కరోనా కాటు: ఏపీలో 206 మంది బలి: ఆ రెండు జిల్లాలో మరణమృదంగం: వందల్లోనే పాజిటివ్ కేసులు
అమరావతి: రాష్ట్రంలో కరోనా వైరస్ మరణాల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. రాష్ట్రంలో ఇప్పటిదాకా నమోదైన కరోనా వైరస్ మరణాల సంఖ్య 200 మార్క్ను దాటింది. కరోనా బారిన పడి కన్నుమూసిన వారి సంఖ్య 207కు చేరుకుంది. చిత్తూరు నుంచి శ్రీకాకుళం దాకా అన్ని జిల్లాల్లోనూ కరోనా మరణాలు నమోదు అయ్యాయి. ప్రత్యేకించి- రెండు జిల్లాల్లో మృతుల సంఖ్య భారీగా ఉంటోంది. కరోనా వైరస్ పాజిటివ్ సంఖ్య తగ్గుముఖం పట్టట్లేదు. వందల సంఖ్యలో కొత్త పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి.
పంద్రాగస్టు నాటికి కరోనా వ్యాక్సిన్: భారత్ బయోటెక్ సన్నాహాలు.. ట్రయల్స్: ఐసీఎంఆర్ కీలక లేఖ
24 గంటల్లో 837 పాజిటివ్ కేసులు..
24 గంటల వ్యవధిలో కొత్తగా 837 పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య, ఆరోగ్యమంత్రిత్వ శాఖ అధికారులు తాజా బులెటిన్లో వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా గురువారం ఉదయం 9 గంటల నుంచి శుక్రవారం ఉదయం 9 గంటల వరకు నిర్వహించిన కరోనా పరీక్షల్లో మొత్తం 837 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇందులో 789 కేసులు వేర్వేరు జిల్లాల్లో నమోదు కాగా విదేశాలు, పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చిన వారి వల్ల 48 కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.
17 వేలకు చేరువగా..
దీనితో ఇప్పటిదాకా రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 16,934కు చేరుకుంది. ఇందులో 7632 మంది పేషెంట్లు సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జి అయ్యారు. 206 మంది మరణించారు. యాక్టివ్గా ఉన్న పాజిటివ్ కేసుల సంఖ్య 9096గా నమోదైంది. ఈ 24 గంటల వ్యవధిలో మొత్తం ఎనిమిది మరణించారు. అత్యధిక మరణాలు కర్నూలు జిల్లాలో నమోదు అయ్యాయి. ఈ జిల్లాలో నలుగురు మృతిచెందారు. చిత్తూరు జిల్లాలో ఇద్దరు చనిపోయారు. కృష్ణా, తూర్పు గోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృత్యువాత పడ్డారు.
మూడు జిల్లాల్లో వందకు పైగా..
24 గంటల్లో అత్యధికంగా అనంతపురం, కర్నూలు, ప్రకాశం జిల్లాల్లో పాజిటివ్ కేసులు వెలుగులోకి వచ్చాయి. అనంతపురం-149, కర్నూలు-116, ప్రకాశం-139 కేసులు నమోదు అయ్యాయి. తూర్పు గోదావరి-56, గుంటూరు-80, కడప-19, కృష్ణా-17, నెల్లూరు-15, శ్రీకాకుళం-30, విశాఖపట్నం-54, విజయనగరం-10, పశ్చిమ గోదావరి-57 కేసులు నమోదు అయ్యాయి. ఫలితంగా- కర్నూలు జిల్లాలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసులు రెండువేలను దాటేశాయి.
Recommended Video
మరోసారి రికార్డు స్థాయిలో..
రాష్ట్రంలో మరోసారి రికార్డు స్థాయిలో కరోనా వైరస్ పరీక్షలను నిర్వహించారు వైద్య, ఆరోగ్యమంత్రిత్వ శాఖ అధికారులు 24 గంటల వ్యవధిలో 38,898 మంది శాంపిళ్లను పరీక్షించారు. ఇదో రికార్డు. ఇప్పటిదాకా ఒక్కరోజులో 36 వేలకు పైగా కరోనా వైరస్ పరీక్షలను నిర్వహించగా.. ఇప్పటిదాకా అదే రికార్డుగా కొనసాగింది. దీన్ని బ్రేక్ చేస్తూ.. 38,898 శాంపిళ్లను పరీక్షించారు. మున్ముందు.. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని, శాంపిళ్ల సంఖ్యను 40 వేలకు పెంచేలా చర్యలను తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటిదాకా రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా వైరస్ పరీక్షల సంఖ్య 9,71,611కు చేరుకుంది.