కర్నూలులో భూమాకు జగన్ చెక్: ఎవరీ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి?
హైదరాబాద్: మొన్నటి వరకు ఓ సాధారణ ఎమ్మెల్యే. ఈరోజు ఏపీ అసెంబ్లీలో ప్రజా పద్దుల కమిటీ (పీఏసీ) ఛైర్మన్. తొలిసారిగా రాజకీయ రంగప్రవేశం చేసిన డోన్ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిని వైసీపీ అధినేత, ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత వైయస్ జగన్ ఎంపిక చేయడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది.
ఈ క్రమంలో ఎవరీ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. 2014 సాధారణ ఎన్నికలకు ముందు వరకు ఈ పేరు రాష్ట్ర రాజకీయాలకు కొత్త. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వైయస్ జగన్ కొత్త పార్టీ పెట్టేదాకా ఈ పేరు ఎవరికి తెలియదు. పార్టీ ఆవిష్కరించిన వైయస్ జగన్ రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా చేపట్టిన పర్యటనలో భాగంగా కర్నూలు జిల్లాలో 2012లో ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
సాధారణ ఎన్నికలకు ఇంకా రెండేళ్లు సమయం ఉన్నప్పటికీ, వైసీపీ తరుపున అసెంబ్లీలో ఎన్నికల్లో పోటీ చేసే తొలి అభ్యర్ధిని ఆ పార్టీ అధినేత వైయస్ జగన్ ప్రకటించారు. ఓ బహిరంగ సభలో డోన్ నియోజకవర్గ టిక్కెట్ను బుగ్గనకు ఇవ్వనున్నట్లు జగన్ ప్రకటించారు.
ఆ తర్వాత 2014లో వచ్చిన సాధారణ ఎన్నికల్లో ముందుగానే ప్రకటించిన హామీ మేరకు బుగ్గన రాజేంద్రనాథ్కు డోన్ అసెంబ్లీ టికెట్ ఇచ్చారు. తొలిసారిగా రాజకీయ రంగ ప్రవేశం చేసిన బుగ్గన తన ప్రత్యర్ధి టీడీపీ సీనియర్ నేత, ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి సోదరుడు కేఈ ప్రతాప్పై విజయం సాధించారు.
నిజానికి అప్పటివరకు డోన్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉంది. అలాంటి డోన్ నియోజకవర్గంలో 1,152 ఓట్ల మెజారిటీతో కేఈ ప్రతాప్పై గెలుపొంది తొలిసారిగా అసెంబ్లీలో అడుగు పెట్టారు. ఆ తర్వాత గత అసెంబ్లీ సమావేశాల్లో బుగ్గన చేసిన ప్రసంగం అటు వైసీపీతో పాటు టీడీపీని సైతం ఆకట్టుకుంది.
అదేవిధంగా అందరితో కలివిడిగా ఉంటే బుగ్గన అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తిని అంకుల్ అంటూ పిలిచి సభలో నవ్వులు పూయించారు. ఇటీవల ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు ప్రవేశపెట్టిన బడ్జెట్ పై ప్రసంగించిన బుగ్గన అధికార పార్టీని నిలదీయడంలో సఫలీకృతమయ్యాడు.
ఇటీవల రైతు రుణమాఫీపై మాట్లాడుతూ ఎప్పుడు మాఫీ అవుతాయంటే నందోరాజా భవిష్యతి, డ్వాక్రా రుణాలు ఎప్పుడు మాఫీ అవుతాయంటే నందో రాజా భవిష్యతి.. ఇలా ప్రతి అంశానికి అదే మంత్రం పఠించారు. ఆయన నందోరాజా భవిష్యతి కథ చెప్పి ప్రతి హామీపై తనదైన శైలిలో నవ్వించాడు.
'రాజు గారికి ఇద్దరు భార్యలు ఉన్నారు. చిన్న భార్య కొడుకు నందుడు. చిన్న భార్యకు ఊళ్లో అన్నిచోట్ల అఫ్పులే ఉన్నాయి. వాటిని ఎఫ్పుడు తీరుస్తారు అంటే ఏదో ఓ రోజు నందుడు రాజు కాకపోతాడా. అప్పులు తీర్చకపోతానా అని చెబుతూ వచ్చారు' అని కథ చెప్పాడు.
ఈ క్రమంలో రాజేంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ.. నందుడిలాగే.. చినబాబు రాకపోతాడా రుణమాఫీ చేయకపోతామా, చినబాబు రాకపోతాడా డ్వాక్రా రుణాలు మాఫీ చేయకపోతామా అన్నట్లు అధికార టిడిపి పరిస్థితి ఉందని ఎద్దేవా చేశారు. కర్నూలు జిల్లాలోని బేతంచర్లకు చెందిన బుగ్గన కర్ణాటక రాష్ట్రంలోని గుల్బర్గా యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ ఇంజనీరింగ్ పట్టా అందుకున్నారు.
అయితే పీఏసీ పదవికి సీనియర్లను సైతం పక్కనబెట్టి బుగ్గనను ఎంపిక చేయడం వెనుక కర్నూలు జిల్లాలో భామా నాగిరెడ్డి వర్గానికి చెక్ పెట్టేందుకేనని వైసీపీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నారు.