ఏపీ రాజధానిపై వైసీపీ అప్పుడు అలా, ఇప్పుడు ఇలా.. టీడీపీ-వైసీపీతో రైతుల ఇబ్బందులు: పవన్ కల్యాణ్
ప్రతిపక్షంలో ఉన్నప్పుడే వైసీపీ మూడు రాజధానులు చేస్తామని చెప్పి ఉంటే బాగుండేది అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. అప్పుడు మిన్నకుండిపోయి ఇప్పుడు రాజధానుల అంశాన్ని తెరపైకి తీసుకురావడం సరికాదన్నారు. జనసేన సోషల్ మీడియా విభాగానికి పవన్ కల్యాణ్ ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో మూడు రాజధానులు, కరోనా వైరస్, ఇళ్ల పట్టాలు తదితర అంశాలపై సుదీర్ఘంగా మాట్లాడారు. ఏమన్నారో ఆయన మాటల్లోనే..
భూముల సేకరించడం కూడా తప్పే..?
మూడు రాజధానుల గురించి గత ప్రభుత్వ హయాంలోనే వైసీపీ తన వైఖరి చెబితే.. రైతులు అన్ని వేల ఎకరాలు ఇచ్చేవారు కాదని పవన్ కల్యాణ్ అన్నారు. అప్పుడు అంగీకారం తెలిపి తర్వాత.. రాజధానుల అంశాన్ని తెరపైకి తీసుకురావడం సముచితం కాదన్నారు. గత ప్రభుత్వం కూడా రైతుల నుంచి 30 వేల వరకు భూమిని సేకరించడం తప్పు అని పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. సింగపూర్ తరహా రాజధాని అని చెప్పారు. అయితే ఓకేచోట రాజధాని ఉంటే సాధ్యం.. మారినప్పుడు అభివృద్ది జరగదన్నారు.
అభివృద్ధి అసాధ్యమే..?
ప్రభుత్వం మారడంతో 3 రాజధానుల అంశం తెరపైకి రావడంతో.. అమరావతి కోసం భూములిచ్చిన రైతుల సంగతేంటి అని ప్రశ్నించారు. రాజధాని విడదీసినంత మాత్రాన అభివృద్ది జరుగుతోందని చెప్పడం అంచనా మాత్రమే.. టీడీపీ చెప్పిన సింగపూర్ కాన్సెప్ట్ ఇదీ అని పవన్ స్పష్టంచేశారు. భూముల అవకతవకల విషయంలో తప్పు జరిగితే సరి చేయాలని సూచించారు. కానీ టీడీపీ-వైసీపీ ఆధిపత్య పోరులో రైతులు ఇబ్బందుల పాలవుతున్నారని పేర్కొన్నారు. రైతులు భూములు ఇచ్చింది పార్టీకి కాదు.. ప్రభుత్వానికి అనే విషయం గుర్తుంచుకోవాలన్నారు. అమరావతి రైతులకు తాము అండగా ఉంటామని స్పష్టంచేశారు.
తొలుత అభినందనలు, తెలిసి ఆశ్చర్యపోయా
కరోనా విషయంలో రోగులకు సరైన సదుపాయాలు లేవని తెలిసి ఆశ్చర్యపోయానని పవన్ కల్యాణ్ తెలిపారు. ఇంట్లో ఒకరికీ వైరస్ వస్తే.. మిగతా వారిని బయటకు వెళ్లొద్దని చెప్పడం సరికాదన్నారు. వైరస్ వ్యాక్సిన్ ప్రయోగ దశలో ఉన్నందున.. కరోనా వస్తోంది, పోతుంది అని నేతలు మాట్లాడటం మంచి పద్దతి కాదన్నారు. సరైన జాగ్రత్తలు తీసుకొని ముందడుగు వేయాలన్నారు. కరోనా పరీక్షలు ఎక్కువే చేస్తున్నారని అభినందించానని.. కానీ తర్వాత జరుగుతోన్న పరిణామాలు తెలిసి విస్తుపోయానని పవన్ కల్యాణ్ తెలిపారు.
Recommended Video
పార్టీలకతీతంగా ఇవ్వాల్సిందే...
ఇళ్ల పట్టాల విషయంలో అవకతవకలు జరిగాయని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. నిజమైన లబ్దిదారులను గుర్తించి.. వారికి పట్టాలు అందించాలని కోరారు. గత ప్రభుత్వ హయాంలో 10 వేల కోట్లతో ఇళ్లను నిర్మించారు.. కానీ నేటికి లబ్దిదారులకు అందజేయలేదు అని గుర్తుచేశారు. తాను కర్నూలు, మంగళగిరి వెళ్లినప్పుడు ఇళ్లను చూశానని.. స్థానికులు సమస్యను వివరించారని తెలిపారు. సింగిల్ బెడ్ రూమ్ కోసం రూ.50 వేలు కట్టినా ఇళ్లు రాలేదని చెబుతున్నారని.. ప్రభుత్వాన్ని అడిగితే వైసీపీకి ఓటు వేయలేదని.. మీకు ఇవ్వమని చెబుతున్నారని తెలిపారు. ఇంటి కోసం డబ్బులు కట్టినా ప్రతీ ఒక్కరికీ మంజూరు చేయాలని పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు.