డు వాలంటీర్ల సేవలపై రాష్ట్ర ఎన్నికల సంఘం ఆంక్షలు విధించింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్లు, ఎన్నికల అధికారులకు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. మున్సిపల్ ఎన్నికల నిర్వహణఫై పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల కలెక్టర్లతో ఎస్ఈసీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
వాలంటీర్ల ఎన్నికల సేవలు రద్దు
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్లకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల్లో గ్రామ, వార్డు వాలంటీర్ల సేవలను రద్దు చేస్తూ సంచలనం నిర్ణయం ప్రకటించారు. గుర్తింపు పొందిన పార్టీ ప్రతినిధుల నుంచి ఎన్నికల సంఘానికి వార్డు వాలంటీర్లపైనా ఫిర్యాదులు వచ్చాయని ఎస్ఈసీ నిమ్మగడ్డ తెలిపారు. రాజకీయ కార్యకలాపాలకు వారు దూరంగా ఉండాలన్నారు. మున్సిపల్ ఎన్నికలు పార్టీ గుర్తులపైనే జరుగుతాయన్నారు. స్వేచ్ఛాయుత ఎన్నికలకు వాలంటీర్లపై కఠిన చర్యలు అవసరమవుతాయన్నారు.
వాలంటీర్ల ప్రభుత్వ విధులకే పరిమితం
రాజకీయ ప్రక్రియ నుంచి వాలంటీర్లను పూర్తిగా దూరంగా ఉండాలని స్పష్టం చేశారు. అభ్యర్థికి, పార్టీకి అనుకూలంగా వాలంటీర్లు పాల్గొనకూడదన్నారు. పథకాల పేరుతో ఎన్నికల ఫలితాలను ప్రభావం చేయకూడదన్నారు. ఓటరు స్లిప్పులు కూడా వాలంటీర్లు అందజేయకూడదని స్పష్టం చేశారు. కమిషన్ ఆంక్షలు ఉల్లంఘిస్తే కోడ్ ఉల్లంఘనగా పరిగణిస్తామని తేల్చి చెప్పారు. అయితే, సాధారణ ప్రభుత్వ విధులు నిర్వహించేందుకు వాలంటీర్లకు ఎలాంటి అడ్డంకుల్లేవని ఎస్ఈసీ నిమ్మగడ్డ వివరించారు.
కోడ్ ఉల్లంఘిస్తే క్రిమినల్ చర్యలు తప్పవు
విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎస్ఈసీ నిమ్మగడ్డ మాట్లాడుతూ.. మున్సిపల్ ఎన్నికల సమయంలో వార్డు వాలంటీర్లు తమ పరిధి దాటి వ్యవహరించకూడదన్నారు. కోడ్ ఉల్లంఘించినవారిపై క్రిమినల్ కేసులు పెట్టేందుకు కూడా అవకాశం ఉందని హెచ్చరించారు. ప్రభుత్వం ఇచ్చిన విధుల మేరకే వాలంటీర్ల పనిచేయాలన్నారు.
రాజకీయ పార్టీలు ఎస్ఈసీ కీలక సూచనలు
కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఇంటింటి ప్రచారానికి రాజకీయ పార్టీల నేతలు ఐదుగురికి మించి వెళ్లకూడదని నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్పష్టం చేశారు. ఐదుగురికి మించి వెళ్తే చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలతో కరోనా అదుపులోనే ఉందని, అయినా కరోనాను తేలిగ్గా తీసుకోవద్దన్నారు. మున్సిపల్ ఎన్నిలకు రోడ్ షోలను పరిమితంగా అనుమతిస్తామని, వాటికి అనుమతి తీసుకోవాలన్నారు. సింగిల్ విండ్ విధానం ద్వారా అనుమతులు మంజూరు చేస్తామన్నారు. డబ్బు, మద్యం పంపిణీ అడ్డుకునేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. బలవంతంగా నామినేషన్లను ఉపసంహరించుకున్నవారి పట్ల ఈసారి సానుభూతితో వ్యవహరించి.. వారి అభ్యర్థిత్వాలను పునరుద్దరిస్తామన్నారు. దీనిపై త్వరలోనే ఆదేశాలు జారీ చేస్తామన్ానరు. ఎన్నికల ఏర్పాట్లు సంతృప్తి కొనసాగుతున్నాయని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తెలిపారు.