ఏపీలో వెన్నులో వణుకు పుట్టించేలా: 24 వేలకు చేరువగా: ఒక్కరోజే ఆ 4 జిల్లాల్లో 200లకు పైగా కేసులు
అమరావతి: రాష్ట్రంలో కరోనా వైరస్ అసాధారణంగా విస్తరిస్తోంది. కొద్దిరోజులుగా వరుసగా నాలుగంకెలకు పైగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. 24 గంటల వ్యవధిలో రికార్డు స్థాయిలో కేసులు నమోదు అయ్యాయి. నాలుగు జిల్లాల్లో 200లకు పైగా పాజిటివ్ కేసులు వెలుగులోకి రావడం భయాందోళనలకు గురి చేస్తోంది. ఈ ప్రాణాంతక వైరస్కు ఇప్పట్లో అడ్డుకట్ట పడే అవకాశాలే లేవనే సంకేతాలను పంపించినట్టయింది.
1555 పాజిటివ్ కేసులు..
రాష్ట్రంలో 24 గంటల వ్యవధిలో 1555 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. బుధవారం ఉదయం 9 గంటల నుంచి గురువారం ఉదయం 9 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా 1555 కేసులు నమోదు కాగా.. ఇందులో 1500 వేర్వేరు జిల్లాల్లో, 55 కేసులు విదేశాలు, పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చిన వారి వల్ల నమోదైనట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు తమ తాజా బులెటిన్లో వెల్లడించారు. కొత్తగా 13 మరణాలు నమోదు అయ్యాయి.
24 వేలకు చేరువగా..
దీనితో ఇప్పటిదాకా రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 23,814కు చేరుకుంది. ఇందులో 12154 మంది పేషెంట్లు సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జి అయ్యారు. 277 మంది మరణించారు. యాక్టివ్గా ఉన్న పాజిటివ్ కేసుల సంఖ్య 11,383గా నమోదైంది. 24 గంటల్లో కర్నూలు, గుంటూరు జిల్లాల్లో ముగ్గురు చొప్పున, అనంతపురం, ప్రకాశం జిల్లాల్లో ఇద్దరు చొప్పున మరణించారు. కృష్ణా, పశ్చిమ గోదావరి, చిత్తూరు జిల్లాల్లో ఒక్కొక్కరు కరోనా వైరస్ వల్ల మృత్యువాత పడ్డారు.
నాలుగు జిల్లాల్లో 200లకు పైగా
రాష్ట్రంలో నాలుగు జిల్లాల్లో 200లకు పైగా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. చిత్తూరు-236, గుంటూరు-228, శ్రీకాకుళం-206, విశాఖపట్నం-208 పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. అనంతపురం-91, తూర్పు గోదావరి-47, కడప-114, కృష్ణా-127, కర్నూలు-73, నెల్లూరు-31, ప్రకాశం-96, విజయనగరం-26, పశ్చిమ గోదావరి-17 కేసులు నమోదు అయ్యాయి. ఆరు జిల్లాల్లో రెండువేలకు పైగా కేసులు వెలుగు చూసినట్లు అధికారులు బులెటిన్లో వెల్లడించారు.
కర్నూలు జిల్లాలో
కరోనా వైరస్ వల్ల ఇప్పటిదాకా రాష్ట్రంలో మరణించిన వారి సంఖ్య 277కు చేరుకుంది. అత్యధిక మరణాలు కర్నూలు జిల్లాలో నమోదు అయ్యాయి. ఈ జిల్లాలో 91 మంది మరణించారు. కడప-73, గుంటూరు-24, అనంతపురం-20, చిత్తూరు-17, విశాఖపట్నం-10 మంది చనిపోయారు. మరణాలు సంఖ్య క్రమంగా పెరిగిపోతుండటం ఆందోళనకరంగా పరిణమించింది. కాగా, ఇప్పటిదాకా 10,94,615 శాంపిళ్లకు అధికారులు పరీక్షలను నిర్వహించారు.