చిత్తూరు జిల్లాలో ఢిల్లీ మత ప్రార్థనల టైమ్ బాాంబ్: శ్రీకాళహస్తిలో 15 మంది అదుపులోకి..
చిత్తూరు: చిత్తూరు జిల్లాలో ఢిల్లీ మత ప్రార్థనలు కలకలం రేపుతున్నాయి. ఈ జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో స్థానికులు దేశ రాజధానిలో నిజాముద్దీన్ ప్రాంతంలోని మర్కజ్ మసీదు భవన సముదాయంలో నిర్వహించిన మత ప్రార్థనల్లో పాల్గొనట్లు తేలింది. జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తికి చెందిన 15 మంది ఢిల్లీ మత ప్రార్థనలకు హాజరై, స్వస్థలానికి వచ్చినట్లు అధికారులు గుర్తించారు. వారందర్నీ అదుపులోకి తీసుకున్నారు. తిరుపతిలో రూయా ఆసుపత్రికి తరలించారు.
ఢిల్లీ మత ప్రార్థనల్లో పాల్గొన్న వారంతా కిందటి నెల 15వ తేదీన శ్రీకాళహస్తికి చేరుకున్నట్లు తెలుస్తోంది. వారిలో కొందరు అనారోగ్యానికి గురైనప్పటికీ.. సొంతంగా వైద్య చికిత్స తీసుకున్నారని సమాచారం. ఈ 15 మందిలో కొందరు ఒకే కుటుంబానికి చెందిన వారు ఉన్నారు. మిగిలిన వారంతా బంధుమిత్రులు. కిందటి నెల 11 నుంచి 13వ తేదీ వరకు ఢిల్లీ నిజాముద్దీన్ ప్రాంతంలోని మర్కజ్ మసీదు భవనంలో నిర్వహించిన సామూహిక ప్రార్థనలకు వారు హాజరయ్యారు.
అదే రోజు రాత్రి వారు స్వస్థలానికి బయలుదేరారని, 15వ తేదీ నాటికి వారు స్వస్థలానికి చేరుకున్నట్లు చెబుతున్నారు. ఢిల్లీ మత ప్రార్థనల్లో పాల్గొని స్వస్థలానికి వచ్చిన తరువాత కరోనా వైరస్ కలకలం పెద్ద ఎత్తున చెలరేగడంతో ఈ 15 మంది భయాందోళనలకు గురయ్యారని, అదే సమయంలో ఒకరిద్దరు అనారోగ్యం బారిన పడినట్లు తెలుస్తోంది. తాము ఢిల్లీ మత ప్రార్థనల్లో పాల్గొని వచ్చామనే విషయాన్ని ఇన్ని రోజులు వారు బయట పడకుండా జాగ్రత్తలు తీసుకున్నారని చెబుతున్నారు.
ఢిల్లీ మత ప్రార్థనల్లో పాల్గొన్న వారికి పెద్ద సంఖ్యలో కరోనా వైరస్ సోకి ఉంటుందనే వార్తలు వెలువడటం, అదే సమయంలో అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా వారి గురించి ఆరా తీస్తుండంతో ఈ 15 మంది అప్రమత్తం అయ్యారు. తాము ఢిల్లీ మత ప్రార్థనలకు వెళ్లొచ్చామనే సమాచారాన్ని వార్డు వలంటీర్ల ద్వారా అధికారులకు తెలియజేశారు. సమాచారం అందుకున్న వెంటనే అధికారులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ప్రత్యేక వాహనంలో వారికి తిరుపతిలోని రూయా ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ఐసొలేషన్ వార్డుల్లో చేర్చారు.