AP Opinion Poll-2020: జగన్ ఏడాదిన్నర పాలనపై జనం ఏమనుకుంటున్నారు? సీఎం రేసులో ఆ మహిళా నేత?
అమరావతి: రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అవుతోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పగ్గాలను అందుకున్నారు. ఈ ఏడాదిన్నర కాలంలో రాష్ట్రంలో పలు అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. రాష్ట్ర పరిపాలన ముఖచిత్రం సమూలంగా మార్చేవేసే నిర్ణయాలు ప్రభుత్వం నుంచి వెలువడ్డాయి. గ్రామ సచివాలయాల ఏర్పాటు, వలంటీర్ల వ్యవస్థ, మూడు రాజధానుల ఏర్పాటు నిర్ణయం, కరోనా వైరస్ వ్యాప్తి.. ఇవన్నీ తెరమీదికి వచ్చాయి.. ఈ ఏడాదిన్నర కాలంలోనే.
ఒపీనియన్ పోల్ మెథడాలజీ ఇదీ..
ఏఏ అంశాలను ప్రతిపాదికగా తీసుకుని, ఎంత మంది ఓటర్ల అభిప్రాయాలను తాము సేకరించామనే విషయాన్ని వీడీపీ అసోసియేట్స్ వెల్లడించింది. పట్టణాలు-32, గ్రామాలు-68 శాతం ప్రజల అభిప్రాయాలను సేకరించింది. 51 శాతం మంది మహిళా ఓటర్లు, 49 శాతం మంది పురుష ఓటర్ల అభిప్రాయాలను తీసుకుంది. కాపు ఉప కులాలు-15 శాతం, ఎస్సీ-19, ముస్లిం-8, ఇతర అగ్ర కులాలు-10, కమ్మ-7, రెడ్డి-9, ఇతర వెనుకబడిన కులాలు-25, ఎస్టీ-6 శాతం మంది అభిప్రాయాలను సేకరించినట్లు వీడీపీ అసోసియేట్స్ వెల్లడించింది.
జనం పల్స్ ఎలా ఉంది?
వైఎస్ జగన్ ఏడాదిన్నర పాలనపై జనం ఏమనుకుంటున్నారు?, వారి పల్స్ ఎలా ఉంది?, కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని జగన్ సర్కార్ ఎంత వరకు విజయం సాధించింది? ప్రధాన రాజకీయ పార్టీల ఓట్ల శాతం స్థితిగతులేంటీ..వంటి అనేక అంశాలపై జాతీయ స్థాయి రాజకీయ సర్వే సంస్థ వీడీపీ అసోసియేట్స్ ఆర్ అండ్ డీ విభాగం ఓ ఒపీనియర్ పోల్ చేపట్టింది. ప్రతిపక్షంగా తెలుగుదేశం పార్టీ పనితీరుపైనా స్టడీ చేసింది. దీనికి సంబంధించిన వివరాలను వెల్లడించింది.
ఓట్ల శాతం మరింత
సాధారణంగా అధికారంలోకి వచ్చిన ఓ రాజకీయ పార్టీపై ప్రజల్లో కొద్దో, గొప్పో అసంతృప్తి వ్యక్తం కావడం సహజం. వ్యతిరేక గాలీ వీయడానికి ప్రధాన కారణమౌతుంది. దాని ఫలితం- ఓట్ల శాతంపై పడుతుంది. సంప్రదాయబద్ధంగా వచ్చే ఈ రాజకీయ పరిణామాలను వైఎస్ఆర్సీపీ అధిగమించిందని ఈ ఒపీనియన్ పోల్ అభిప్రాయపడింది. ఈ ఏడాదిన్నర కాలంలో వైఎస్ఆర్సీపీ తన ఓట్ల శాతాన్ని మరింత పెంచుకోగలిగిందని స్పష్టం చేసింది. గత ఏడాది పోలింగ్ ముగిసే నాటికి వైఎస్ఆర్సీపీ 49.95 శాతం పోలింగ్ను సాధించగా.. ఈ ఏడాదిన్నర కాలంలో అది 52.97కు పెరిగింది. అంటే 3.02 శాతం ఓటింగ్ శాతాన్ని పెంచుకుంది. అదే సమయంలో టీడీపీ 0.89 శాతం మేర ఓట్లను పెంచుకోగలిగింది.
ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ వైపే మొగ్గు..
ఈ ఏడాదిన్నర కాలంలో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ వైపే రాష్ట్ర ప్రజలు మొగ్గు చూపారు. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ పనితీరు బాగుందంటూ 53.40 శాతం మంది ప్రశంసించారు. చంద్రబాబు నాయుడి వైపు 40.60 శాతం మంది ఓటు వేశారు. ఈ ఇద్దరు నేతల మధ్య వ్యత్యాసం 12.80 శాతంగా నమోదైంది. పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రిగా-3.90 శాతం, దగ్గుబాటి పురంధేశ్వరి-1.10 శాతం, కన్నా లక్ష్మీనారాయణ పట్ల ఒకశాతం మంది ఓటర్లు మొగ్గ చూపారు. ఈ జాబితాలో భారతీయ జనతా పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు పురంధేశ్వరి పేరును చేర్చడం ఆసక్తి రేపుతోంది.
Recommended Video
ప్రతిపక్ష పార్టీగా టీడీపీ
రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీగా తెలుగుదేశం పనితీరు బాగుందని 59 శాతం మంది మెచ్చుకుంటున్నట్లు వీడీపీ అసోసియేట్స్ వెల్లడించింది. బీజేపీ, జనసేన, కాంగ్రెస్ కంటే కూడా ప్రధాన ప్రతిపక్షంగా టీడీపీ పనితీరు భేషుగ్గా ఉందని 59 శాత మంది ప్రజలు అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడంలో వైఎస్ జగన్ ప్రభుత్వం ఆశించిన స్థాయిలో పనిచేస్తోందంటూ 72 శాతం మంది ప్రజలు అభిప్రాయపడ్డారు. జాతీయ స్థాయిలో తీసుకుంటే ఈ శాతం మరింత అధికం. ప్రధానమంత్రి తీసుకుంటోన్న చర్యల కంటే జగన్ పనితీరే బాగుందని అభిప్రాయపడటం కొసమెరుపు. కేంద్ర ప్రభుత్వం తీసుకునే కరోనా కట్టడి చర్యలు బాగున్నాయంటూ 57 శాతం మంది మెచ్చుకున్నారు.