ఏపీలో మళ్లీ అదే రేంజ్లో: కుప్పలు తెప్పలుగా: అన్ని చోట్లా.. ఎక్కడా తగ్గేలా కనిపించట్లేదుగా
అమరావతి: రాష్ట్రంలో కరోనా వైరస్ ఉధృతి ఎక్కడా తగ్గట్లేదు. అడ్డుకట్టే పడేలా కనిపించట్లేదు. ప్రతి రోజూ వందల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతూనే ఉన్నాయి. లాక్డౌన్ సడలింపులను అమల్లోకి తీసుకొచ్చిన తరువాత రోజూ వందల సంఖ్యలో కొత్త కేసులు వెలుగు చూస్తూనే ఉన్నాయి. కొత్త ప్రాంతాలకు విస్తరించడం ఆందోళన కలిగిస్తోంది. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చేంత వరకూ ఈ పరిస్థితి తప్పకపోవచ్చంటూ వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు పరోక్షంగా అంగీకరిస్తున్నారు. కొత్తగా రాష్ట్రంలో 24 గంటల వ్యవధిలో మరో 793 కేసులు నమోదు అయ్యాయి.
Recommended Video
భారీగా పాజిటివ్ కేసులు..
రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం ఉదయం 9 గంటల నుంచి సోమవారం ఉదయం 9 గంటల వరకు నిర్వహించిన కరోనా పరీక్షల్లో ఏకంగా 793 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇందులో 706 కేసులు.. వేర్వేరు జిల్లాల్లో నమోదు కాగా.. 87 కేసులు విదేశాలు, పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చిన వారి ద్వారా నమోదైనట్లు వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు తమ తాజా బులెటిన్లో వెల్లడించారు. దీనితో ఇప్పటిాకా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 13, 891కి చేరుకుంది.
మరణాల సంఖ్యా పెరుగుతోంది..
ఇందులో 6232 మంది పేషెంట్లు సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జి అయ్యారు. 180 మంది మరణించారు. 24 గంటల్లో 11 మంది మృతి చెందారు. కర్నూలు జిల్లాలో అయిదు మంది మరణించారు. కృష్ణా, నెల్లూరు జిల్లాల్లో ఇద్దరు చొప్పున మృతిచెందారు. విజయనగరం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు మృత్యువాత పడినట్లు అధికారులు తమ తాజా బులెటిన్లో స్పష్టం చేశారు. మొత్తం కేసుల్లో యాక్టివ్గా ఉన్నవి 7479గా నమోదు అయ్యాయి. 24 గంటల్లో 302 మంది కరోనా పేషెంట్లు ఆసుపత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు.
అత్యధికంగా పశ్చిమలో..
24 గంటల్లో అత్యధికంగా పశ్చిమ గోదావరి జిల్లాలో కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఈ జిల్లాలో 113 కేసులు వెలుగులోకి వచ్చాయి. అనంతపురం-96, చిత్తూరు-56, తూర్పు గోదావరి-72, గుంటూరు-98, కడప-71, కృష్ణా-52, కర్నూలు-86 నెల్లూరు-24, ప్రకాశం-26, విశాఖపట్నం-11, విజయనగరం-1, కేసులు నమోదు అయ్యాయి. శ్రీకాకుళంలో కొత్తగా కేసులు నమోదు కాలేదు. పొరుగు రాష్ట్రాల నుంచి స్వస్థలాలకు వచ్చిన వారి వల్ల 81, విదేశాల నుంచి వచ్చిన వారి వల్ల ఆరు కేసులు నమోదు అయ్యాయి.
30 వేలకు పైగా పరీక్షలు..
రాష్ట్రంలో కరోనా వైరస్ పరీక్షలు గరిష్ఠస్థాయిలో నమోదు అయ్యాయి. 24 గంటల్లో 30,216 శాంపిళ్లను పరీక్షించారు. 24 గంటల వ్యవధిలో 30 వేల శాంపిళ్లను పరీక్షించడం ఇది రెండోసారి. ఇది వరకు 36 వేలకు పైగా శాంపిళ్లను వైద్యాధికారులు పరీక్షించారు. గరిష్ఠ స్థాయిలో వైద్య పరీక్షలను నిర్వహిస్తున్నామని, ఫలితంగా కొత్త కేసులు వెలుగులోకి వస్తున్నాయని స్పష్టం చేశారు. కరోనా వైరస్ పరీక్షల్లో రాష్ట్రం ఇప్పటికే దేశంలోనే అగ్రస్థానంలో కొనసాగుతోంది. కరోనా వైరస్ వ్యాప్తి చెందినప్పటి నుంచీ ఇప్పటిదాకా 8,72,076 మందికి పైగా శాంపిళ్లను సేకరించి, పరీక్షించినట్లు వెల్లడించారు.