ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణపై కసరత్తు...అన్ని శాఖలకు ప్రశ్నావళి:వివరాలు కోరిన పిఆర్సి
అమరావతి:ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణకు కసరత్తు మొదలైంది...వేతన సవరణ ఎలా చేయాలి?...మార్గదర్శకాలు ఎలా ఉండాలి?...అనే అంశాలపై ఫీడ్ బ్యాక్ రాబట్టేందుకు యత్నాలు ప్రారంభమయ్యాయి.
రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా అన్ని ప్రభుత్వ శాఖల అధికారులకు 11వ వేతన సవరణ కమిషన్ నుంచి ఒక ప్రశ్నావళి అందినట్లు తెలిసింది. ఈ ప్రశ్నావళిలో అనేక కోణాల్లో పిఆర్ సి ప్రశ్నలు సంధించిందని సమాచారం. అంతేకాదు వీటిపై వీలయినంత త్వరగా వివరాలు అందించాలని కోరినట్లు తెలిసింది. మరోవైపు వేతన సవరణ కారణంగా తలెత్తే ఆర్ధిక భారం, ఉద్యోగ నియామకాలు, ఖజానాలో ఆదాయ, వ్యయాలపై కమిషన్ ఆరా తీస్తున్నట్లు సమాచారం.
ఫీడ్ బ్యాక్...ఇవ్వండి
ప్రభుత్వ ఉద్యోగుల నుంచి తమకు కావాల్సిన వివరాలతోపాటు, సూచనలు కూడా అందచేయాలంటూ అన్ని ప్రభుత్వ శాఖలకు వేతన సవరణ కమిషన్ అధికారులు సర్క్యులర్లు జారీ చేశారు. ఉద్యోగులకు కరవుభత్యం, ఇళ్ల అద్దె, నగరాలు, పట్టణాల్లో చెల్లించాల్సిన అద్దె ఖరారు, మూల వేతనాల్లో మార్పువంటి అంశాలను వేతన సవరణలో చర్చించి ప్రభుత్వానికి సిఫార్సు చేయనుంది. ప్రస్తుతం అమలులో ఉన్న పదవ వేతన సంఘం కాల పరిమితి ముగిసిపోవడంతో పదకొండవ వేతన సంఘాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉద్యోగులతో చర్చలు జరిపేముందు ఫీడ్ బ్యాక్ పొందేందుకు వివిధ శాఖల నుంచి వివరాలు తెప్పించుకోవాలని కమిషన్ యత్నిస్తోంది. ఈ క్రమంలోనే అన్ని శాఖలకు ప్రశ్నావళి పంపించినట్లు తెలిసింది.
గతంలో...సిఫార్సులు
గత వేతన సంఘం ఉద్యోగుల కనీస వేతనాన్ని రూ.13వేలుగా, గరిష్ట వేతనాన్ని రూ. 1,10,850 రూపాయలుగా సిఫార్సు చేయగా, కొత్త కమిషన్లో ఎలాంటి సిఫార్సులు చేయాలనే విషయమై కసరత్తు ప్రారంభమైంది. ఈ నేపథ్యంలోనే అసలు కనీస, గరిష్ట వేతనాలు ఎంత ఉండాలనేది సూచించాల్సిందిగా కమిషన్ అన్ని శాఖల అధికారులను కోరింది. అలాగే కేటగిరీ వారీగా ఎంత వేతనం ఉండాలనే విషయం కూడా చెప్పాలని కోరింది. ఇప్పుడు అనుసరిస్తున్న మాస్టర్ స్కేల్ను యదాతథంగా కొనసాగించాలా, లేక మార్పులు చేయాలా అన్నదానిపైనా అభిప్రాయాలు చెప్పాలని సూచించింది. అలాగే ఉద్యోగులకు చెల్లించాల్సిన ఫిట్మెంట్ను జీతంలో శాతంగా చెల్లించాలా, లేక సర్వీసు ఇంక్రిమెంట్ల ఆధారంగా చెల్లించాలా అనే వివరాలు అడిగింది.
ప్రస్తుతం...ఇలా
ప్రస్తుతం ఉద్యోగులకు కనీసం మూడు శాతం తో ఇంక్రిమెంట్లు చెల్లిస్తుండగా, దానిని ఎంతకు మార్చాలనే విషయంపైనా పిఆర్సి అభిప్రాయాలు కోరుతోంది. ఇదే సమయంలో అనేక శాఖలో ఒకే విధులకు సంబంధించిన కామన్ కేటగిరీ పోస్టులు అమలులో ఉన్నాయి. వాటిల్లో చేయాల్సి మార్పుల పై కూడా శాఖల అధికారుల అభిప్రాయాలను కోరింది. గరిష్ట వేతన స్థాయికి ఉద్యోగి చేరిన తరువాత అతనికి చెల్లించాల్సిన ఇంక్రిమెంట్లు నిలుపుదలపై కూడా అభిప్రాయాలను కోరింది. ప్రస్తుతం వివిధ శాఖల్లో పనిచేస్తున్న వర్క్ఛార్జ్డ్, రోజువారీ వేతన, కంటింజెంట్ ఉద్యోగులకు అదనంగా ఉన్న ఔట్సోర్సింగ్ ఉద్యోగులను కొనసాగించాలా, లేదా అన్నదానిపైనా వేతన సవరణ కమిషన్ దృష్టి సారించినట్లు తెలుస్తోంది. దీనిపై అభిప్రాయాలు చెప్పాలని అధికారులను కోరింది. ఔట్సోర్సింగ్ ఉద్యోగులను కొనసాగించాలంటే అందుకు కొత్తగా అనుసరిరచాల్సిన మార్గదర్శకాలపైనా సూచనలు అడిగింది.
చెల్లింపులు...భ్యతాలపై...వివరాల సేకరణ
అలాగే ప్రస్తుతం ఉద్యోగులకు అమలు చేస్తున్న ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ పథకం, ప్రత్యేక వేతన చెల్లింపులు, మెడికల్ సౌకర్యాలు, కరవు భత్యం, నగర నివాస భత్యం, ఇంటి అద్దె చెల్లింపులు, ఎల్టిసి సౌకర్యం వంటి వాటిపైనా పిఆర్సీ సూచనలు కోరింది. అలాగే రానున్న కాలంలో పిఆర్సి వల్ల పెరిగే ఆర్ధిక భారంపైనా ముందుగానే వివరాలు సేకరిస్తున్నట్లు తెలిసింది. ప్రభుత్వ పరంగా ఖర్చులు తగ్గించుకునేందుకు వివిధ శాఖలు తీసుకుంటున్న చర్యలు, ఆదాయాన్ని పెంచేందుకు అమలు చేస్తున్న కార్యక్రమాలు, పింఛన్ల కోసం ప్రత్యేక నిధి ఏర్పాటు అంశాలపైనా పిఆర్సీ ఆరా తీస్తోంది. ప్రస్తుతం ఉన్న ఉద్యోగుల్లో వారిని ఏయే కేటగిరీల్లో నియామకం చేయాల్సి ఉంటుంది...ఒకవేళ వారిని కుదించాల్సి వస్తే ఆ వివరాలు కూడా చెప్పాలని పిఆర్సీ కోరింది.